భళా.. కంబళ శ్రీనివాసా!
ఉసేన్బోల్ట్.. 100 మీటర్ల పరుగులో ఎదురులేని మొనగాడు... అతడి దరిదాపుల్లోకి వచ్చేవారే లేరు... కానీ ఉసేన్ రికార్డును రెండుసార్లు తిరగరాశాడు మన కంబళ వీరుడు శ్రీనివాస గౌడ... అధికారిక లెక్కల్లోకి రాకపోయినా అతడి ప్రతిభకు ప్రపంచం సలాం కొట్టింది...
ఉసేన్బోల్ట్.. 100 మీటర్ల పరుగులో ఎదురులేని మొనగాడు... అతడి దరిదాపుల్లోకి వచ్చేవారే లేరు... కానీ ఉసేన్ రికార్డును రెండుసార్లు తిరగరాశాడు మన కంబళ వీరుడు శ్రీనివాస గౌడ... అధికారిక లెక్కల్లోకి రాకపోయినా అతడి ప్రతిభకు ప్రపంచం సలాం కొట్టింది... సెలెబ్రెటీల నుంచి సోషల్మీడియా దాకా భళా అంటున్న అతడితో ఈతరం మాట కలిపింది.
వంద మీటర్ల పరుగు పందెం అంటే వెంటనే గుర్తొచ్చేది జమైకాకు చెందిన స్టార్ స్ప్రింటర్ ఉసేన్బోల్ట్నే. చిరుత వేగంతో దూసుకెళ్లే బోల్ట్ 2009లో వంద మీటర్లను 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. పుష్కరం దాటినా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ సింథటిక్ ట్రాక్లో కాకుండా అడుగు వరకు ఉన్న బురద మడిలో పరుగెత్తుతూ ఆ రికార్డును ఒక్కసారి కాదు.. రెండుసార్లు తిరగరాశాడు మన శ్రీనివాస గౌడ.
రికార్డుల రాజు
కంబళ కర్ణాటకలోని కరావళి జానపద క్రీడ. బురద ట్రాక్లో రెండు దున్నల వెనక ఎవరు వేగంగా పరుగెత్తి తక్కువ సమయంలో గమ్యాన్ని చేరితే వారే విజేతలు. శ్రీనివాసగౌడ గతేడాది 145 మీటర్ల పోటీ దూరాన్ని 13.62 సెకన్లలో అధిగమించాడు. ఆ వేగాన్ని వంద మీటర్లతో లెక్కగడితే కేవలం 9.55 సెకన్లలో అధిగమించినట్లు న్యాయనిర్ణేతలు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. తొలిసారి ఓ గ్రామీణ యువకుడు ఉసేన్ బోల్ట్ రికార్డును తలదన్నే వేగాన్ని సాధించటం ఓ చరిత్ర. కానీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయాలేవీ తనకు తెలియవు. మళ్లీ ఎప్పట్లాగే ఇతర పోటీలకు సన్నద్ధం కాసాగాడు. తర్వాత నిషాంత్ శెట్టి అనే యువకుడు ఆ రికార్డును తిరగరాశాడు. అప్పట్నుంచి అతడి దృష్టి అంతా మళ్లీ కొత్త రికార్డు సాధించడంపైనే నిలిచింది. మరింత కఠోర సాధన చేయసాగాడు. తర్వాత తానేంటో నిరూపించుకునే సమయం రానే వచ్చింది. మార్చి 31న ముగిసిన కంబళ పోటీల్లో శ్రీనివాస వారం వ్యవధిలోనే తన రికార్డును తానే అధిగమించాడు. వరుసగా 8.96 సెకన్లు, 8.78 సెకన్లలో పోటీ పూర్తి చేశాడు.
రెండు వారాల్లోనే
31 ఏళ్ల శ్రీనివాస గౌడది కర్ణాటకలోని మంగళూరు జిల్లా అశ్వత్థపుర. ఇంట్లో ఆర్థిక సమస్యలతో పదవతరగతి కాగానే చదువాపేశాడు. కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు నిర్మాణ కార్మికుడిగా, వ్యవసాయ కూలీగా మారాడు. 15 ఏళ్ల వయసులో పొలం యజమానుల పశువులను మేపుతూ, చెరువుల్లో స్నానం చేయించేవాడు. ఈ సమయంలోనే వాటిని వేగంగా తరుముతూ వెంటపడి పరుగులు తీసేవాడు. ఈ క్రమంలో ఊరి పరిసరాల్లో కంబళ పోటీలు నిర్వహిస్తుంటే ఆసక్తిగా గమనించేవాడు. 2011లో కాంతప్ప గౌడ అనే మోతుబరి దున్నలను పరుగెత్తించే యువకుడు లేకపోవటంతో శ్రీనివాస గౌడకు అవకాశం ఇచ్చాడు. దీనికోసం కార్కళలో ఏర్పాటైన కంబళ సమితి ఇచ్చే శిక్షణలో చేరాడు. కేవలం రెండు వారాల శిక్షణతోనే మియరు ప్రాంతంలోని లవకుశ మైదానంలో తొలిసారిగా కంబళ పోటీలో పాల్గొని తొలి పోటీలోనే విజేతగా నిలిచాడు. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. గడిచిన పదేళ్లలో 250కిపైగా ప్రథమ బహుమతులు శ్రీనివాసగౌడ ఖాతాలో జమ అయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ఐకళ బావా’ పోటీల్లో 145 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో అధిగమించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు.
ప్రపంచ మెప్పు
శ్రీనివాస గతేడాది ఫిబ్రవరిలో ఉసేన్బోల్ట్ రికార్డును అధిగమించిన వెంటనే రాత్రికి రాత్రే సెలెబ్రెటీగా మారిపోయాడు. ఇది అధికారిక రికార్డు కాకపోయినా జాతీయ, అంతర్జాతీయ, సామాజిక మాధ్యమాలు అతడిని ఆకాశానికి ఎత్తేశాయి. మేటి అథ్లెట్కి ఏమాత్రం తీసిపోని సామర్థ్యం ఉన్న శ్రీనివాసగౌడకు ఒలింపిక్స్ శిక్షణ ఇప్పించాలని మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర కేంద్ర క్రీడల మంత్రికి ట్యాగ్ చేశారు. అప్పటి క్రీడల మంత్రి కిరణ్ రిజుజూ శ్రీనివాసకి నేరుగా ఫోన్ చేశారు. మాజీ మంత్రి శశి థరూర్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి, బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్లు కూడా శ్రీనివాసని ఆకాశానికి ఎత్తేశారు.
తాళ్లతో కట్టి మరీ..
ఎంతో ఫిట్గా ఉంటేగానీ కంబళ పోటీల్లో పాల్గొనడం సాధ్యం కాదు. దీనికోసం రోజూ చెరువుల్లో దున్నలతో పాటు ఈత కొట్టడం, ఆపై వాటితో కనీసం ఆరు కిలోమీటర్ల వాకింగ్ చేస్తాడు. వేగాన్ని పెంచుకునేందుకు ద్విచక్రవాహనాలకు తాళ్లు కట్టి మరీ పరుగెత్తుతాడు. గంజి అన్నంతోపాటు చేపలు ఎక్కువగా తీసుకుంటాడు. వ్యవసాయ పనులు, భవనాల కట్టడంతోనే తన శరీరం పటిష్ఠంగా తయారైందంటాడు శ్రీనివాస.
- కె.ముకుంద, బెంగళూరు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే