IND vs ENG: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు... ఇంగ్లాండ్‌ వికెట్లు ఎలా పడగొట్టారంటే?

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ (IND vs ENG) విజయం సాధించడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. స్వల్ప లక్ష్యమైనా సరే ఏమాత్రం బెదరకుండా.. కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేసి ఇంగ్లాండ్‌ను కుప్పకూల్చారు.

Updated : 30 Oct 2023 11:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆరింట ఆరు విజయాలతో భారత్‌ (Team India) పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. తొలి ఐదు విజయాలు ఒకెత్తు అయితే... ఆరో విజయం మరో ఎత్తు. భారీ స్కోరు లేదని కాస్త నిరాశ పడిన అభిమానులకు.. ‘మేమున్నాంగా కంగారెందుకు’ అంటూ బౌలర్లు ముందుకొచ్చారు. బౌలర్లు నిప్పులు చెరిగారు అంటుంటారు కదా... అచ్చంగా అలాగే బంతులు విసిరారు. ఇంగ్లిష్‌ బ్యాటర్లను (IND vs ENG) బెంబేలెత్తించి పెవిలియన్‌కు పంపించారు. మరి ఏ వికెట్‌ ఎలా పడగొట్టారో చూద్దామా!

ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఔటయ్యారిలా.. 

  • డేవిడ్ మలన్ (16): బుమ్రా ఆఫ్ వికెట్‌ మీదుగా సంధించిన బంతిని (4.5వ ఓవర్) స్క్వేర్‌ కట్‌ ఆడాలని మలన్‌ భావించాడు. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ను తీసుకుని స్టంప్స్‌ను పడగొట్టేసింది. నిలకడగా ఆడుతున్న మలన్‌ వికెట్ పడటంతో భారత శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.
  • జో రూట్‌ (0): క్రీజ్‌లో పాతుకుపోతే ఓ పట్టాన వదలని ఆటగాడు జో రూట్. అలాంటి ఆటగాడు ఆడిన తొలి బంతికే పెవిలియన్‌కు పంపేశారు మనోళ్లు. మలన్‌ను బౌల్డ్‌ చేసిన ఉత్సాహంతో ఉన్న బుమ్రా తన తర్వాతి బంతికే (4.6వ ఓవర్) రూట్‌ను వికెట్ల ముందు పట్టేశాడు. ఇంగ్లాండ్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఎల్బీడబ్ల్యూ నిర్ణయం భారత్‌కే అనుకూలంగా వచ్చింది.
  • బెన్‌ స్టోక్స్‌ (0): వరుసగా ఐదు బంతుల్లో పరుగులు రాకపోవడం.. 9 బంతులు ఆడినా పరుగుల ఖాతా తెరవకపోవడంతో బెన్‌ అసహనంతో కనిపించాడు. దానిని షమీ క్యాష్‌ చేసుకున్నాడు. షమీ సంధించిన (7.6వ ఓవర్‌) బంతికి క్లీన్‌బౌల్డయ్యాడు. ఈ ఓవర్‌ షమీకి వికెట్ మెయిడిన్‌.
  • బెయిర్‌ స్టో (14): షమీ తన మూడో ఓవర్‌ తొలి బంతికే బెయిర్‌స్టోను బౌల్డ్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని (ఇన్నింగ్స్‌లో 9.1వ ఓవర్) ఆడే క్రమంలో ఎడ్జ్‌ తీసుకోవడంతో బంతి వికెట్లను తాకేసింది. హ్యాట్రిక్‌పై ఉన్న షమీ వేసిన తర్వాత బంతిని మొయిన్‌ అలీ డిఫెన్స్‌ ఆడేశాడు. లేకపోతే వరల్డ్‌ కప్‌లో మరో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకునేవాడు. 2019 వరల్డ్‌ కప్‌లో షమీ హ్యాట్రిక్‌ తీసిన విషయం తెలిసిందే.
  • జోస్ బట్లర్‌ (10): ఈ వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే అద్భుతమైన డెలివరీని కుల్‌దీప్‌ సంధించాడు. ఆఫ్‌సైడ్‌గా వేసిన బంతిని (15.1వ ఓవర్) అర్థం చేసుకోవడంలో విఫలమైన బట్లర్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కనీసం, ఆ బంతిని ఎలా ఆడాలనేది కూడా బట్లర్‌కు అర్థం కాలేదంటే అతిశయోక్తి కాదు. ఔటైన తర్వాత అలా చూస్తూ ఉండిపోయాడు.
  • మొయిన్‌ అలీ (15): వరుసగా వికెట్ల పడిన తర్వాత క్రీజ్‌లో పాతుకుపోయి లివింగ్‌స్టోన్‌తో కలిసి భాగస్వామ్యం నిర్మిస్తూ భారత బౌలర్లకు ఇబ్బందిగా మారాడు అలీ. కానీ, మరో స్పెల్‌ బౌలింగ్‌కు (23.1వ ఓవర్) వచ్చిన షమీ తన తొలి బంతికే వికెట్‌ను తీశాడు. లెంగ్త్‌లో పడిన బంతిని ఆడే క్రమంలో మొయిన్‌ అలీ వికెట్‌ కీపర్‌ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. 
  • క్రిస్‌ వోక్స్‌ (10): అప్పటివరకు పరుగులు నియంత్రిస్తూ వచ్చిన రవీంద్ర జడేజా వికెట్‌ కూడా సంపాదించాడు. ప్లైటెడ్‌ డెలివరీని (28.1వ ఓవర్) సంధించి భారీ షాట్‌ కొట్టేలా క్రిస్‌ వోక్స్‌ను ఊరించాడు. అయితే, టర్న్‌ను అంచనా వేయడంలో వోక్స్‌ మిస్‌ అయి కీపర్‌ రాహుల్‌ చేతిలో స్టంపౌట్ అయ్యాడు. 
  • లివింగ్‌స్టోన్‌ (27): లోయర్‌ ఆర్డర్‌లో డేంజరస్‌ బ్యాటర్ అయిన లివింగ్‌స్టోన్‌ క్రీజ్‌లో ఉండటంతో ఇంగ్లాండ్‌కు విజయంపై ఇంకా  అక్కడక్కడా ఆశలు ఉన్నాయి. కానీ, కుల్‌దీప్‌ వేసిన బంతిని (29.2వ ఓవర్) అంచనా వేయడంలో విఫలమైన లివింగ్‌స్టోన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఇంగ్లాండ్‌ ఓటమి ఖరారైంది. 
  • అదిల్‌ రషీద్‌ (13): టెయిలెండర్లు కాసేపు పోరాడినా ఇంగ్లాండ్‌కు అది సరిపోలేదు. రెండు బౌండరీలతో ఓటమి అంతరాన్ని తగ్గించిన రషీద్‌... షమీ సూపర్ డెలివరీకి (33.6వ ఓవర్) సమాధానం చెప్పలేకపోయాడు. క్లీన్‌ బౌల్డ్‌ అయ్యి... షమీకి నాలుగో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 
  • మార్క్‌వుడ్ (0): చివరి బ్యాటర్‌ మార్క్‌వుడ్‌ను బుమ్రా తన ట్రేడ్‌ మార్క్‌ యార్కర్‌తో (34.5వ ఓవర్) క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇది మ్యాచ్‌లో బుమ్రాకు మూడో వికెట్‌. 

ఇలా ఇంగ్లాండ్‌ కుప్పకూలింది. భారత్‌ వంద పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. పాయింట్ల పట్టికలోకి మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ మరో పరాజయంతో ఆఖరి స్థానంలో ఉండిపోయింది. ఇక ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని