IND vs AUS: ప్రాక్టీస్‌ మ్యాచ్‌ లేకుండానే టెస్టు సిరీస్‌ ఆడటమా..?: ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌ పోటీకు ముందు టీమ్‌ఇండియా (Team India), ఆస్ట్రేలియా (Australia) చివరి టెస్టు సిరీస్‌ను ఆడబోతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి మొదలుకానుంది. పాయింట్ల పట్టికలో ఆసీస్‌ తొలి స్థానంలో, భారత్‌ రెండో స్థానంలో ఉన్నాయి.

Published : 31 Jan 2023 21:40 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడేందుకు ఆస్ట్రేలియా ఇక్కడకు రానుంది. ఫిబ్రవరి 9 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే ఇరు జట్ల మధ్య ఎలాంటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ లేకుండానే సిరీస్‌ ప్రారంభం కానుండటం గమనార్హం. ఈ క్రమంలో ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం ఇయాన్‌ హీలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు సిరీస్‌లకు ముందు సన్నద్ధత కోసం సౌకర్యాలను అందించే విషయంలో దేశాల మధ్య సహకారం లోపించినట్లు ఉందన్నాడు. ప్యాట్ కమిన్స్‌ నాయకత్వంలోని ఆసీస్‌ జట్టు మంగళవారం (జనవరి 31) భారత్‌లో అడుగుపెట్టనుంది. ఇక్కడకు రాకముందే సిడ్నీ వేదికగా రెండు రోజుల ‘స్పిన్‌ క్యాంప్‌’ను నిర్వహించింది. 

ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌ లేకుండానే భారత్‌తో నేరుగా టెస్టు సిరీస్‌ ఆడాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీసుకొన్న నిర్ణయాన్ని ఆసీస్‌ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా స్వాగతించాడు. అయితే ఇయాన్‌ హీలీ మాత్రం ఖవాజాను తప్పుబట్టాడు. టెస్టు సిరీస్‌కు పిచ్‌లు పర్యాటక దేశాలకు అనుకూలంగా ఉండవు. వాటిని అర్థం చేసుకోవాలంటే ప్రాక్టీస్‌ మ్యాచ్‌ తప్పకుండా ఉండాలని హీలీ చెప్పాడు. 

‘‘ సిడ్నీలో ఆసీస్‌ స్పిన్నర్లు కలిసి బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. భారత్‌లో ఉన్నట్లుగానే పిచ్‌లను తయారు చేసి మరీ బంతులను సంధించారు. పర్యటించే దేశం అడిగే సౌకర్యాలను ఆతిథ్య జట్టు అందిస్తుందనే నమ్మకం ఇక నుంచి ఉండదు. అయితే మా దృష్టంతా అత్యుత్తమ క్రికెట్‌ ఆడటంతోపాటు భవిష్యత్తు క్రికెటర్లకు అవకాశాలు కల్పించడంపైనే ఉంటుంది. ఇప్పటి నుంచి మేం కూడా సిరీస్‌ కోసం మా వద్దకు వచ్చే పర్యాటక దేశాలకు సరైన సన్నద్ధత నిరాకరించేందుకు అవకాశం ఉంది. అలాంటి మాకు ఇష్టం లేకపోయినా తప్పట్లేదు. ఇలా దేశాల మధ్య అపనమ్మకమైన సంబంధాలను చూడటం నిరుత్సాహంగా ఉంది. ఇలాంటివి ఇప్పటికైనా ఆపాల్సిన అవసరం ఉంది’’

‘‘భారత్‌లో ఎలాంటి సన్నద్ధత లేకుండానే టెస్టు సిరీస్‌ను ఆసీస్‌ ఆడబోతోంది. పర్యాటక దేశాలకు ఇది చాలా ఇబ్బందే. 2004-2005 నుంచి ఇప్పటి వరకు ఆసియా దేశాల్లో ఆసీస్‌ ఒక్క టెస్టు సిరీస్‌నూ నెగ్గలేకపోవడం ఆందోళనకరమే. ఈసారైనా ఆసీస్‌ గెలవాలని ఆశిస్తున్నా. రెండో టెస్టు.. మూడో టెస్టుకు మధ్య పది రోజుల వ్యవధి ఉండటం కూడా కలిసొస్తుంది’’ అని ఇయాన్ హీలీ వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని