tourism: పర్యాటక రంగం నష్టం.. 4 ట్రిలియన్‌ డాలర్లు..!

కొవిడ్‌ అన్ని రంగాలపై పెను ప్రభావం చూపింది. ఐరాసకు చెందిన వరల్డ్‌ టూరిజమ్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూటీవో) , కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ(సీటీఏడీ)లు సంయుక్తంగా ఓ నివేదికను అందించాయి.

Published : 30 Jun 2021 22:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ అన్ని రంగాలపై పెను ప్రభావం చూపింది. ఐరాసకు చెందిన వరల్డ్‌ టూరిజమ్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూటీవో) , కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ(సీటీఏడీ)లు సంయుక్తంగా ఓ నివేదికను అందించాయి. దీని ప్రకారం ప్రపంచ పర్యాటక రంగానికి గతేడాది కొవిడ్‌ మొదలైనప్పటి నుంచి 4 ట్రిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నాయి. ఈ నివేదికను బుధవారం సమర్పించాయి.  ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు టీకా కొరతను ఎదుర్కోవడం మరింత నష్టాలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశాయి. 

‘‘లక్షల మందిని పర్యాటక రంగం పోషిస్తోంది. టూరిజం వేగవంతం కావాలంటే  వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి ప్రజలను కాపాడాల్సి ఉంటుంది. అప్పుడే పరిశ్రమను సురక్షితంగా పునఃప్రారంభించవచ్చు. దీనికి మరిన్ని వనరులు అవసరం’’ అని యూఎన్‌ డబ్ల్యూటీవో  సెక్రటరీ జనరల్‌ జురాబ్‌ పొలోలికాష్‌విలి పేర్కొన్నారు. చాలా వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉన్నాయని ఆయన తెలిపారు. 

గతేడాది కరోనా వ్యాప్తి సమయంలో చాలా దేశాలు విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. అత్యవసరాలకు మినహా వేటికి అనుమతించలేదు. దీంతో ఈ ప్రభావం పర్యాటక రంగంపై పడింది. దీంతో ఒక్క గతేడాదే 2.4 ట్రిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. టీకాల పంపిణీని వేగవంతం చేయకపోతే ఈ ఏడాది కూడా అదే స్థాయిలో నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. 

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌లో చాలా తేడాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఒక్కశాతం జనాభాకు కూడా టీకాలు అందలేదు.. అదే సమయంలో మరికొన్ని దేశాల్లో 60శాతం జనాభాకు టీకాలు అందాయి. తక్కువ టీకాలు పంపిణీ చేసిన దేశాలు ఆర్థికంగా కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ ఎగుడు దిగుడులు, టీకాల కొరత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యాటక రంగాన్ని దెబ్బతీస్తాయని నివేదిక వెల్లడించింది. ఆ దేశాల్లో అత్యధికంగా 80శాతం వరకు పర్యాటక రంగం దెబ్బతినింది. ఇక టీకాలు ఎక్కువగా ఇచ్చిన అమెరికా వంటి దేశాల్లో పర్యాటక రంగం వేగంగా పుంజుకొంటుందని అంచనావేసింది. ఇది 2023 నాటికి కరోనా మహమ్మారి ముందు నాటి పరిస్థితులను అందుకొంటుందని తెలిపింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు