Europol: ఐరోపాలో ‘ఆపరేషన్‌ డెజర్ట్‌ లైట్‌’.. 30 టన్నుల కొకైన్‌ స్వాధీనం!

అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఐరోపా పోలీసులు ఉక్కుపాదం మోపారు! ఐరోపావ్యాప్తంగా మూడోవంతు కొకైన్‌ వ్యాపారం నిర్వహించే ఓ భారీ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ క్రమంలోనే.. దుబాయ్‌తోపాటు వివిధ దేశాల్లో 49 మందిని అరెస్టు చేసినట్లు యూరోపోల్(Europol) సోమవారం తెలిపింది.

Published : 29 Nov 2022 01:40 IST

ది హేగ్‌: అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఐరోపా పోలీసులు ఉక్కుపాదం మోపారు! ఐరోపా వ్యాప్తంగా మూడింట ఒకవంతు కొకైన్‌ వ్యాపారం నిర్వహించే ఓ భారీ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ క్రమంలోనే దుబాయ్‌తోపాటు వివిధ దేశాల్లో 49 మందిని అరెస్టు చేసినట్లు యూరోపోల్(Europol) సోమవారం వెల్లడించింది. ‘ఆపరేషన్‌ డెజర్ట్‌ లైట్‌’ పేరిట నవంబర్‌ 8నుంచి 19వరకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 30 టన్నుల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.వేల కోట్లలో ఉంటుందని అంచనా వేసింది.

‘ఐరోపాలో కొన్ని మాదకద్రవ్యాల ముఠాలు కలిసి ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడ్డాయి. నిందితుల కనుసన్నల్లో ఐరోపాలోకి పెద్ద మొత్తంలో కొకైన్‌ దిగుమతి అవుతోంది. ఈ ఖండంలో సాగే కొకైన్ వ్యాపారంలో మూడింట ఒక వంతు నియంత్రణ ఈ నెట్‌వర్క్‌దే. ఈ క్రమంలోనే చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా.. దుబాయిలో నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌లకు చెందిన ఆరుగురు కీలక నిందితులు అరెస్టయ్యారు. స్పెయిన్‌లో 13 మంది, ఫ్రాన్స్‌లో 6గురు, బెల్జియంలో 10మంది, నెదర్లాండ్స్‌లో 14 మందిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే 30 టన్నులకు పైగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు’ అని యూరోపోల్ వెల్లడించింది.

నెదర్లాండ్స్‌కు చెందిన ఓ అనుమానితుడిని ఈ నెట్‌వర్క్‌లో అత్యంత కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు యూరోపోల్‌ తెలిపింది. 2020, 2021ల్లో వేల కిలోల కొకైన్‌ను దేశంలోకి అక్రమంగా రవాణా చేశాడనే ఆరోపణలు అతనిపై ఉన్నట్లు వెల్లడించింది. ‘నిందితులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన తీవ్ర నేరాలకు పాల్పడ్డారు. దక్షిణ అమెరికా నుంచి బెల్జియంలోని యాంట్‌వెర్ప్, నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్ ఓడరేవుల ద్వారా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది’ అని అని నెదర్లాండ్స్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని