sanju samson: కేరళలో సంజూ క్రేజ్‌.. సూర్యకుమార్‌ ఫిదా!

జట్టులో లేని సంజూ శాంసన్‌ కోసం అభిమానులు నినాదాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Published : 28 Sep 2022 01:26 IST

తిరువనంతపురం: టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైన భారత జట్టులో కేరళ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు చోటుదక్కకపోవడంపై అభిమానులు నిరాశతో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు సిరీస్‌ల టీ20లో తొలి మ్యాచ్‌ బుధవారం సాయంత్రం తిరువనంతపురంలో జరగనుంది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఎంతో కీలకంగా మారిన ఈ మ్యాచ్‌ కోసం భారత ఆటగాళ్లు ఆదివారం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.  

ఈ సందర్భంగా వారికి  స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులతో ఆ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సును చుట్టుముట్టిన వారంతా జట్టులో లేని సంజూ శాంసన్‌ కోసం నినాదాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ అభిమానం సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆకట్టుకుంది. వారి ఉత్సాహాన్ని గమనించిన అతడు వెంటనే తన మొబైల్‌ ఫోన్‌ తీసి అందులో సంజూ ఫోటోను అభిమానులకు చూపుతూ వారిలో మరింత జోష్‌ నింపాడు. ఈ యువ ఆటగాడికి ఉన్న క్రేజ్‌ నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  ఈ ఫొటోలకు సంజూను ట్యాగ్‌ చేస్తూ యుజ్వేంద్ర చాహల్‌, అశ్విన్‌, రోహిత్‌ శర్మ తమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో అప్‌లోడ్‌ చేశారు.  మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ సఫారీలతో టీ20 మ్యాచ్‌కు సైతం అతడు ఎంపిక కాలేదు. అనంతరం న్యూజిలాండ్‌- ఏ జట్టుతో భారత్‌- ఏ జట్టుకు జరగనున్న మూడు సిరీస్‌ల వన్డే మ్యాచ్‌కు సారథిగా సంజూ వ్యవహరించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని