News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 01(06-04-2023)
Updated : 06 Apr 2023 12:44 IST
1/22
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ‘ఆదిపురుష్’ టీమ్ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ప్రభాస్ - కృతిసనన్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో దేవదత్తా అనే బాలీవుడ్ నటుడు హనుమాన్ పాత్రలో కనిపించనున్నారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈసినిమా పాన్ ఇండియా స్థాయిలో జూన్ 16న విడుదల కానుంది.
2/22
రాజధాని నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం ప్రకాశం బ్యారేజి వద్ద కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. కొండవీటివాగు, పాలవాగు, కోటేళ్లవాగుల విస్తరణ పనులు చేపట్టింది. ఈ వాగుల నుంచి వచ్చే నీరు ఉండవల్లి సమీపంలో కృష్ణానదిలో కలుస్తాయి. అప్పట్లో వంతెనల నిర్మాణ పనుల కోసం వాగులకు అడ్డంగా మట్టికట్టలు వేశారు.వాగుల నుంచి కాలువల ద్వారా నీరు పోయేందుకు వీలు లేకుండా పైపులు సగానికి పైగా పిచ్చిమొక్కలు, వ్యర్థాలు, ముళ్లకంపలు పెరిగి, మట్టి మేటలతో ప్రవాహానికి అడ్డంకులుగా మారాయి.
3/22
దొండపాడు మీదుగా అమరావతి వెళ్లే ప్రధాన మార్గం అధ్వానంగా తయారైంది. అమరేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వందల మంది భక్తులు ఈ రోడ్డు మీదుగా ప్రయాణం సాగిస్తుంటారు. వైకుంఠపురం నుంచి పెదమద్దూరు వరకు సుమారు 10 కి.మీ రోడ్డంతా గుంతలమయమై వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
4/22
ఇది కాకినాడ జిల్లా యానాంలోని బీచ్ రోడ్డులోని శివలింగం వద్దనున్న రావి చెట్టు. రుతు ధర్మం ప్రకారం మాఘ, ఫాల్గుణ మాసాల్లో ఆకులు రాలి మోడుగా కనిపిస్తుంది.చైత్ర, వైశాఖ మాసాల్లో చిగురులు తొడిగి కళకళలాడుతూ చల్లని నీడనిస్తోంది.
5/22
ఈ పచ్చదనాన్ని చూసి ఇదేదో మైదానం అనుకుంటే పొరపాటే. కాకినాడ జిల్లా రైతులకు ఆయువుపట్టు లాంటి ఏలేరు కాల్వ ప్రస్తుత దుస్థితి ఇది. పూడిక, గుర్రపుడెక్కతో నిండిపోవడంతో సాగునీటి కాల్వ కాస్త ఇలా దర్శనమిస్తోంది. దీంతో నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడటంతో చివరి ఆయకట్టు రైతులకు సకాలంలో సాగునీరు అందడం లేదు.
6/22
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో బుధవారం చైత్రపౌర్ణమి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాలు, దేవీ పీఠాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. బలగ కాలభైరవ ఆలయంలో దేవీ ఉపాసకులు పొగిరి గణేష్ నిర్వహణలో లక్ష్మీరూపేణా శ్రీచక్రార్చన సిరిపూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే ఈ చిత్రం.
7/22
విజయనగరం జిల్లాలోని సాలూరు పట్టణం నుంచి పాంచాలి వెళ్లే రహదారిలో వేగావతి నదిపై నిర్మించిన కాజ్వే అధ్వానంగా దర్శనమిస్తోంది. గులాబ్ తుపాను సమయంలో ఇది కొట్టుకుపోయింది. మరమ్మతులకు అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. గతేడాది వచ్చిన వరదలకు పూర్తిస్థాయిలో ధ్వంసమైంది. దీంతో రూ.20 లక్షలతో మరోసారి ప్రతిపాదించారు. కానీ రూ.12 లక్షలే రావడంతో సగం పనులు చేసి, ఇలా మధ్యలోనే వదిలేశారు.
8/22
విజయనగరం జిల్లా వంగర మండలంలోని చంద్రమ్మపేట, చౌదరివలస, కోనంగిపాడు తదితర గ్రామాల ప్రజల కష్టాలివి. మండల కేంద్రానికి రావాలంటే మధ్యలో ఉండే వేగావతి నదిని దాటాల్సిందే. దగ్గర మార్గం కావడంతో ఇలా ప్రమాదకరంగా రోజూ ప్రయాణాలు సాగిస్తున్నారు.
9/22
ఈ చిత్రంలోని చెట్టును చూస్తే పచ్చటి ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి కదూ. కానీ నిశితంగా పరిశీలిస్తే అందులో కొమ్మకొమ్మకు రామచిలుకలు కనిపిస్తాయి. పచ్చటి చిలుకలు.. పచ్చని ఆకుల్లో కలిసిపోయాయి. కామారెడ్డి రైల్వేస్టేషన్ ఆవరణలోని ఓ వృక్షాన్ని నివాసంగా మార్చుకున్నాయి. ఉదయాన్నే ఎటో వెళ్లిపోతాయి.. సాయంత్రమైందంటే గుంపులుగుంపులుగా చేరి సందడి చేస్తుంటాయి.
10/22
కాకతీయుల కాలం నాటి అపురూప రాతి కట్టడాలున్న వరంగల్లోని ఖిలా వరంగల్ కోటను రష్యా దేశస్థులు బుధవారం సందర్శించారు. మధ్యకోట కళాతోరణాల నడుమ కింద పడిపోయి ఉన్న శిల్పాలను ఆసక్తిగా తిలకించడంతోపాటు తమ కెమెరాల్లో బంధించుకోవడం కనిపించింది.
11/22
అసలే చిన్న ద్విచక్ర వాహనం. దానికితోడు ముందు ఒక బరువైన సంచి, వెనకాల మరో సంచి, ఆపైన మహిళని కూర్చోబెట్టుకొని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వాహన చోదకుడు. ఈ చిత్రం నల్గొండ జిల్లాలోని రాజపేటలో బుధవారం ‘న్యూస్టుడే’ కెమెరాకు చిక్కింది.
12/22
సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామానికి సైబీరియన్ పక్షులు వలస వచ్చాయి. వీటి రాకతో తమ గ్రామం కోలాహలంగా మారిందని,పైగా గ్రామానికి మంచి జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి జనవరిలో వచ్చి..ఆరు నెలలపాటు గ్రామంలోని చెట్లపై ఆవాసం ఏర్పాటు చేసుకుని తమ సంతతిని వృద్ధి చేసుకొని వెళ్తాయని, గత 50 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ సాగుతోందని తెలిపారు.
13/22
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామం శివారులో కల్వర్టుపై నిర్మించిన లోలెవెల్ వంతెన కొన్ని సంవత్సరాల క్రితం వరదలకు దెబ్బతింది.ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. వలిగొండ మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జి పైనుంచే ప్రయాణం సాగిస్తుంటారు. రాత్రి వేళలో ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
14/22
ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఈత కొలనులో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఎండ తీవ్రత పడకుండా చుట్టూ గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఈత నేర్చుకునే చిన్నారులు, తోడుగా వచ్చే వారికి సైతం ఎండ నుంచి రక్షణ కల్పించేలా ఈ ఏర్పాటు చేసినట్లు శిక్షకుడు కొమ్ము కృష్ణ తెలిపారు.
15/22
హనుమజ్జయంతికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆంజనేయ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రత్యేక పూజలు, వైభవోపేతంగా శోభాయాత్రల నిర్వహణకు ఆలయాల ప్రతినిధులు, అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
16/22
హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న బాహ్యవలయ రహదారి పక్కన సర్వీసు రోడ్డు వెంట దాదాపు రూ.95 కోట్లతో కోకాపేట, నానక్రాంగూడ, తెలంగాణ పోలీసు అకాడమీ, నార్సింగి, కొల్లూరు వరకు 23 కి.మీ. మేర అధునాతన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
17/22
బాహ్యవలయ రహదారిపై హైదరాబాద్లోని నార్సింగి కూడలి వద్ద కొత్తగా 18ఏ పేరుతో మరో నిష్క్రమణ మార్గం ప్రారంభానికి సిద్ధమవుతోంది. గతంలో గచ్చిబౌలి నానక్రాంగూడ తర్వాత పోలీసు అకాడమీ వద్ద మాత్రమే టోల్ ఎగ్జిట్ ఉండేది. నార్సింగి వెళ్లే వారు పోలీసు అకాడమీ లేదా గచ్చిబౌలి వద్ద దిగాల్సి వచ్చేది. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న కేంద్రంతో నార్సింగి వాసులకు వెసులుబాటు కలగనుంది.
18/22
హైదరాబాద్లోని సరూర్నగర్ వీఎం హోం విద్యార్థులు ఉదయం వేళ అక్కడి మైదానంలో ఇలా ఆడుకుంటూ కనిపించారు
19/22
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. పాంచరాత్ర ఆగమపండితుల మంత్రోచ్చరణలు, మంగళవాద్యాల మధ్య కల్యాణం క్రతువు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వేడుకగా సాగింది
20/22
సాధారణంగా కాలీఫ్లవర్ అర కిలోపైనే ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో ఓ వ్యాపారి వద్ద గులాబీ కంటే చిన్నదైన గోబీ పువ్వు కనిపించింది. విక్రయించేందుకు మార్కెట్లో గుత్తగా కాలీఫ్లవర్లు కొనుగోలు చేసిన వ్యాపారి వాటిని గ్రేడింగ్ చేసేందుకు చూడగా అందులో ఈ చిన్న గోబీ పువ్వు ఉంది. గులాబీ పువ్వు కంటే చిన్నగా ఉందంటూ స్థానికులూ ఫొటోలు తీసుకుని ముచ్చటపడ్డారు.
21/22
తిరుమలలోని వసంతోత్సవ మండపంలో మూడు రోజులుగా జరుగుతున్న సాలకట్ల వసంతోత్సవాలు బుధవారం పరిసమాప్తమయ్యాయి. చివరి రోజున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారికి వసంతోత్సవ సేవ నిర్వహించారు.
22/22
అమెరికాలోని మిస్సోరీ ఆగ్నేయ ప్రాంతంలో బుధవారం టోర్నడో ధాటికి ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. చాలామంది గాయపడినట్లు చెప్పారు. టోర్నడో బొలింగర్ కౌంటీ నుంచి సెయింట్ లూయీస్కు 80కి.మీ. దూరం వరకూ కొనసాగినట్లు వెల్లడించారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం