Mystery: 300 మందికి అస్వస్థత.. ఆ నౌకలో ఏం జరిగింది..?

అమెరికాలోని ఓ నౌకలో (Cruise Ship) సుమారు 300 మంది ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని పరీక్షించినప్పటికీ కారణాలు మాత్రం తెలియలేదు. దీంతో వారి నుంచి నమూనాలు సేకరించి పరిశోధిస్తున్నట్లు అమెరికా సీడీసీ (CDC) వెల్లడించింది.

Published : 10 Mar 2023 21:18 IST

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఓ భారీ పర్యాటక నౌక (Cruise Ship)లోని ప్రయాణికులను అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. టెక్సాస్‌-మెక్సికో మధ్య నడిచే ఈ నౌకలో ఇటీవల 300 మంది అస్వస్థతకు గురయ్యారు. వాటికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. ఈ అంతుచిక్కని అనారోగ్య కేసులపై ప్రయాణికులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ అంటువ్యాధి విజృంభణపై అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలక కేంద్రం (CDC) కూడా పరీక్షిస్తోంది.

టెక్సాస్‌-మెక్సికో మధ్య ప్రిన్సెస్‌ క్రూజ్‌కు చెందిన రూబీ ప్రిన్సెస్‌ నౌక రాకపోకలు సాగిస్తుంది. అయితే, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 తేదీల మధ్య అందులో ప్రయాణించిన 300 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వెల్లడైంది. మొత్తం 2881 మంది ప్రయాణికుల్లో 300 మందిలో వాంతులు, డయేరియా లక్షణాలు కనిపించాయి. వీరిని పరీక్షించిన వైద్యులు కారణాలను మాత్రం గుర్తించలేకపోయారు. దీంతో అప్రమత్తమైన సీడీసీ.. అంటువ్యాధుల నిపుణుల బృందాన్ని టెక్సాస్‌కు పంపించింది. అనారోగ్యం బారినపడటానికి గల కారణాలు అంతుచిక్కడం లేదని సీడీసీ నిపుణులు వెల్లడించారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరిశోధిస్తున్నామని చెప్పారు.

తాజా అంటువ్యాధిపై క్రూజ్‌ యాజమాన్యం స్పందించింది. ఈ అనారోగ్యానికి అతివేగంగా వ్యాపించే నోరోవైరస్‌ కారణమని భావిస్తున్నామని తెలిపింది. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నౌకలో పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇదిలాఉంటే, అమెరికాలోని ఈ రూబీ ప్రిన్సెస్‌కు చెందిన నౌక గతంలోనూ వార్తల్లో నిలిచింది. కొవిడ్‌ విజృంభణ మొదలైన సమయంలో అందులోని వందల మందికి వైరస్‌ నిర్ధారణ కావడంతో కొంతకాలం ఆస్ట్రేలియా తీరంలో నిలిపివేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని