సంక్షిప్త వార్తలు(4)

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ఆటగాడు భమిడిపాటి సాయి ప్రణీత్‌ శుభారంభం చేశాడు. గత కొంతకాలంగా ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న అతను ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు.

Published : 02 Feb 2023 02:49 IST

సాయి ప్రణీత్‌ శుభారంభం
థాయ్‌లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ఆటగాడు భమిడిపాటి సాయి ప్రణీత్‌ శుభారంభం చేశాడు. గత కొంతకాలంగా ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న అతను ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో సాయి ప్రణీత్‌ 21-13, 21-14తో క్రిస్టోఫెర్సెన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించాడు. కిరణ్‌ జార్జ్‌ 21-17, 19-21, 23-21తో చియా లీ (చైనీస్‌ తైపీ)పై నెగ్గి ముందంజ వేశాడు. సమీర్‌వర్మ 14-21, 16-21తో షై ఫెంగ్‌ (చైనా) చేతిలో, మిథున్‌ మంజునాథ్‌ 18-21, 12-21తో కెంటా నిషిమొటొ (జపాన్‌) చేతిలో, ప్రియాంశు రజావత్‌ 21-14, 19-21, 25-27తో క్వాంగ్‌ హీ (కొరియా) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో అష్మిత చాలిహా 21-16, 21-19తో అనుపమ ఉపాధ్యాయపై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో రోహన్‌ కపూర్‌- సిక్కిరెడ్డి జోడీ 21-11, 21-16తో అలెగ్జాండర్‌- జోసెఫిన్‌ (కెనడా) జంటపై విజయం సాధించింది. సుమీత్‌రెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీ 11-21, 17-21తో రెహాన్‌- లిసా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది.


ఛాంప్స్‌ సహర్ష, దీక్షిత, సంహిత

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ పాఠశాలల చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు చల్లా సహర్ష, మోదిపల్లి దీక్షిత, పుంగవనం సంహిత అదరగొట్టారు. తమిళనాడులో జరిగిన ఈ టోర్నీలో సహర్ష, దీక్షిత, సంహిత ఛాంపియన్లుగా నిలిచారు. అండర్‌-13 బాలురలో సహర్ష (8 పాయింట్లు), అండర్‌-11 బాలికల్లో దీక్షిత (7.5), అండర్‌-9 బాలికల్లో సంహిత (8) అగ్రస్థానాల్లో నిలిచి స్వర్ణ పతకాలు సాధించారు. అండర్‌-7 బాలికల్లో బోగ వంశిక (7) రజతం, బాలుర విభాగంలో ఎ.దివిత్‌రెడ్డి (7.5) కాంస్య పతకాలు నెగ్గారు.


నేను పాక్‌కు కోచ్‌గా ఉండను: అక్రమ్‌

కరాచి: ఏనాడూ పాకిస్థాన్‌ జాతీయ జట్టుకు కోచింగ్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించలేదని ఆ దేశ మాజీ కెప్టెన్‌ వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు. దేశంలో కోచ్‌లు, కెప్టెన్లు తీవ్ర దూషణలకు గురి కావడమే అందుకు కారణమని చెప్పాడు. ‘‘జట్టు బాగా ఆడనప్పుడు విమర్శిస్తే అంగీకరించగలను. కానీ పాకిస్థాన్‌లో కెప్టెన్‌, కోచ్‌లను ప్రతి ఒక్కరూ విమర్శించడమే కాదు, దూషిస్తారు కూడా. దాన్ని భరించడం చాలా కష్టం. దూషణలను, కొన్నిసార్లు ద్వేషాన్ని.. కెప్టెన్‌, కోచ్‌ భరించాల్సి ఉంటుంది. కానీ నేను భరించలేను. నాకంత సహనం లేదు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో దూషణలను తట్టుకోవడం  కష్టం. కొందరు రోజంతా ట్విట్టర్లో గడుపుతూ ప్రతికూల వ్యాఖ్యలు చేస్తుంటారు’’ అని అక్రమ్‌ అన్నాడు. జాతీయ జట్టుకు కోచింగ్‌   ఇవ్వడంతో పాటు వచ్చే ఒత్తిడిని తాను కోరుకోవట్లేదని చెప్పాడు.


తెలంగాణకు మూడు పతకాలు

భోపాల్‌: ఖేలో ఇండియా యూత్‌ క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు సత్తాచాటారు. బుధవారం కయాకిగ్‌- కనోయింగ్‌లో తెలంగాణ ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సాధించింది. 1000 మీటర్ల రేసులో ప్రదీప్‌- అభయ్‌ రజతం, మహేంద్ర సింగ్‌- కునాల్‌ కాంస్య పతకాలు నెగ్గారు. మూడో స్థానంలో నిలిచిన అమిత్‌ కుమార్‌ కాంస్యం గెలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని