Nikki Haley: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. జాగ్రత్త : నిక్కీహేలీ కీలక వ్యాఖ్యలు

చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీహేలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 23 Sep 2023 14:32 IST

వాషింగ్టన్‌: ‘అమెరికాకు (America) మాత్రమే కాదు యావత్‌ ప్రపంచం మొత్తానికి చైనా (China) పెద్ద ముప్పుగా ఉంది. ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ (Nikki Haley) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం న్యూహ్యాంప్‌షైర్‌లో ఏర్పాటు చేసిన ఆర్థికవ్యవస్థ విధి, విధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేశారు.

చైనాను ఎదుర్కొనేందుకు చాలా శక్తి అవసరం

‘అమెరికాకు చైనా (China) తో ప్రమాదం పొంచి ఉంది. అది యుద్ధానికి సిద్ధమవుతోంది. అమెరికాను ఓడించేందుకు చైనా 50 ఏళ్ల నుంచి పన్నాగాలు పన్నుతోంది. కొన్ని విషయాల్లో చైనా సైన్యం ఇప్పటికే అమెరికా సాయుధ బలగాలతో సమానంగా ఉంది. మన దేశ మనుగడకు, ముఖ్యంగా కమ్యూనిస్టు చైనాను ఎదుర్కోనేందుకు బలం, ఆత్మాభిమానం చాలా అవసరం. చైనా మన వాణిజ్య రహస్యాలను తెలుసుకుంటోంది. వారు మనపై గెలవాలని భావిస్తున్నారు’ అని ఆమె పేర్కొన్నారు.

రాజకీయ నాయకులకే కాదు ప్రభుత్వ అధికారులకు కూడా ఐదేళ్లే కాలపరిమితి ఉండాలి..

అనంతరం ఆమె ఆర్థిక ప్రణాళికను పంచుకుంటూ..‘ మధ్య తరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించడానికి బలంగా కృషి చేస్తా. మీ డబ్బును మీరే మెరుగ్గా ఉపయోగించుకోగలరు. మీరందరూ మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారని నమ్మకం ఉంది. ఫెడరల్ గ్యాస్‌, డీజిల్ పన్నును పూర్తిగా తొలగిస్తాం. దాని వల్ల  రికార్డు స్థాయి గ్యాస్‌ ధరలతో పోరాడుతున్న కుటుంబాలకు మేలు కలుగుతుంది. దేశ అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. శ్రామిక కుటుంబాలకు ఆదాయపు పన్ను తగ్గిస్తా. బైడెన్‌ ప్రభుత్వం చేపట్టిన 500 బిలియన్‌ డాలర్ల గ్రీన్‌ ఎనర్జీ సబ్సిడీలను కూడా తొలగిస్తా. దీంతో శత్రుదేశానికి మన దేశం నుంచి ఆర్థిక ద్వారాలు మూసుకుపోతాయి. రాజకీయ నాయకులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారులకు కూడా ఐదేళ్లకు మించి ఒకే పదవిలో ఉండకూడదు. కాలపరిమితిని అమలు చేయడం వల్ల వారూ మంచి ప్రజా సేవకులుగా పనిచేస్తారు. అంతేకాకుండా మన ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే రాజకీయాలకు దూరంగా ఉంటారు’ అని అన్నారు.

వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) ఒహియోలో చైనాపై విదేశాంగ విధాన ప్రసంగం చేసిన రెండు రోజుల తర్వాత నిక్కీ హేలి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని