ఆర్‌సీబీ, చెన్నైకి దుబాయ్‌ అనుకూలం!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను యూఏఈకి తరలించడంలో ఇబ్బందేమీ ఉండదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా అన్నారు. అక్కడి వేడి వాతావరణాన్ని తట్టుకోవడమే ఆటగాళ్లకు సవాలని పేర్కొన్నారు.....

Published : 22 Jul 2020 14:40 IST

అంచనా వేసిన ఆకాశ్‌ చోప్రా

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను యూఏఈకి తరలించడంలో ఇబ్బందేమీ ఉండదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా అన్నారు. అక్కడి వేడి వాతావరణాన్ని తట్టుకోవడమే ఆటగాళ్లకు సవాలని పేర్కొన్నారు. ఆర్‌సీబీ, చెన్నై, పంజాబ్‌ వంటి జట్లు అక్కడ రాణించే అవకాశం ఉందని అంచనా వేశారు. తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘ఆకాశ్‌వాణి’లో ఆయన మాట్లాడారు.

‘యూఏఈలో సమస్యలేమీ ఉండకపోవచ్చు. ఆటగాళ్లు మాత్రం వేడిని తట్టుకోవాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే అక్కడ ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువ. ప్రస్తుతం వాతావరణం బాగుంది. సెప్టెంబర్‌, అక్టోబర్ మాసాల్లోనూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. కానీ సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 7 వరకు టోర్నీ అంటున్నారు. మరి ఐదు వారాల్లోనే టోర్నీ ముగించాలంటే ఎక్కువ డబుల్‌ హెడర్స్‌ (రెండు మ్యాచులు) నిర్వహించక తప్పదు. అలాంటప్పుడు సాయంత్రం మ్యాచులు మొదలైతే ఆటగాళ్లు త్వరగా డీహైడ్రేట్‌ అవుతారు’ అని ఆకాశ్ తెలిపారు.

బ్యాటింగ్‌ పరంగా యూఏఈలో ప్రభావమేమీ ఉండదని ఆయన అంచనా వేశారు. అయితే కొన్ని జట్లు అక్కడ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మైదానాలు పెద్దవి కావడంతో ఆర్‌సీబీ వంటి జట్ల బౌలింగ్ లోపాలు బయట పడకపోవచ్చని పేర్కొన్నారు. అలాంటప్పుడు పటిష్ఠ బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న కోహ్లీసేన మెరుగైన ప్రదర్శన చేయొచ్చన్నారు. నాణ్యమైన స్పిన్నర్లున్న చెన్నై సూపర్‌కింగ్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కూ అక్కడి మైదానాలు నప్పుతాయన్నారు. మొత్తంగా వేడి వాతావరణమే పెద్ద సమస్యని ఆకాశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని