Team India- WTC Final: ఆసీస్‌ను వెనక్కినెట్టి టెస్టుల్లో నంబర్‌ వన్‌గా టీమ్‌ఇండియా

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమ్‌ఇండియా (Team India)కు గుడ్ న్యూస్‌. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ను వెనక్కినెట్టి భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

Published : 02 May 2023 20:49 IST

దిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌  ఫైనల్ (WTC Final) ముంగిట టీమ్‌ఇండియాకు గుడ్‌న్యూస్‌. ఐసీసీ (ICC)తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో గత 15 నెలల నుంచి టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా (Australia)ను వెనక్కి నెట్టి భారత్‌ (Team India) అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇటీవల ముగిసిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని టీమ్‌ఇండియా.. 2-1 తేడాతో గెల్చుకుని ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీసీ తాజాగా వార్షిక ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్‌ చేసింది. దీని ప్రకారం 121 రేటింగ్ పాయింట్లతో టీమ్‌ఇండియా అగ్రస్థానంలో నిలవగా.. 116 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానం దక్కించుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. జూన్‌ 7-11 తేదీల్లో లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఒకవేళ మ్యాచ్‌ ఫలితం తేలకుంటే 12వ తేదీని రిజర్వ్‌ డేగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ కోసం బీసీసీఐ ఇటీవల భారత్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఆ ఇద్దరికి గాయాలు.. ఆందోళనలో టీమ్‌ఇండియా

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడే భారత జట్టులో ఉన్న కేఎల్‌ రాహుల్‌, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌ గాయాలపాలయ్యారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో డుప్లెసిస్‌ షాట్‌ను అడ్డుకునే క్రమంలో రాహుల్‌ కుడి తొడకు గాయమవగా.. ఈ మ్యాచ్‌కు ముందు నెట్‌ ప్రాక్టీస్‌లో ఉనద్కత్‌ బౌలింగ్‌ చేస్తూ కిందపడటంతో ఎడమ భుజానికి గాయమైంది. ఈ రెండు గాయాలు తీవ్రంగానే కనిపిస్తుండడం టీమ్‌ఇండియాను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ గాయాలతో వీళ్లిద్దరూ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైతే యశస్వి జైస్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.  జైస్వాల్‌ను కాదనుకుంటే ఇషాన్‌కిషన్‌, అభిమన్యు ఈశ్వరన్‌లలో ఒకరిని చేర్చే ఛాన్స్‌ ఉంది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు ఇదే : 

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ, రహానె, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని