Covaxin: ‘కొవాగ్జిన్‌’పై తప్పుడు వార్తలు.. రాజకీయ ఒత్తిళ్లతో అనుమతులు అవాస్తవం: కేంద్రం

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొవిడ్‌-19 టీకా ‘కొవాగ్జిన్‌’కు వేగంగా అనుమతులు లభించాయని వచ్చిన మీడియా వార్తలు ‘తప్పుదోవ పట్టించే’, ‘అసత్య’ వార్తలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Updated : 18 Nov 2022 09:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొవిడ్‌-19 టీకా ‘కొవాగ్జిన్‌’కు వేగంగా అనుమతులు లభించాయని వచ్చిన మీడియా వార్తలు ‘తప్పుదోవ పట్టించే’, ‘అసత్య’ వార్తలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత ప్రభుత్వం, జాతీయ నియంత్రణ సంస్థ అయిన సీడీఎస్‌సీఓ ఈ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే సమయంలో శాస్త్రీయ విధానాలను, సంబంధిత నిబంధనలను పాటించినట్లు స్పష్టం చేసింది. భారత్‌ బయోటెక్‌ తన టీకా తయారీలో ‘కొన్ని ప్రక్రియలను వదిలేసింద’ని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా క్లినికల్‌ పరీక్షలను ‘వేగవంతం’ చేసిందన్న మీడియా వార్తలపై మంత్రిత్వశాఖ పై విధంగా స్పందించింది.

అన్ని పరీక్షలు పూర్తయ్యాకే టీకా ఆవిష్కరణ: భారత్‌ బయోటెక్‌

కొంతమంది వ్యక్తులు, బృందాలు ‘కొవాగ్జిన్‌’ టీకాపై కావాలని బురద చల్లుతుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ గురువారం ఇక్కడ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి టీకా పరిజ్ఞానంపై ఏమాత్రం అవగాహన లేనివారు చేసే ఆరోపణలేనని స్పష్టం చేసింది. కొవాగ్జిన్‌ టీకా అభివృద్ధి ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి తమపై ఎప్పుడూ లేదని వివరించింది. ‘వాస్తవానికి మేమే అంతర్గతంగా కొవిడ్‌ మహమ్మారికి వేగంగా స్పందించాం. భద్రమైన, ప్రభావవంతమైన టీకా ఆవిష్కరించి ప్రజల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో పనిచేశాం’ అని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో..

‘ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అధ్యయనాలు జరిగిన టీకాల్లో ‘కొవాగ్జిన్‌’ ఒకటి. దీనిపై 20 ప్రీ-క్లినికల్‌ అధ్యయనాలు నిర్వహించాం. 3 ఛాలెంజ్‌ ట్రయల్స్‌, 9 హ్యూమన్‌ క్లినికల్‌ స్టడీస్‌ చేపట్టాం. ఈ పరీక్షల్లో టీకా సత్తా నిర్ధారణ అయింది’ అని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. కొవాగ్జిన్‌ టీకాపై 20 పరిశోధన వ్యాసాలు వచ్చినట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని