
Ashes Series: ఆసీస్ టెస్టు కెప్టెన్గా స్టీవ్స్మిత్.. మూడేళ్ల తర్వాత జట్టు పగ్గాలు
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్గా స్టీవ్స్మిత్ మళ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. మూడేళ్ల తర్వాత అతడు ఈ బాధ్యతలు చేపట్టాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనలో ‘బాల్ టాంపరింగ్’ వివాదంలో చిక్కుకొన్న అతడు.. కెప్టెన్గా ఘోర అవమానంతో ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. అయితే, తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన టిమ్ పైన్ మరో వివాదంలో ఇరుక్కోవడంతో ఈ యాషెస్ సిరీస్కు ముందు బోర్డు ప్యాట్ కమిన్స్ను నూతన సారథిగా ఎంపిక చేసింది. అదే సమయంలో స్మిత్ను ఉపసారథిగా నియమించింది.
ఇక ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో జట్టును విజయపథంలో నడిపించిన కమిన్స్.. రెండో టెస్టుకు ముందు అనుకోని రీతిలో దూరమయ్యాడు. అతడి స్థానంలో స్మిత్ మళ్లీ గ్రీన్ బ్లేజర్ ధరించి గురువారం ఉదయం జోరూట్తో కలిసి టాస్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టాస్ గెలిచిన అతడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ మళ్లీ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించడం గొప్పగా ఉందన్నాడు. ఇదెంతో సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. ‘ఇది నేను గర్వపడాల్సిన విషయం. కమిన్స్ స్థానంలో సారథ్య బాధ్యతలు చేపట్టాను. అతడు ఈ మ్యాచ్లో ఆడకపోవడం బాధగా ఉంది. అయితే, గతవారం అతడెలా జట్టును నడిపించాడో.. నేను అలాగే ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తా’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు.