Covid 19: సగం మ్యాచ్‌లయ్యేసరికి కరోనా.. లీగ్‌లో మళ్లీ ‘2021’ ఆందోళన!

భారత టీ20 లీగ్‌లో ఈ సీజన్‌లోనూ కరోనా భయం వెంటాడుతోంది. తాజాగా దిల్లీ బృందంలో మొత్తం ఆరుగురికి పాజిటివ్‌గా తేలడమే అందుకు కారణం....

Updated : 21 Apr 2022 14:35 IST

గతేడాది కూడా ఇలాగే.. భారత్‌లోనే ఎందుకిలా?

భారత టీ20 లీగ్‌ ఈ సీజన్‌లోనూ కరోనా భయం వెంటాడుతోంది. తాజాగా దిల్లీ జట్టులో ఆరుగురికి పాజిటివ్‌గా తేలడమే అందుకు కారణం. గతేడాది సరిగ్గా ఇలాగే సగం సీజన్‌ పూర్తయ్యాక బయోబబుల్‌లోని వివిధ జట్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో దెబ్బకు టోర్నీని నిరవధిక వాయిదా వేసి తిరిగి సెప్టెంబర్‌ - అక్టోబర్‌లో యూఏఈలో నిర్వహించారు. ఇప్పుడు కూడా కేసులు నమోదవుతుండటంతో... ఏమవుతుంది, ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది..?

2022 సీజన్‌ ప్రారంభానికి ముందు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇక్కడే నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. అందుకు తగ్గట్టే వివిధ నగరాల్లో కాకుండా కేవలం ముంబయి, పుణెలోనే.. నాలుగు స్టేడియాల్లో మొత్తం లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే మార్చి 26న ప్రారంభమైన 15వ సీజన్‌ మూడు వారాల పాటు సజావుగా సాగింది. అయితే, గత శుక్రవారం దిల్లీ శిబిరంలో తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌ కరోనా బారిన పడగా.. తర్వాత స్పోర్ట్స్‌ మసాజ్‌ థెరపిస్ట్‌ చేతన్‌ కుమార్, విదేశీ ఆటగాడు మిచెల్ మార్ష్, టీమ్‌ డాక్టర్‌ అభిజిత్‌ సాల్వి, సోషల్‌ మీడియా కంటెంట్ టీమ్‌ సభ్యుడు ఆకాశ్‌ మానె పాజిటివ్‌గా తేలారు. ఇక బుధవారం పంజాబ్‌తో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నిర్వహించిన యాంటీజెన్‌ పరీక్షల్లో వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ టిమ్‌ సీఫర్ట్‌ కూడా వైరస్‌ బారినపడటంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. పంజాబ్‌తో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనే సందేహాలు తలెత్తాయి. కానీ ఆఖరికి మ్యాచ్‌ అయితే పూర్తయింది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి.?

ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలనేదానిపై టోర్నీ ప్రారంభానికి ముందే నిర్వాహకులు నిబంధనలు రూపొందించారు. ఏ జట్టులోనైనా మ్యాచ్‌ జరిగే రోజు మొత్తంగా 12 మంది ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలి. వారిలో 11 మంది తుదిజట్టులో ఆడాల్సి ఉండగా ఒకరిని సబ్‌స్టిట్యూట్‌గా ఎంచుకోవాలి. అందులోనూ ఏడుగురు భారత క్రికెటర్లు ఉండాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా అలా 12 మంది లేని పక్షంలో ఆ రోజు మ్యాచ్‌ను వాయిదా వేస్తారు. దాన్ని రీషెడ్యూల్‌ చేసి నిర్వహిస్తారు. అప్పుడు కూడా కుదరని పక్షంలో.. విషయాన్ని టోర్నీ టెక్నికల్‌ విభాగానికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్లు అన్ని విధాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే అంతిమం. ఈ నేపథ్యంలోనే బుధవారం పంజాబ్‌తో ఆటకు ముందు దిల్లీ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించి.. వాటిల్లో నెగిటివ్‌గా వచ్చిన వారితో మ్యాచ్‌ కొనసాగించారు. అయితే, ఇక్కడ వేదికను మార్చారు. షెడ్యూల్‌ ప్రకారం పుణెలో జరగాల్సి ఉండగా ముంబయిలోనే పూర్తి చేశారు.

గతేడాది ఇలాగే కదా?

గతేడాది కూడా తొలుత ఈ లీగ్‌ను పూర్తిగా భారత్‌లోనే నిర్వహించాలని చూశారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసినా.. సగం సీజన్‌ పూర్తయ్యాక బయోబబుల్‌లో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. పలువురు ఆటగాళ్లు బబుల్‌ వీడి బయటకు వెళ్లారని, దీంతో వారు వైరస్‌ బారినపడ్డారని తెలిసింది. అలాగే మరికొందరికి విమానాశ్రయాల్లో వైరస్‌ సోకినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసి తిరిగి కొంతకాలం తర్వాత యూఏఈలో మిగతా సీజన్‌ను నిర్వహించారు. ఇప్పుడు కూడా ఈ వారంతో సగం మ్యాచ్‌లు పూర్తవడానికి వచ్చింది. ఇదే సమయంలో దిల్లీ జట్టులో కేసులు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ ఇప్పుడు కేసులు అధికమైతే పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అర్థంకావడం లేదు. మరి నిర్వాహకులు గతేడాది లాగే మిగిలిన మ్యాచ్‌లు తర్వాత ఆడిస్తారా లేక బుధవారం దిల్లీ, పంజాబ్‌ మ్యాచ్‌ను నిర్వహించినట్టు నెగిటివ్‌ వచ్చిన వారితో యథావిథిగా కొనసాగిస్తారా అనేది ఆసక్తిగా మారింది.

యూఏఈలో ఎలా?

2020లో తొలిసారి భారత్‌లో కరోనా ఫస్ట్‌ వేవ్ వచ్చినప్పుడు టోర్నీని ఆరు నెలలు వాయిదా వేశారు. దీంతో మార్చి చివరి వారంలో ప్రారంభం కావాల్సిన 13వ సీజన్‌ సెప్టెంబర్‌లో మొదలైంది. యూఏఈ వేదికగా నిర్వహించిన ఆ సీజన్‌లో కచ్చితమైన నిబంధనలు పాటించారు. ఆటగాళ్లను నిరంతరం పర్యవేక్షించారు. అలాగే సీజన్‌ ప్రారంభానికి ముందే అన్ని జట్ల ఆటగాళ్లను కనీసం రెండు వారాలు క్వారంటైన్‌లో ఉంచారు. ప్రేక్షకులను అనుమతించకుండానే మ్యాచ్‌లు నిర్వహించారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా టోర్నీ ప్రారంభానికి ముందు పలువురు చెన్నై సభ్యులు వైరస్‌ బారిన పడ్డారు. కానీ, తొలి మ్యాచ్‌కు ముందే వారు కోలుకొన్నారు. అయినా, వారు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాకే మ్యాచ్‌లు ఆడారు. దీంతో గతేడాది కూడా రెండో లెగ్‌ను యూఏఈలోనే గట్టి పర్యవేక్షణలో నిర్వహించారు.

భారత్‌లో ఎందుకిలా..?

ఈసారి జనవరిలోనే మనకు ఒమిక్రాన్‌ థర్డ్‌వేవ్‌ వచ్చి వెళ్లింది. తర్వాత ఫిబ్రవరి చివరినాటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీంతో ఈసారి మ్యాచ్‌లన్నీ ఇక్కడే నిర్వహించాలని ప్రణాళికలు వేశారు. అయితే, ఇతర నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే ఆటగాళ్లు మళ్లీ వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉందని భావించి కేవలం ముంబయి, పుణె నగరాలకే టోర్ని లీగ్ దశను పరిమితం చేశారు. అదే సమయంలో కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో స్టేడియంలోనికి ప్రేక్షకులను కూడా 50 శాతం అనుమతిస్తున్నారు. అయితే, తాజాగా బయోబబుల్‌లో కేసులు నమోదవడంతో మున్ముందు ఏం జరగనుందో అర్థంకాని పరిస్థితి. భారత్‌లో ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఎక్కడో ఓ చోట నిర్లక్ష్యం వెంటాడుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. గతేడాది పలువురు ఆటగాళ్లు అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళ్లి బబుల్‌ వీడినట్లు తెలవగా.. ఈ సారి దిల్లీ ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌ వైరస్‌ బారిన పడ్డారని తెలిశాక కూడా విదేశీ ఆటగాళ్లు ఈస్టర్‌ వేడుకలు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బబుల్‌ వాతావరణంలోనూ కాస్తంత నిర్లక్ష్యం తోడైనట్లు పూర్తిగా అర్థమవుతోంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు