TS Exams 2022: వచ్చే నెలలో గ్రూప్‌-4 ప్రకటన!

రాష్ట్రంలో 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చేనెలలో టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ ప్రకటన జారీకి వీలుగా ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది.

Published : 20 May 2022 06:08 IST

త్వరలో 9,168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు
ఈ నెల 29లోగా టీఎస్‌పీఎస్సీకి విభాగాల ప్రతిపాదనలు
సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చేనెలలో టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ ప్రకటన జారీకి వీలుగా ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది. గురువారమిక్కడ బీఆర్‌కే భవన్‌లో గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ ప్రకటనలపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ విభాగాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే అనుమతించిన వాటితో పాటు మిగతా పోస్టులకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయన్నారు. గురుకుల నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని గురుకుల నియామక బోర్డుకు సూచించారు. గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఉత్తర్వులు త్వరలోనే ప్రభుత్వం జారీచేయనున్నట్లు సీఎస్‌ వివరించారు. ఇప్పటికే గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా విభాగాధిపతులు నోటిఫికేషన్‌ జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రోస్టర్‌ విధానం అనుసరించి, రిజర్వేషన్లు ఖరారు చేయాలని, ప్రతి ప్రతిపాదనను ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోవాలన్నారు. జిల్లాస్థాయి పోస్టులు కావడంతో 33 జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంటుందని, ఈ మేరకు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ విభాగాధిపతులు నోడల్‌ అధికారులుగా వ్యవహరించాలని కోరారు. ఈనెల 29 నాటికి టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు అందించాలని, ఆలోగా ప్రతి విభాగం కమిషన్‌ నుంచి సమయం తీసుకుని ప్రతిపాదనల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో చూసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని తెలిపారు.

ఒక్కపోస్టు కూడా తగ్గడానికి వీల్లేదు...

ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలను ఇప్పటికే ఆర్థికశాఖ క్రోడీకరించింది. ఈ సమాచారం ప్రకారం గ్రూప్‌-4 పోస్టులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ విభాగాల వారీగా ఖాళీలను గుర్తించి, ఆ ప్రతిపాదనల్ని సంబంధిత విభాగాలు ఆర్థికశాఖకు అందించాయి. తొలుత ఇచ్చిన సమాచారంతో పోల్చితే, దాదాపు 10-15 విభాగాల్లో పోస్టులు తగ్గినట్లు సీఎస్‌ గుర్తించారు. ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో విభాగాధిపతుల నుంచి వివరణ అడిగారు. ప్రభుత్వ విభాగాల్లో ఎట్టి పరిస్థితుల్లో పోస్టులు తగ్గకూడదని, ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

పదోన్నతుల తరువాత ఖాళీలు కలపాలి

ప్రభుత్వ విభాగాల్లో ఆర్థికశాఖ అనుమతించిన జూనియర్‌ అసిస్టెంట్‌, తత్సమాన స్థాయి పోస్టులను ప్రత్యక్ష నియామకం కింద నోటిఫై చేయాలని సీఎస్‌ సూచించారు. సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేసి, తద్వారా ఏర్పడే జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలను నోటిఫై చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్‌ శర్మ, రజత్‌కుమార్‌, అధర్‌సిన్హా, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్‌, ఏసీబీ డీజీ అంజనీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని