ఏడాదిలో రెండుసార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు

నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కేంద్రం పలు కీలక మార్పులకు సిద్ధమైంది. టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నారు.

Updated : 24 Aug 2023 09:32 IST

విద్యార్థులకు ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం
పాఠశాల విద్య కొత్త కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ విడుదల
ఏ రాష్ట్రం అంగీకరిస్తే అక్కడ అమలు

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కేంద్రం పలు కీలక మార్పులకు సిద్ధమైంది. టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో ఉత్తమ స్కోరు ఎంచుకునే అవకాశం ఉంటుంది. పరీక్షలు సెమిస్టర్‌ పద్ధతిలో పెడతారా, లేక మొత్తం సిలబస్‌పై రెండు సార్లు నిర్వహిస్తారా అనే విషయంపైనా; ఎప్పటి నుంచి అమలు చేస్తారనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విధానం అమలుకు తొలుత రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలి. అప్పుడే రాష్ట్రాల్లో అమల్లోకి వస్తుంది. పాఠశాల విద్యకు సంబంధించిన కొత్త కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించిన కేంద్ర విద్యాశాఖ గత ఏప్రిల్‌లో ముసాయిదా విడుదల చేయగా...దానిపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి తుది నివేదికను బుధవారం విడుదల చేసింది. ‘11, 12 తరగతుల(ఇంటర్‌) విద్యార్థులు రెండు భాషా సబ్జెక్టులను కచ్చితంగా అభ్యసించాలి. వాటిల్లో ఒకటి భారతీయ భాష అయి ఉండాల’ని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ తదితర జాతీయ బోర్డుల పరిధిలో ఒక భాషా సబ్జెక్టును మాత్రమే చదువుతున్నారు. ఇక నుంచి ఆంగ్లంతోపాటు ఒక భారతీయ భాషను చదవాల్సి ఉంటుంది. నూతన విద్యా విధానానికి అనుగుణంగానే 2024 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బట్టీ చదువులకు స్వస్తి చెప్పేలా కొత్త పరీక్షల విధానం ఉంటుందని తెలిపింది. సబ్జెక్టులపై పూర్తి అవగాహన, ప్రాక్టికల్‌ నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం లక్ష్యంగా మార్పులు చేశారు. ‘జాతీయ కురికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను పరిశీలించి రాష్ట్ర కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించుకుంటాం. ముందుగా దాన్ని రాష్ట్రం అమలుచేసే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్‌ఈసీఆర్‌టీ అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తుంది’ అని ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు రాధారెడ్డి తెలిపారు.

ముఖ్యాంశాలివీ...

  • ఇంటర్‌లో ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ అనే గ్రూపులుండవు. విద్యార్థులు ఆసక్తి ఉన్న సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. అది 9వ తరగతి నుంచే మొదలవుతుంది.
  • చివరి రాత పరీక్షలకే కాకుండా ఆర్ట్‌, ఫిజికల్‌, ఒకేషనల్‌ విద్యకు కూడా మార్కులుంటాయి.
  • భవిష్యత్తులో విద్యార్థి కోరుకున్న సమయంలో పరీక్షలు జరిపే విధానాన్ని అందుబాటులోకి తెస్తారు.
  • ప్రస్తుతం సెకండరీ అంటే 10, సీనియర్‌ సెకండరీ అంటే 11, 12 తరగతులు. ఇక నుంచి సెకండరీని రెండు దశలుగా విభజిస్తారు. 9, 10 తరగతులు ఒకటి, 11, 12 తరగతులు మరొకటిగా ఉంటుంది. సెకండరీ దశను భిన్న సబ్జెక్టులు చదువుకునే మల్టీ డిసిప్లినరీ విద్యగా మారుస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని