Ukraine Crisis: పుతిన్‌ పిడికిలి బిగించిందిలా..!

‘ఉక్రెయిన్‌ అనే దేశమే లేదు’ ‘ఉక్రెయిన్‌ ఎప్పుడూ సుస్థిరంగా ఉండలేదు’ అంటూ పుతిన్‌ నిన్న టెలివిజన్‌ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. వాస్తవానికి పుతిన్‌ ఎప్పుడూ

Updated : 22 Feb 2022 14:00 IST

 చరిత్ర పేరిట ఉక్రెయిన్‌ విలీనానికి సన్నాహాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘ఉక్రెయిన్‌ అనే దేశమే లేదు’.. ‘ఉక్రెయిన్‌ ఎప్పుడూ సుస్థిరంగా ఉండలేదు’ అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిన్న టెలివిజన్‌ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. వాస్తవానికి పుతిన్‌ ఎప్పుడూ ఉక్రెయిన్‌ను వేరే దేశంగా చూడలేదు. అదే విషయం ఆయన ప్రసంగంలో కూడా కనిపించింది. ఓ పక్క కఠిన ఆంక్షలు విధిస్తామని ప్రపంచ దేశాలు భయపెడుతున్నా.. నాటో భారీ ఎత్తున ఆయుధాలను ఉక్రెయిన్‌లోకి చొప్పిస్తున్నా.. పుతిన్‌ ఏమాత్రం లెక్క చేయకుండా డాన్‌బాస్‌ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా గుర్తించారు. దీంతో ఏడేళ్ల నుంచి అమల్లో ఉన్న మింస్క్‌-2 ఒప్పందం కూడా గాల్లో కలిసిపోయింది. పుతిన్‌ చర్యల వెనుక బలమైన వ్యూహం ఉంది.

చారిత్రక కారణాలు చెప్పి..

పుతిన్‌ తరచూ రష్యా.. ఉక్రెయిన్‌ వేర్వేరు ప్రాంతాలు కావని చెబుతుంటారు. 9వ శతాబ్దంలో ‘రుస్‌’ అనే స్కాండినేవియన్‌ ప్రజల నుంచి మొదలైన చరిత్రను పుతిన్‌ గుర్తు చేస్తుంటారు. వీరు తొలిసారి కీవ్‌ను రాజధానిగా చేసుకొన్నారు. ఉక్రెయిన్‌లోని భాగాలను ఆక్రమించుకొన్న ప్రతిసారి పుతిన్‌ గత చరిత్రను గుర్తు చేస్తుంటారు. 1954లో సోవియెట్‌ పాలకుడు నికితా కృశ్చేవ్‌.. క్రిమియాను కూడా ఉక్రెయిన్‌కు బహుమతిగా ఇచ్చారు. వాస్తవానికి క్రిమియాలో రష్యా జాతీయులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. క్రిమియాను 2014లో ఆక్రమించుకొన్న సమయంలో దానిని పునరేకీకరణగా పుతిన్‌ అభివర్ణించారు. తాజాగా డాన్‌బాస్‌ ప్రాంతం విషయంలో కూడా పుతిన్‌ ఇదే వ్యూహం అవలంభించారు.

2001లో జరిగిన జనాభా లెక్కల్లో క్రిమియా‌, తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో సగం మందికిపైగా రష్యా మూలాలు ఉన్నవారు లేదా రష్యా భాష మాట్లాడే వారు ఉన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌+రష్యాను కలిపి సుర్జిక్‌గా పిలిచే భాషను కూడా మాట్లాడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇవన్ని పుతిన్‌కు కలిసొచ్చే అంశాలే.

2014 నుంచి వీటిపై దృష్టి..

2014లో క్రిమియా ఆక్రమణ తర్వాత నుంచి డాన్‌బాస్‌ ప్రాంతంలో అశాంతి పెరిగిపోయింది. దొనెట్స్క్‌,లుహాన్స్క్‌ ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు 6,500 చదరపు మైళ్లను ఆక్రమించారు. వీటిని  దొనెట్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌, లుహాన్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌లుగా ప్రకటించుకొన్నారు. రెబల్స్‌ ఆక్రమించుకొన్న రెండు ప్రాంతాల్లో కలిపి 3.8మిలియన్ల జనాభా ఉంది. వీరిలో పెద్ద సంఖ్యలో రష్యాభాష మాట్లాడేవారు ఉన్నారు. 2014 నుంచి జరుగుతున్న పోరాటంలో దాదాపు 14వేల మంది మరణించారు. దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. 

మింస్క్‌ చర్చలు.. ఒప్పందాలు..

2015లో ఇక్కడ హింస తీవ్రం కావడంతో రష్యా, బెలారస్‌, ఉక్రెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ అధినేతలు మింస్క్‌ నగరంలో భేటీ అయి ఓ శాంతి ఒప్పందం చేసుకొన్నారు. దీని ప్రకారం డాన్‌బాస్‌ ప్రాంతంలోని వాటికి ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తిని ఉక్రెయిన్‌ ఇవ్వాలి. దీనికి బదులుగా  రష్యాతో సరిహద్దు నియంత్రణ అధికారాన్ని రెబల్స్‌ ఉక్రెయిన్‌కు బదలాయించాలి. కానీ, ఈ ఒప్పందాన్ని ఉక్రెయిన్‌ అమలు చేయలేదు. అది పుతిన్‌కు అయాచిత వరంగా మారింది. తాజాగా పుతిన్‌ ఈ దూకుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఉక్రెయిన్‌ మింస్క్‌-2 ఒప్పందం అమలు చేయకపోవడమే కారణమని రష్యా వాదిస్తోంది.

పరిస్థితులు రష్యాకు అనుకూలంగా మలచుకొని..

నాటోలోని ఐరోపా దేశాలు గ్యాస్‌ కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడ్డాయి. ముఖ్యంగా జర్మనీ వీటిల్లో ముందు వరుసలో ఉంటుంది. అమెరికా ఆంక్షలు విధిస్తే రష్యా కంటే జర్మనీ, ఇతర ఐరోపా దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.

మరోవైపు సంక్షోభం ముదిరితే చమురు ధరలు భారీగా పెరుగుతాయి. చమురు,ఆయుధ విక్రయాలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావడంతో రష్యాకు ఇది కలిసొచ్చే అంశమే. మరోపక్క రష్యా చమురు ఉత్పత్తిలో కోత విధిస్తే.. దానిని భర్తీ చేసి ధరలను స్థిరీకరించడానికి ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ఎంతవరకు ముందుకొస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అల్యూమినియం, గోధుమలు వంటివి రష్యా భారీగా ఎగుమతి చేస్తోంది.

ముందు చూపుతో ఆంక్షలు ఎదుర్కొనేలా..

అమెరికా ఆంక్షలతో విసిగిపోయిన రష్యా ముందుచూపుతో ఆర్థికంగా కూడా సిద్ధమైంది. సోవియట్‌ కుప్పకూలాక 1990ల్లో రూబుల్‌ బాగా దెబ్బతింది. ఆ తర్వాత 2008లో మరోసారి కుంగింది. 2014లో ఆంక్షల కారణంగా పతనమైంది. దీని  నుంచి పాఠాలు నేర్చుకొన్న పుతిన్‌.. దేశం కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించేలా చేశారు. డాలర్ల పై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించారు. ఆర్థిక స్థిరత్వం సాధించారు. సోవియట్‌ పతనం తర్వాత తొలిసారి 2020లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుగా రష్యా నిలిచింది.  కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూసుకొంది. ఫలితంగా ప్రభుత్వం వద్ద మిగులు నిధులు ఉంచుకొన్న అతి కొద్ది దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఫలితంగా ఆంక్షలకు అతి తక్కువగా ప్రభావితం అయ్యేలా చూసుకొంది. ప్రస్తుతం రష్యా విదేశీ అప్పులు చాలా తక్కువ. 640 బిలియన్‌ డాలర్ల భారీ కరెన్సీ రిజర్వును సిద్ధం చేసుకొంది. ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కరెన్సీ రిజర్వు. వీటిల్లో డాలర్ల శాతం చాలా తక్కువగా ఉండేట్లు చూసుకొన్నారు. దేశ కార్పొరేట్‌ రుణాలను రూబుల్స్‌లో ఉండేలా మార్పులు చేశారు. 2014లో అమెరికా ఆంక్షల కారణంగా పశ్చిమ దేశాల్లో ఆస్తులు కోల్పోయిన నాయకులు, వ్యాపారవేత్తలకు ప్రత్యామ్నాయంగా రష్యాలో నిర్మాణ, ఇంధన కాంట్రాక్టులను ఇచ్చి అసంతృప్తులను బుజ్జగించారు.

అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు నిర్వహించే స్విఫ్ట్‌ నుంచి బహిష్కరిస్తే ఇబ్బంది లేకుండా సొంత ఫైనాన్షియల్‌ మెసేజింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకొంది. దీంతోపాటు దిగుమతులను గణనీయంగా తగ్గించుకొని చాలా వాటిలో స్వయం సమృద్ధి సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని