శిఖరాలే.. చిన్నబోయేలా!

కుర్రాళ్లంటే ఉత్సాహానికి చిరునామాలు. అలుపెరుగని శక్తికి ప్రతిరూపాలు. వాటిని సద్వినియోగం చేస్తే భారీ లక్ష్యాలు చిన్నబోతాయి. మేటి విజయాలు పాదాక్రాంతమవుతాయి. ఇద్దరు యువకులు అలా తమని తాము నిరూపించుకున్నారు.....

Updated : 07 Aug 2021 06:41 IST

కుర్రాళ్లంటే ఉత్సాహానికి చిరునామాలు. అలుపెరుగని శక్తికి ప్రతిరూపాలు. వాటిని సద్వినియోగం చేస్తే భారీ లక్ష్యాలు చిన్నబోతాయి. మేటి విజయాలు పాదాక్రాంతమవుతాయి. ఇద్దరు యువకులు అలా తమని తాము నిరూపించుకున్నారు.


అతడి అడుగు కింద ఏడు పర్వతాలు..

పుట్టింది గుడిసెలో.. కానీ గూగుల్‌లో వెతికితే తన గురించి తెలియాలని కోరిక!
ఐదువేళ్లు నోట్లోకి వెళ్తేనే గొప్ప.. అయినా ఎత్తైన పర్వతాలన్నీ అధిరోహించడం కల!
అవరోధాలెన్ని ఎదురైనా.. ఒక్కొక్కటిగా శిఖరాలను ఎక్కేస్తూనే ఉన్నాడు కర్నూలు జిల్లా గోనెగండ్ల కుర్రాడు జి.సురేశ్‌బాబు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ఫ్రెండ్‌షిప్‌ పీక్‌నీ పాదాక్రాంతం చేసుకొని ఐదు ఖండాల్లోని ఏడు పర్వతాలు అధిరోహించిన పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు.

సురేశ్‌ అమ్మానాన్నలు దినసరి కూలీలు. చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే కొనసాగింది. ఓసారి తను కొబ్బరి చెట్టు ఎక్కి, కింద పడ్డాడు. కాలు విరిగింది. చాలా ఏళ్లు మామూలుగా నడవలేకపోయాడు. తనకిష్టమైన క్రికెట్‌, కబడ్డీ, ఖోఖోలు ఆడలేని పరిస్థితి. తను కోల్పోయిన ఆనందాన్ని ఎలాగైనా తిరిగి పొందాలనీ, తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని కసిగా అనుకునేవాడు. ఇంటర్‌లో ఆ అవకాశం వచ్చింది. పర్వతారోహణపై ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇవ్వమని కోరారు తను చదువుతున్న గురుకుల విద్యాసంస్థలోని ఉపాధ్యాయులు. సురేశ్‌ వెంటనే స్పందించాడు. రకరకాల పరీక్షల అనంతరం డార్జిలింగ్‌లోని హిమాలయన్‌ మౌంటెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌కి ఎంపికయ్యాడు. పర్వతారోహణకు దేశంలోనే అత్యుత్తమ శిక్షణా సంస్థ అది. అక్కడ మైనస్‌ 40 డిగ్రీల గడ్డకట్టే చలిలోనూ ఒడుపుగా శిఖరాలు ఎక్కడం నేర్చుకున్నాడు. అప్పట్నుంచి ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను ఒక్కొక్కటిగా అధిరోహిస్తూనే ఉన్నాడు.

వందలు, వేల మీటర్ల ఎత్తుండే శిఖరాలు ఎక్కడం మాటలు కాదు. ఒకరకంగా ప్రాణాలకు తెగించడమే. అలాంటి ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాడు సురేశ్‌. నేపాల్‌లోని ‘లోత్స్‌’ని అధిరోహించే సమయంలో మంచుకొండలు విరిగి పడ్డాయి. తృటిలో తప్పించుకున్నాడు. నిచ్చెనలు, తాళ్లసాయంతో భారీ గుంతలు దాటాడు. కొన్నిసార్లు నీళ్లు దొరక్కపోతే కొండలపై ఉండే మంచును చప్పరిస్తూ గమ్యాన్ని చేరాడు. ఓసారైతే కిందికి దిగే సమయంలో పర్వాతారోహణకు వచ్చి చనిపోయిన వ్యక్తి మృతదేహంపై పడ్డాడు. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది అంటాడు. అయినా లక్ష్యం చేరిన తర్వాత శిఖరంపై మువ్వన్నెల జెండాని ఎగరేసినప్పుడు కలిగే ఆనందం కోసం ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవడానికైనా సిద్ధమేనంటాడు ఈ 23 ఏళ్ల సాహసి. మొత్తానికి నాలుగేళ్లలో 18 శిఖరాగ్రాలను చేరి రికార్డు సృష్టించాడు. ఈ ప్రయాణంలో సురేశ్‌తో కలిసి చదువుకున్న సిల్వర్‌జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు అన్నిరకాలుగా అండగా నిలిచారు. 

ఘనతలివీ..

* 2017 మేలో పదిహేనేళ్ల వయసులోనే మౌంట్‌ ఎవరెస్టుని అధిరోహించాడు.

* 2017 డిసెంబరులో దక్షిణాఫ్రికాలో 5,895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతం అంచున కాలు మోపాడు.

* 2018 ఆగస్టులో యూరప్‌ ఖండంలోనే ఎత్తైన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ శిఖరం చేరాడు.

* 2018లో 8,163 మీటర్ల మౌంట్‌ మానస్‌లు పర్వతాన్ని 40 రోజులు కష్టపడి ఎక్కాడు. దక్షిణ భారతదేశంలో ఈ ఘనత సాధించింది సురేశ్‌నే.

* 2019లో ఆస్ట్రేలియా ఖండంలో ఎత్తైన కోసియాజ్‌కో, దాని పక్కనున్న మరో తొమ్మిది పర్వతాలు ఎగబాకాడు.

* 2019లోనే దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తైన మౌంట్‌ అర్జెంటీనా శిఖరం చివరి భాగానికి వెళ్లొచ్చాడు..

* 2019 ఏప్రిల్‌ నెలలో నాలుగో ఎత్తైన 8,516 మీటర్ల లోత్స్‌ శిఖరాన్ని అధిరోహించి యంగెస్ట్‌ భారతీయుడిగా నిలిచాడు.

- యడ్లపాటి బసవ సురేంద్ర, కర్నూలు


యానాం కుర్రాడి మరపురాని యానం

సంకల్పం గట్టిదైతే సుదూర లక్ష్యాన్నైనా తేలికగా చేరుకోవచ్చు అని నిరూపించాడు యానాం అబ్బాయి కడలి శ్రీకాంత్‌. దానికో సదాశయాన్ని కూడా జోడించాడు. యానాం నుంచి లద్దాఖ్‌ వరకు 3,400 కి.మీ సైకిల్‌పై ప్రయాణించి రికార్డు సృష్టించాడు. ఆ అనుభవం అతడి మాటల్లోనే...

చిన్నప్పట్నుంచీ ఏదైనా వైవిధ్యంగా చేయాలనుకునే తపన నాది. నాన్న ప్రోత్సహించేవారు. అలా సాగుతున్న నా గమనాన్ని కరోనా మార్చేసింది. లాక్‌డౌన్‌తో బీటెక్‌ ఫైనలియర్‌లో ఇంటికే పరిమితం కావడం బోరింగ్‌గా అనిపించింది. ఈ సమయంలో వార్తల్లో లద్దాఖ్‌ పేరు బాగా వినిపించేది. అక్కడికి వెళ్లి రావాలనుకున్నా. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సైకిల్‌పై యాత్ర చేయాలనుకున్నా. దాంతోపాటు నా టూర్‌కి ఒక మంచి ఉద్దేశం ఉండాలనుకున్నా. ఉత్తరాదిలో యువతలో మాదకద్రవ్యాల వాడకం ఎక్కువ. దానివల్ల కలిగే అనర్థాలు ప్రచారం చేయాలనుకున్నా.

జూన్‌ 24న ప్రయాణం మొదలైంది. రెండు జతల దుస్తులు, చిన్న టెంట్‌, వ్యక్తిగత సామగ్రి, ఔషధాలు తీసుకొని బయల్దేరా. ఆంధ్రప్రదేశ్‌తో మొదలు పెట్టి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, హరియాణా, పంజాబ్‌, చంఢీగఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ మీదుగా జులై 29న లద్దాఖ్‌ చేరుకొన్నాను. మనాలీ వరకు సాఫీగా సాగిన ప్రయాణం అక్కడి నుంచి లద్దాఖ్‌కు సంక్లిష్టంగా మారింది. 70 కి.మీలకి ఒక ఊరు, మంచుకొండలు, లోయలు, సముద్ర మట్టానికి వేల మీటర్ల ఎత్తులో సైకిల్‌ ప్రయాణం దారుణంగా ఉండేది. కొన్నిసార్లు దారిలో నేల జారిపోయేది. లోయలో పడితే శవం కూడా దొరకని పరిస్థితి. దీనికితోడు కొన్ని రాత్రులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అనిపించేది. మరోవైపు భాష సమస్య. అయినా వెనకడుగు వేయకుండా లద్దాఖ్‌లోని సముద్ర మట్టానికి 18,792 అడుగుల ఎత్తులో ఉన్న ఖార్దూంగ్లా పాస్‌ వద్ద యాత్ర ముగించా. ఈ సుదీర్ఘ యాత్రలో వైవిధ్య పరిస్థితులు, భాషలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఊహించని సవాళ్లు చూసి నూరేళ్ల జీవన యానానికి కావాల్సిన అనుభవాన్ని గడించా. యువత ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా ఇలాంటి యాత్ర చేయాలి. అప్పుడే బయటి ప్రపంచం తెలుస్తుంది. మనం ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలం అనే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.                                                                                       

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌, రాజమహేంద్రవరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని