రూ.29 లక్షలు కాదని.. రూ.1,600కే రాసిచ్చారు

కర్నూలులోని ఏపీ ఆగ్రోస్‌కు చెందిన స్థలానికి ఏటా రూ.29.04 లక్షల అద్దె ఇస్తామన్న వారిని కాదని, రాష్ట్ర ప్రభుత్వం వైకాపా కార్యాలయం కోసం కేవలం రూ.1,600కే కేటాయించింది.

Published : 06 Jun 2023 07:02 IST

వైకాపా కార్యాలయానికి సర్కారీ స్థలం లీజు
కోర్టును ఆశ్రయించాలని బాధిత సంస్థ నిర్ణయం

ఈనాడు, కర్నూలు: కర్నూలులోని ఏపీ ఆగ్రోస్‌కు చెందిన స్థలానికి ఏటా రూ.29.04 లక్షల అద్దె ఇస్తామన్న వారిని కాదని, రాష్ట్ర ప్రభుత్వం వైకాపా కార్యాలయం కోసం కేవలం రూ.1,600కే కేటాయించింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయం ఒనగూరే అవకాశాన్ని కాలదన్ని, సొంత పార్టీ అవసరాలకు సర్కారీ స్థలాన్ని కేటాయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ అద్దెతోపాటు లీజు గడువు ముగిశాక రూ.కోట్ల విలువైన వాణిజ్య సముదాయం ప్రభుత్వ పరమయ్యే అవకాశాన్ని వదులుకొని, రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వైకాపాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కర్నూలులోని ఐదు రోడ్ల కూడలిలో 1.6 ఎకరాల స్థలాన్ని ఆగ్రో ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణం కోసం ‘మెస్సర్స్‌ ఆగ్రో ట్రేడ్‌ సెంటర్‌ (కర్నూలు) ప్రైవేటు లిమిటెడ్‌’ సంస్థకు లీజు ప్రాతిపదికన కేటాయించాలని 2012లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా రూ.29.04 లక్షల అద్దె చెల్లించేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థకే లీజుకు ఇస్తూ తర్వాత అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా సంస్థ పాటించాల్సిన నిబంధనలు, చెల్లించాల్సిన సొమ్ము వివరాలను ప్రకటించింది. ప్రభుత్వ సూచనల ప్రకారం ఆగ్రో ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణం కోసమే ఈ సంస్థ ఏర్పడింది. అందులో ఎస్వీ ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రధాన భాగస్వామి కాగా, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, నియోటెక్‌ సొల్యూషన్స్‌ సంస్థలు వాటాదారులు. ఒప్పందం మేరకు ఆగ్రో సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి రుసుం చెల్లించింది.

కేటాయించిన స్థలంలో వాణిజ్య భవనం నిర్మించి ట్రేడ్‌ సెంటర్‌ నిర్వహణకు అవసరమైన మేర ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. మిగిలిన స్థలాన్ని వాణిజ్య ప్రాతిపదికన లీజు పొందిన సంస్థ వినియోగించుకోవచ్చు. 33 ఏళ్ల పాటు లీజు మనుగడలో ఉంటుంది. గడువు ముగిశాక అక్కడ నిర్మించిన భవనాలను ప్రభుత్వానికి అప్పగించాలి. లీజుదారుకు ఆదాయం వచ్చినా, రాకపోయినా లీజు రుసుములను మాత్రం ప్రభుత్వానికి కట్టాల్సిందే. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, స్థలాన్ని లీజుదారుకు ఇంకా అప్పగించలేదు. ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని ఎప్పటికైనా అప్పగిస్తారన్న ఆశతో లీజుదారులు ఉన్నారు. ఇంతలో ప్రభుత్వం తాజాగా వైకాపా కార్యాలయానికి కేటాయించడంపై మెస్సర్స్‌ ఆగ్రో ట్రేడ్‌ సెంటర్‌ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమైంది. ‘కర్నూలు నడిబొడ్డున విలువైన ఈ స్థలాన్ని మాకు కేటాయిస్తామని చెప్పి, భారీ మొత్తంలో రుసుములు కూడా కట్టించుకున్నాక అన్యాయం చేయడమేంటి? మేం చెల్లించిన సొమ్ము వెనక్కి ఇవ్వకుండా, ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఇతరులకు ఆ స్థలాన్ని ఎలా కేటాయిస్తారు’ అని సంస్థ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని