Sehwag: ‘మ్యాచ్‌లు బోర్‌ కొడుతున్నాయి’

IPL: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లు బోర్‌ కొడుతున్నాయంటున్న వీరేంద్ర సెహ్వాగ్‌

Updated : 30 Apr 2021 12:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. శుక్రవారం అహ్మదాబాద్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా కథ మారలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన మోర్గాన్‌ సేనలో రసెల్ (45), శుభమన్‌ గిల్ (43) రాణించడంతో 154 పరుగుల గౌరవప్రదమైన స్కోరును చేసింది. ఓపెనర్లు పృథ్వీషా (82), శిఖర్ ధావన్ (46) పరుగులతో మెరవడంతో దిల్లీ క్యాపిటల్స్‌ 21 బంతులు మిగిలుండగానే విజయతీరాలను చేరింది. దీంతో కోల్‌కతా ఈ సీజన్‌లో ఐదో ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు.

‘‘నేను దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. సినిమాలు చూసినప్పుడల్లా చూసినప్పుడు బోర్‌ కొట్టే సన్నివేశాలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఈ ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా మ్యాచ్‌లు నాకు కొంచెం విసుగు తెప్పిస్తున్నాయి. వాటిని నేను వేగంగా ఫార్వర్డ్ చేసి చూడాలి. చేసిన తప్పులనే పునరావృతం చేస్తూ వారి ఆటతో అందరికీ విసుగు తెప్పిస్తున్నారు. ఛేదనలోనూ అవే తప్పులను చేస్తున్నారు’’ అని వీరూ అన్నాడు.

‘‘పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇవే తప్పులు దొర్లాయి. అదృష్టవశాత్తు కెప్టెన్ మోర్గాన్ 47 పరుగులతో రాణించడంతో అందులో కోల్‌కతా విజయం సాధించింది. జట్టు యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోవడంలేదని నాకనిపిస్తోంది. కెప్టెన్‌ నిర్ణయాలకు మీరు మద్దతు ఇస్తున్నామని మీరు(యాజమాన్యం) చెబుతున్నారు. కానీ, ఫలితాలు మారాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడానికి ప్రయత్నించాలి’’ అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.

కోల్‌కతా బ్యాటింగ్ ఆర్డర్‌ విషయంలో నేనిప్పటికీ సంతోషంగా లేను. ఎందుకంటే నితీశ్‌ రాణా ఓపెనింగ్ చేస్తున్నాడు. అతడు ఓపెనింగ్ చేయనవసరం లేదు. శుభమన్ గిల్ దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 40 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కానీ, ఎక్కువ బంతులు ఆడాడు. ఇది మంచిదే అయినా రన్‌రేట్‌ పడిపోకుండా ధాటిగా ఆడే ఆటగాడు అతనికి జతగా ఉండాలి’’ అని సెహ్వాగ్ ముగించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని