14 నెలలు.. 14 పురస్కారాలు

మెడిసిన్‌లో సీటొస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ దాన్ని కాదనుకొని పశు వైద్యశాస్త్రం ఎంచుకున్నాడు పి.వినాయక సిద్ధార్థ్‌. ఎందుకంటే.. తనకి మూగజీవాలంటే ప్రాణం. అదే ఇష్టంతో మేటి పరిశోధనలు చేసి జాతీయ స్థాయిలో పలు అవార్డులు, గుర్తింపు అందుకున్నాడు.

Updated : 07 Jan 2023 07:57 IST

మెడిసిన్‌లో సీటొస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ దాన్ని కాదనుకొని పశు వైద్యశాస్త్రం ఎంచుకున్నాడు పి.వినాయక సిద్ధార్థ్‌. ఎందుకంటే.. తనకి మూగజీవాలంటే ప్రాణం. అదే ఇష్టంతో మేటి పరిశోధనలు చేసి జాతీయ స్థాయిలో పలు అవార్డులు, గుర్తింపు అందుకున్నాడు. ఆ విజయాల్ని, ఆవిష్కరణల ఫలితాల్ని ‘ఈతరం’తో పంచుకున్నాడు.

వినాయకది అన్నమయ్య జిల్లా మదనపల్లె. చిన్ననాటి నుంచి మూగ జీవాలతో సావాసం చేసేవాడు. తన ఇల్లంతా పక్షులు, పెంపుడు శునకాలు, కుందేళ్లతో సందడిగా ఉండేది. తల్లిదండ్రులు విద్యావంతులు కావడంతో సహజంగానే తనకి చదువుపై ఆసక్తి ఉండేది. మొదట్నుంచీ మార్కుల్లో ముందుండేవాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో నిర్వహించిన ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చింది. మెడిసిన్‌లో సీటు వచ్చే అవకాశం ఉన్నా.. పశుపక్ష్యాదులపై ఇష్టంతో అటువైపు వెళ్లాలనుకొని పశువైద్య శాస్త్రంలో చేరాడు. 2018లో డిగ్రీ పూర్తి కాగానే పశువైద్య ప్రజారోగ్య విభాగంలో పీజీలో ప్రవేశం లభించింది.

ఐదేళ్ల పాటు బీవీఎస్సీ.. రెండేళ్ల పాటు పీజీ పూర్తిచేసిన సిద్ధార్థ్‌ పద్నాలుగు నెలల కిందట తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలో ప్రవేశం పొందాడు. ఇదే నా జీవితంలో కీలకమైన పరిశోధనలు చేసేందుకు తోడ్పడింది అంటాడు. పశువైద్య శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసి, పరిశోధనలు చేసే క్రమంలో తనకి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో 14 అవార్డులు, ప్రశంసలు, పురస్కారాలు లభించాయి.

పరిశోధనలు, గుర్తింపు

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఏటా నిర్వహించే జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కోసం దేశవ్యాప్తంగా వేలమంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. వినాయక సిద్ధార్థ్‌ పోటీ పడిన విభాగంలో కేవలం 120 మంది మాత్రమే ఈ ఫెలోషిప్‌నకు అర్హత సాధించారు. మొత్తమ్మీద ఈ పదేళ్లలో ఏపీ నుంచి దీనికి ఆరుగురు మాత్రమే ఎంపికయ్యారు. అందులో సిద్ధార్థ్‌ ఒకడు. దీని ద్వారా ప్రతి నెలా రూ.32 వేల ఉపకార వేతనం అందుకుంటున్నాడు. రెండేళ్ల తరువాత రూ.38 వేలు అందుకోనున్నాడు. 2021 ఏప్రిల్‌లో పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన వినాయక సిద్ధార్థ్‌ విభాగాధిపతి డాక్టర్‌ జగదీశ్‌బాబు మార్గదర్శకత్వంలో దూసుకెళ్తున్నాడు. కేరళలోని యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగాం ద్వారా ‘కోహర్ట్‌’ పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి సదస్సులో వన్‌ హెల్త్‌ అంశంపై చేసిన గ్రాఫిక్‌ డిజైనింగ్‌ పోటీలో మొదటి స్థానంలో నిలిచాడు. మూగజీవాల నుంచి మనుషులకు సోకే జన్యుపరమైన వ్యాధులపై వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన అవగాహనా సదస్సులు, సమావేశాల్లో పాల్గొని ప్రెజెంటేషన్‌ ఇచ్చాడు. పలు బహుమతులు సాధించాడు. పంజాబ్‌ ప్రభుత్వం నుంచి ‘బెస్ట్‌ ఆర్టిస్టిక్‌ ఇన్‌స్పిరేషన్‌ అవార్డు’, ‘ఆల్‌ ఇండియా పాపులర్‌ ఆర్టికల్‌ రైటింగ్‌ కాంపిటీషన్‌’ పురస్కారం, ‘బెస్ట్‌ పోస్టర్‌ ప్రజెంటేషన్‌’ గుర్తింపులాంటి పలు అవార్డులు అందుకున్నాడు. శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం నిర్వహించిన 11వ స్నాతకోత్సవంలో మూడు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి సొంతం చేసుకున్నాడు. విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక విద్యార్థి మూడు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతి అందుకోవడం ఇదే మొదటిసారి!.

పరిష్కారం దిశగా..

మనుషులకు వచ్చే వ్యాధుల్లో అరవైశాతం వరకు జంతువులు, పశుపక్ష్యాదుల నుంచే సంక్రమిస్తాయి. దీన్ని అరికట్టే దిశగా విరివిగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలోనూ చికిత్సలు ఎక్కువగా లభించడం లేదు. ఈమధ్య కాలంలో దీనికి పరిష్కారం చూపించేలా ‘వన్‌ హెల్త్‌’ అనే విధానం తెరమీదకు వచ్చింది. పీహెచ్‌డీలో నా పరిశోధన అంశం కూడా జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల్లో ఆధునిక పద్ధతుల ద్వారా నియంత్రణలు, పరిష్కార విధానాలు కనుగొనడం. ఏడాదిన్నరగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని తొంభై మండలాల్లో కోళ్లఫారాలు, పశువుల పాకలు, మాంసం దుకాణాలు తిరుగుతున్నాను. ఈ ప్రాంతాల్లోంచి మనుషుల్లోకి చొరబడే స్టెణీలోకోకాస్‌, ఎస్కెరీచియా కొలై అనే సూక్ష్మజీవులపై పరిశోధనలు చేస్తున్నాను. పశువుల్లో మోతాదుకు మించి విచక్షణారహితంగా ఇస్తున్న యాంటీబయోటిక్స్‌తో కలిగే దుష్ఫరిణామాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నాను. ఈ విభాగంలో సమగ్రమైన పరిశోధనలతో కొన్ని సమస్యలకైనా శాశ్వత పరిష్కారం కనుగొనాలన్నదే నా లక్ష్యం.

పసుపులేటి వేణుగోపాల్‌, తిరుపతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని