Vizag Drugs Case: కంటెయినర్‌లో వచ్చింది డ్రగ్సే

సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నానికి వచ్చిన కంటెయినర్‌లోని ‘ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌’ బస్తాల్లో నుంచి 49 నమూనాల్ని తీసి పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్‌, మెథక్వలోన్‌ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది.

Updated : 24 Mar 2024 10:06 IST

49 నమూనాల్ని పరీక్షిస్తే.. కొకైన్‌, మెథక్వలోన్‌ ఉన్నట్లు నిర్ధారణ
టెస్ట్‌-ఏలో 27 నమూనాల్లో మార్ఫిన్‌, ఓపియం, హెరాయిన్‌
విశాఖ డ్రగ్‌ రాకెట్‌ కేసులో సుదీర్ఘ ఆపరేషన్‌
ఇంటర్‌పోల్‌ నుంచి మెయిల్‌లో సమాచారం  
ఆ వెంటనే విమానంలో విశాఖకు ప్రయాణం
సీబీఐ నివేదికలో వెల్లడి

ఈనాడు, అమరావతి: సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నానికి వచ్చిన కంటెయినర్‌లోని ‘ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌’ బస్తాల్లో నుంచి 49 నమూనాల్ని తీసి పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్‌, మెథక్వలోన్‌ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది. ఓపియం, మార్ఫిన్‌, హెరాయిన్‌, యాంఫిటమిన్‌, మెస్కలిన్‌ తదితరాల ఉనికి ఉందా?అనేది తెలుసుకునేందుకు 27 నమూనాలకు టెస్ట్‌-ఏ నిర్వహించగా... అన్నింటిలోనూ ఆ డ్రగ్స్‌ ఉన్నట్లు తేలింది. ఒక్కోటీ 25 కిలోల పరిమాణం కలిగిన 1,000 బస్తాల ‘ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌’ను 20 ప్యాలెట్‌లలో నింపి బ్రెజిల్‌ నుంచి కంటెయినర్‌లో విశాఖపట్నానికి తీసుకొచ్చారు. వాటిలో ఒక్కో ప్యాలెట్‌ నుంచి ఒక్కోటి చొప్పున ర్యాండమ్‌గా 20 బస్తాలను సీబీఐ అధికారులు బయటకు తీసి నమూనాలను పరీక్షించారు.

అన్నింటిలో మాదకద్రవ్యాలు ఉన్నట్లు నిర్ధారణైంది. అంటే మొత్తం 25 వేల కిలోల ‘ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌’ లోనూ మాదకద్రవ్యాలు ఉనికి ఉన్నట్లు స్పష్టమైంది. ఎంత పరిమాణంలో ఉన్నాయో తేలాల్సి ఉంది. కనీసం 20 శాతం మేర మాదకద్రవ్యాలు కలగలిసి ఉంటాయనుకున్నా... ఇంత భారీ మొత్తంలో చిక్కడం దేశంలోనే తొలిసారి కావొచ్చు. వీటి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుందనేది అనధికారిక అంచనా. ఇంతటి అతిపెద్ద అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించేందుకు సీబీఐ సుదీర్ఘ ఆపరేషన్‌ చేపట్టింది. ఆ వివరాలన్నింటినీ ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఓ నివేదిక రూపంలో పొందుపరిచింది.

ఆఘమేఘాలపై...

అది దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం.... ఈ నెల 18న ఇంటర్‌పోల్‌ నుంచి వారికి ఓ మెయిల్‌ అందింది.. ‘బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నానికి ఎస్‌ఈకేయూ 4375380 నంబరు కంటెయినర్‌ వస్తోంది... అందులో భారీగా డ్రగ్స్‌ ఉన్నాయి. మేం దాన్ని గుర్తించేలోగానే అది ఇక్కడ పోర్టు దాటేసింది. మీరు దాన్ని పట్టుకుని తనిఖీ చేయండి’ అనేది దాని సారాంశం. ఆ సమాచారం ఆధారంగా నిమిషాల వ్యవధిలో సీబీఐ ఫిర్యాదు నమోదు చేసి రంగంలోకి దిగింది. ఎస్పీ గౌరవ్‌మిట్టల్‌ నేతృత్వం, పర్యవేక్షణలో డీఎస్పీలు ఉమేశ్‌ శర్మ, ఆకాశ్‌కుమార్‌ మీనాలతో పాటు మరికొందరితో బృందాన్ని ఏర్పాటు చేసింది. ‘ప్రత్యేక ఆపరేషన్‌ కోసం దిల్లీ నుంచి మీ దగ్గరకు ఓ బృందం వస్తోంది. సహకారం కోసం కొందరు అధికారులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచండి’ అని విశాఖలోని సీబీఐ విభాగానికి, కస్టమ్స్‌ శాఖకు సమాచారమిచ్చింది.

దిల్లీ నుంచి విశాఖ వయా బెంగళూరు

బృంద సభ్యులంతా తొలుత దిల్లీ నుంచి బెంగళూరుకు ఒక విమానంలో, అక్కడి నుంచి విశాఖకు మరో విమానంలో పయనమయ్యారు. 18న సాయంత్రం దిల్లీ నుంచి బయల్దేరిన ఈ బృందం 19న ఉదయం 8.15 గంటలకు విశాఖ చేరుకుంది. ఆ తర్వాత నగరంలోని కస్టమ్స్‌ విభాగం ప్రిన్సిపల్‌ కమిషనర్‌ను కలిసి చేపట్టబోయే ఆపరేషన్‌ గురించి వివరించింది. బ్రెజిల్‌ నుంచి వచ్చిన కంటెయినర్‌ గురించి సమాచారం అడిగి తెలుసుకుంది. అది తమ ఆధీనంలోనే సురక్షితంగా ఉందని ప్రిన్సిపల్‌ కమిషనర్‌ చెప్పటంతో నేరుగా పోర్టుకు బయల్దేరింది.

లేత పసుపు రంగు పొడి

19న మధ్యాహ్నం 12.30 గంటలకు పోర్టుకు చేరుకున్న సీబీఐ, కస్టమ్స్‌ బృందాలు.. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులకు తాము ఎందుకొచ్చామో వివరించి... తనిఖీలు ప్రారంభించాయి. కంటెయినర్‌లోని ఒక్కో ప్లాస్టిక్‌ బ్యాగ్‌ తీస్తుంటే... లేత పసుపు రంగు పొడి బయటపడింది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) నుంచి తీసుకొచ్చిన ‘నార్కోటిక్‌ డ్రగ్స్‌ డిటెక్షన్‌’ కిట్‌ను ఉపయోగించి అధికారులు పరీక్షలు నిర్వహించారు. కొకైన్‌, మెథక్వలోన్‌ ఉనికిని గుర్తించేందుకు టెస్ట్‌-ఈ, ఓపియం, మార్ఫిన్‌, హెరాయిన్‌, యాంఫిటమిన్‌, మెస్కలిన్‌ వంటి వాటిని నిర్ధారించేందుకు టెస్ట్‌-ఏ, గంజాయి, హాషిస్‌, హాషిస్‌ ఆయిల్‌ వంటివి గుర్తించేందుకు టెస్ట్‌-బీ చేశారు. పరీక్షించిన నమూనాల్లో ‘టెస్ట్‌-ఈ, టెస్ట్‌-ఏ’కు సంబంధించి మాదకద్రవ్యాలు ఉన్నట్లు తేలింది.

సమాధానాలు చెప్పటంలో తడబాటు

బ్రెజిల్‌ నుంచి వచ్చిన ‘ఇన్‌ యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌’లో మాదకద్రవ్యాలున్నట్లు తేలటంతో సీబీఐ అధికారులు అక్కడే ఉన్న సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధి ఆర్‌వీఎల్‌ఎన్‌ గంగాధర్‌ను ప్రశ్నించారు. తాము మొదటిసారి దీన్ని దిగుమతి చేసుకున్నామని, అందులో ఏమేం కలిసి ఉన్నాయనే దానిపై తమకు అవగాహన లేదని సమాధానమిచ్చారు. అదే సమయంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోర్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున గుమికూడటంతో పరీక్షల నిర్వహణ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది. అదే సమయంలో వర్షం పడే ఛాయలు కనిపించటంతో... సరకు మొత్తం తడిచిపోతే పాడైపోతుందంటూ సంధ్య ఆక్వా ప్రతినిధులు సీబీఐ అధికారులకు విన్నవించారు. సీబీఐ ఆ ప్యాలెట్లను రీప్యాక్‌ చేసి వాటిని కంటెయినర్‌లో భద్రపరచి సీల్‌ చేసింది. ఆ తర్వాత 20న ఉదయం 10.15 గంటల నుంచి మళ్లీ పరీక్షలు ప్రారంభించగా.. అన్ని నమూనాల్లోనూ డ్రగ్స్‌ మూలాలు బయటపడ్డాయి. సంధ్య ఆక్వా ప్రతినిధులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వలేకపోయారు.

55 గంటల పాటు సుదీర్ఘ ఆపరేషన్‌

18న మధ్యాహ్నం సమాచారమందుకున్న సీబీఐ.. 55 గంటల పాటు సుదీర్ఘ ఆపరేషన్‌ చేపట్టి డ్రగ్స్‌ గుట్టురట్టు చేసింది. 20న రాత్రి 7.30 వరకూ పరీక్షలు కొనసాగించింది. బ్రెజిల్‌ నుంచి వచ్చిన సరకు మొత్తాన్నీ బయటకు తీసి వాటిని ఎన్‌వైకేయూ 0823944 నంబరు గల కంటెయినర్‌లోకి మార్చి దానికి సీబీఐ బ్రాస్‌ సీల్‌ వేసింది. ఆ తర్వాత సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మరికొందరు వ్యక్తులపై ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 29 రెడ్‌విత్‌ 8, 23, 38ల ప్రకారం కేసు నమోదు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని