US Embassy: ఉక్రెయిన్‌ వివాదం.. అమెరికా మరో కీలక నిర్ణయం!

ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు అమెరికా.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయనుంది! అక్కడి అమెరికన్ దౌత్య సిబ్బంది దేశం విడిచి రావాలంటూ విదేశాంగ శాఖ ప్రకటన...

Published : 13 Feb 2022 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయనుంది. అక్కడి అమెరికన్ దౌత్య సిబ్బంది దేశం విడిచి రావాలంటూ విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదివరకే తమ దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు స్వదేశానికి చేరుకోవాలని ఆదేశించిన అగ్ర రాజ్యం.. సిబ్బంది విషయంలో మాత్రం వారి ఆలోచనకు వదిలివేసింది. కానీ, తాజాగా వారినీ రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కొంతమంది దౌత్యవేత్తలను తమ మిత్ర దేశమైన పోలాండ్‌ సరిహద్దు సమీపంలోకి మార్చే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి చెప్పారు.  

ఇటీవల పోలాండ్‌కు దాదాపు 1700 మంది భద్రతా సిబ్బందిని తరలించిన అమెరికా.. తాజాగా మరో మూడు వేల మంది సైనికులను పంపనున్నట్లు ప్రకటించింది. నాటో బలగాలకు శిక్షణ అందించడమే వారి లక్ష్యమని, ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడం కాదని తెలిపింది. ఉక్రెయిన్‌లోని అమెరికా పౌరులందరూ వీలైనంత త్వరగా ఆ దేశం విడిచి రావాలని అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే తాజా ప్రకటన వచ్చింది. మరోవైపు జర్మనీలోని సుమారు వెయ్యి మంది అమెరికా సైనికులు.. నాటోకు మద్దతుగా రొమేనియాకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా న్యూజిలాండ్ సైతం అమెరికా బాటపట్టింది. తమ దేశవాసులు వెంటనే ఉక్రెయిన్‌ విడిచి వెళ్లిపోవాలని ఆ దేశ విదేశాంగ శాఖ శనివారం విజ్ఞప్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని