Andhra News: డిస్కంలు చెల్లించాల్సింది.. రూ.9వేల కోట్లు!

పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారమే యూనిట్‌ ధరను చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో విద్యుత్‌ సంస్థలు వడ్డీతో కలిపి సుమారు రూ.9వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని అధికారులు

Updated : 16 Mar 2022 05:42 IST

పునరుత్పాదక విద్యుత్‌ సంస్థలకు కట్టాల్సిందే

ఈనాడు, అమరావతి: పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారమే యూనిట్‌ ధరను చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో విద్యుత్‌ సంస్థలు వడ్డీతో కలిపి సుమారు రూ.9వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పీపీఏల ధరలు ఎక్కువగా ఉన్నాయని.. వాటిని పునఃసమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంలో కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులను పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నిర్వాహకులు కోర్టులో సవాలు చేశారు. కేసు విచారణలో భాగంగా తుదితీర్పు వెల్లడించే వరకూ పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.43, సౌర విద్యుత్‌కు రూ.2.44 వంతున చెల్లించాలని డిస్కంలను కోర్టు ఆదేశించింది. డిస్కంలు అలాగే చెల్లిస్తున్నాయి. పీపీఏ ప్రకారం పూర్తి మొత్తాన్ని విద్యుత్‌ సంస్థలు చెల్లించాల్సిందేనని హైకోర్టు తుదితీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిస్కంలు భావిస్తున్నాయి.  

మొత్తం 7,400 మెగావాట్లు

ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పీపీఏల ధరలను సమీక్షించనున్నట్లు ప్రకటించింది. పవనవిద్యుత్‌ 3,900 మెగావాట్లు, సౌర విద్యుత్‌కు సంబంధించి 3,500 మెగావాట్లకు సంబంధించిన 264 పీపీఏలను సమీక్షించాలని నిర్ణయించింది. వారికి నోటీసులు జారీచేసింది. ఇందులో పవన విద్యుత్‌ పీపీఏలు 220, సౌరవిద్యుత్‌ పీపీఏలు 44 ఉన్నాయి. పీపీఏ ప్రకారం పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.4.84 వంతున, సౌర విద్యుత్‌కు యూనిట్కు గరిష్ఠంగా రూ.6.49 నుంచి 5.70 వరకు చెల్లించాలి. యూనిట్‌ రూ.5.70 ధరకు కుదుర్చుకున్న పీపీఏలు సుమారు 2వేల మెగావాట్ల వరకు ఉన్నాయి. సౌర విద్యుత్‌ సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏ నిబంధన ప్రకారం ఏటా యూనిట్‌ ధరను 3% పెంచాలి. ఈ ప్రకారం ప్రస్తుతం కొన్ని పీపీఏలకు యూనిట్‌కు రూ.7.15 వంతున డిస్కంలు చెల్లించాలి. 264 పీపీఏల ద్వారా ఏటా సుమారు 15 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిస్కంలకు అందుతుంది.


చెల్లించాల్సింది 2018 జూన్‌ నుంచి..

పీపీఏల వివాదంపై తుదితీర్పు వచ్చేవరకూ కోర్టు నిర్దేశించిన ధరల ప్రకారం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాలని 2019 సెప్టెంబరు 24న డిస్కంలను ఆదేశించింది. అప్పటివరకూ ఉన్న బకాయిలకూ ఇదే టారిఫ్‌ వర్తిస్తుందని పేర్కొంది. దీని ప్రకారం పునరుత్పాదక విద్యుత్‌ సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు 2018 జూన్‌ నుంచి డిస్కంలు చెల్లించాలి. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం డిస్కంలు చెల్లించాయి. ప్రస్తుత తీర్పుతో 2018 జూన్‌ నుంచి పీపీఏ ధరల ప్రకారం చెల్లించాలి. ఈ లెక్కన సుమారు రూ.7,500 కోట్లు.. 9% వడ్డీ కలిపి చెల్లించాలి. ఈ రూపేణా సుమారు రూ.1,500 కోట్లు అవుతుందని అంచనా. పీపీఏ వివాదంపై కోర్టును ఆశ్రయించిన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు 2021 జనవరి నుంచి, మిగిలిన వాటికి 2021 జూన్‌ నుంచి తీసుకున్న విద్యుత్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని డిస్కంలు పూర్తిగా నిలిపేశాయి. విద్యుత్‌సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని