రోహిత్‌ కేసు పునర్విచారణ ప్రారంభం

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.

Published : 05 May 2024 06:27 IST

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన తల్లి రాధిక
నిష్పాక్షిక దర్యాప్తునకు ముఖ్యమంత్రి హామీ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. డీజీపీ రవిగుప్తా శుక్రవారమే ఆదేశాలు జారీ చేయడంతో సైబరాబాద్‌ పోలీసులు పునర్విచారణను ప్రారంభించారు. మరోవైపు రోహిత్‌ తల్లి రాధిక, కుటుంబసభ్యులు, కొందరు విద్యార్థులు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. విచారణ సరిగ్గా జరగలేదని.. పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకోలేదని సీఎం దృష్టికి తెచ్చారు. రోహిత్‌ ఆత్మహత్య అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో సస్పెన్షన్‌కు గురైన విద్యార్థుల భవిష్యత్తు, వారిపై నమోదైన కేసుల గురించి ప్రస్తావించారు. నిష్పాక్షికంగా పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అనంతరం సీఎం నివాసం బయట రాధిక మీడియాతో మాట్లాడారు. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ మెయిన్‌గేట్‌ వద్ద సాయంత్రం మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ‘భాజపాకు అనుకూలంగా ఉన్న కొన్ని అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని కేసును మూసేశారు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుంది. సరిగ్గా చదవకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పడం సరైంది కాదు. మా వాడు చదువులో ముందుండేవాడు. ఎస్సీ కాదని పోలీసులు ఎలా ధ్రువీకరిస్తారు? అది రెవెన్యూ యంత్రాంగం చెప్పాలి. యూనివర్సిటీ అప్పటి వీసీ అప్పారావు, భాజపా నేతలు దత్తాత్రేయ, రామచంద్రరావు, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలి’ అని రాధిక డిమాండ్‌ చేశారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్‌ రాజేశ్‌ లిలోతియా సాయంత్రం రాధికను కలిశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే శిక్షించేందుకు రోహిత్‌ వేముల చట్టం తీసుకొస్తామని తెలిపారు.

నిందితులకు క్లీన్‌చిట్‌ సామాజిక వివక్షకు నిదర్శనం: పీడీఎస్‌ఎఫ్‌

‘రోహిత్‌ ఎస్సీ కాదని ప్రకటించిన పోలీసులు.. నిందితులందరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వడం సామాజిక వివక్షకు నిదర్శనం. సర్టిఫికెట్లు రద్దవుతాయని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించడం నీతిమాలిన చర్య. రోహిత్‌ను, తోటి విద్యార్థులను సస్పెండ్‌ చేయాలని అప్పటి ఎంపీ దత్తాత్రేయ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతిఇరానీకి మూడు లేఖలు రాసింది నిజం కాదా? అంబేడ్కర్‌ విద్యార్థి సంఘం నిర్వహించిన ర్యాలీని దేశద్రోహ చర్యగా లేఖలో అభివర్ణించింది నిజం కాదా? ఇదే అంశంపై భాజపా నేత రామచంద్రరావు హెచ్‌సీయూలో ధర్నాలు చేయలేదా? లోక్‌సభ ఎన్నికల వేళ కొందరు నిందితులను రక్షించే విధంగా తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు’ అని ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌(పీడీఎస్‌ఎఫ్‌) రాష్ట్ర కమిటీ సభ్యుడు మారికంటి హరీశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని