Andhra News: ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉంది: పేర్ని నాని

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉందని, అందుకే ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. నిజంగా ఆర్థిక పరిస్థితి బాగుంటే

Updated : 06 Feb 2022 07:38 IST

వచ్చే ఆదాయం జీతాలకు, వడ్డీలకే పోతే సంక్షేమానికి ఎక్కడి నుంచి తేవాలి?

సచివాలయ ఉద్యోగినులతో మంత్రి వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉందని, అందుకే ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. నిజంగా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇంత మందితో ఎందుకు గొడవ పెట్టుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి సచివాలయం రెండో బ్లాక్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపుతూ... మధ్యలో ఆయన ఫోన్‌ మాట్లాడేందుకు బయటకు వచ్చారు. అక్కడ వేచి ఉన్న మహిళా ఉద్యోగులు కొందరు... ఆయన దగ్గరకు వెళ్లి ఐఆర్‌ 27 శాతం ఇచ్చి... ఫిట్‌మెంట్‌ 23 శాతానికి తగ్గించడమేమిటని, ఎప్పటి నుంచో ఉన్న హెచ్‌ఆర్‌ఏని ఇప్పుడు తగ్గించడమేమిటని ప్రశ్నించారు. వాటికి మంత్రి పేర్ని నాని బదులిస్తూ... ‘‘కొడుకు పదో తరగతిలో చేరినప్పుడు... ఫస్ట్‌క్లాస్‌ తెచ్చుకుంటే స్కూటర్‌ కొనిస్తానని ఒక తండ్రి మాట ఇచ్చాడు. తీరా ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యేసరికి ఆ తండ్రి దివాళా తీశాడు. మా నాన్న స్కూటర్‌ కొనిస్తానని ఇవ్వలేదని కొడుకు తిట్టుకుంటే మాత్రం ఆయన ఏం చేయగలడు? ప్రభుత్వం పరిస్థితి ఇలాగే ఉంది. రాష్ట్రంలో 1.57 కోట్ల తెల్ల రేషన్‌కార్డుదారులు ఉన్నారు. వారంతా కూడా ఉప్పు, పప్పు కొని ప్రభుత్వానికి జీఎస్టీ కడుతున్నారు కదా? వాళ్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది కదా? మరి ప్రభుత్వం వాళ్లకేమీ చేయవద్దా? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకు, తెచ్చిన అప్పులపై వడ్డీలు కట్టడానికే సరిపోతే... మరి వాళ్ల సంక్షేమానికి ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం రుణం కూడా రూ.40 వేల కోట్లు మాత్రమే తేగలం...’’ అని పేర్కొన్నారు. మీరే ఏదో పెద్ద మనసు చేసుకుని హెచ్‌ఆర్‌ఏ పెంచాలని ఉద్యోగినులు కోరగా... ‘‘ఇది మనసుకి సంబంధించిన అంశం కాదు. గల్లా పెట్టెతో ముడిపడిన అంశం. ఇప్పుడు పెంచేస్తే నాలుగో నెలలోనో, ఐదో నెలలోనో జీతం ఇవ్వగలగాలి కదా? రెండు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి, తీరా రుణం తీర్చాల్సిన సమయానికి దివాళా తీస్తే... వడ్డీ తగ్గించండంటూ బతిమాలుకుంటాం కదా? అలా ఉంది పరిస్థితి...’’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని