Dinesh karthik: కివీస్‌తో చివరి టీ20.. సూర్య స్థానంలో సంజూ అయితే బెటర్‌: డీకే

న్యూజిలాండ్‌తో చివరి టీ20లో సూర్యకుమార్‌కు బదులుగా సంజు శాంసన్‌కు అవకాశం కల్పించాలని సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు.

Updated : 22 Nov 2022 10:17 IST

దిల్లీ: న్యూజిలాండ్‌తో చివరి టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌కు బదులుగా సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించాలని సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆరితేరిన సంజూ ఈ మ్యాచ్‌లో అదనపు ప్రయోజనం అవుతాడని తెలిపాడు. నేపియర్‌ వేదికగా మంగళవారం కివీస్‌ జట్టుతో టీమ్‌ఇండియా తలపడనున్న విషయం తెలిసిందే. 

‘‘సూర్యకుమార్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి కల్పించి రానున్న వన్డేల్లో తిరిగి జట్టులో చేర్చుకోవచ్చు. జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారంతా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. వారికి కేవలం ఒకే ఒక్క గేమ్‌లో అవకాశం కల్పించడం అన్యాయమే అవుతుంది. సూర్య స్థానంలో సంజూకు టీమ్‌ఇండియా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అతడు ఫాస్ట్‌ బౌలింగ్‌ను ఇష్టపడతాడు. నేపియర్‌లో ఉండే పరిస్థితులు అతడి ఆటతీరుకు సరిగ్గా సరిపోతాయి. షార్ట్‌ పిచ్‌ బంతులకు బాగా స్పందిస్తాడు. ఈ చివరి టీ20లో నేను సూర్యకు బదులుగా సంజూ శాంసన్‌ను చూడాలనుకుంటున్నా’’ అని డీకే తెలిపాడు. రెండో టీ20లో కీలక సమయంలో దీపక్‌ హుడాను ఉపయోగించుకోవడంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సఫలమయ్యాడని డీకే ప్రశంసించాడు. కొత్తగా నాయకత్వ బాధ్యతలు చేపట్టినా జట్టును సమర్థంగా నడిపించాడన్నాడు.

ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా  ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని