కారడవుల్లో అద్భుతం.. విమానం కూలిన 40 రోజులకు సజీవంగా చిన్నారులు

అమెజాన్‌ అడవుల్లో (Amazon jungle) 40 రోజుల క్రితం ఓ విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు ప్రాణాలతో బయటపడినా.. అడవిలో తప్పిపోయారు. ఎట్టకేలకు వారిని అధికారులు సజీవంగా గుర్తించారు.

Updated : 10 Jun 2023 15:40 IST

బొగొట (కొలంబియా): దక్షిణ అమెరికాలోని కొలంబియా (Colombia)లో గల దట్టమైన అమెజాన్‌ అడవుల్లో (Amazon rainforest) అద్భుతం జరిగింది. నిత్యం క్రూరమృగాలు సంచరించే ఈ కారడవిలో 40 రోజుల క్రితం తప్పిపోయిన నలుగురు చిన్నారులు  (Children) ఎట్టకేలకు సజీవంగా కన్పించారు. ఓ విమాన ప్రమాదం నుంచి వీరు మృత్యుంజయులుగా బయటపడ్డారు. ఇందులో 11 నెలల పసిబిడ్డ కూడా ఉండటం విశేషం.

అమెజాన్ అటవీ ప్రాంతం(Amazon rainforest) పరిధిలోని అరారాక్యూరా నుంచి శాన్‌జోస్‌ డెల్‌ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటిన విమానం బయలుదేరింది. ఆ విమానంలో నలుగురు చిన్నారులు, వారి తల్లి, గైడ్‌, పైలట్‌ ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్యతో అది కూలబోతున్నట్లు పైలట్‌ ప్రకటించాడు. అనంతరం ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. ‘ఆపరేషన్‌ హోప్‌’ పేరిట దట్టమైన అడవుల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత మే 16న విమాన శకలాలను గుర్తించారు. అందులో పైలట్‌, చిన్నారులు తల్లి, గైడ్‌ మృతదేహాలను గుర్తించారు. (Children Found Alive in Forest)

అయితే విమానంలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద స్థలంలో వారు కన్పించకపోవడంతో చిన్నారుల కోసం గాలించారు. దాదాపు 150 మంది సైనికులు, జాగీలాలతో అమెజాన్‌ అడవిని జల్లెడపట్టారు. ఈ క్రమంలోనే మే 18వ తేదీన పిల్లలు క్షేమంగానే ఉన్నారని తెలియజేసేలా చిన్నగుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్‌, పాలసీసా, సగం తిన్న పండు వంటివి కనిపించాయి. దీంతో పిల్లలు అడవుల్లోనే ఉన్నట్లు ధ్రువీకరించిన అధికారులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

ఎట్టకేలకు, ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత చిన్నారులను సజీవంగా గుర్తించారు. గాలింపు బృందాలు వారి వద్దకు చేరుకునే సరికి నలుగురు పిల్లలు ఒంటరిగానే ఉన్నట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే క్రూరమృగాలు తిరిగే ప్రాంతంలో ఇన్ని రోజులుగా ఆ చిన్నారులు తమను తాము ఎలా కాపాడుకున్నారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. గాలింపు సమయంలో భద్రతా సిబ్బంది అడవుల్లో అక్కడక్కడా హెలికాప్టర్ల సాయంతో ఆహార పదార్థాలు ఉన్న బాక్సులను పడేశారు. అవే ఆ చిన్నారులకు సాయం చేశాయని అధికారులు భావిస్తున్నారు.

ఇన్ని రోజుల తర్వాత చిన్నారులు సజీవంగా కన్పించడంతో కొలంబియాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సైనికులతో చిన్నారులు ఉన్న దృశ్యాలను కొలంబియా మిలిటరీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘‘మా ప్రయత్నాలు ఫలించాయి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘‘ఈ అడవే వారిని రక్షించింది. వారు అడవి పిల్లలు. మా కొలంబియాకు కూడా వారసులే’’ అని ఆ దేశ అధ్యక్షుడు పెట్రో సంతోషం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని