Diesel: ఇప్పుడు డీజిల్‌ వంతు.. వంద దాటేసింది

అసలే కరోనా మహమ్మారితో కష్టకాలంలో ఉన్న సామాన్యులకు ఇంధన ధరలు మరింత భారమవుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టి పరుగులు పెడుతుండగా.. ఇప్పుడు డీజిల్‌

Updated : 12 Jun 2021 13:28 IST

7 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్‌

దిల్లీ: అసలే కరోనా మహమ్మారితో కష్టకాలంలో ఉన్న సామాన్యులకు ఇంధన ధరలు మరింత భారమవుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టి పరుగులు పెడుతుండగా.. ఇప్పుడు డీజిల్‌ కూడా రూ.100 మార్క్‌ దాటేసింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు ఉత్పత్తి సంస్థలు శనివారం మరోసారి పెంచాయి. పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 23 పైసలు పెరిగింది. దీంతో రాజస్థాన్‌లోని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీ గంగానగర్‌ జిల్లాలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100.05గా ఉంది. ఇక్కడ పెట్రోల్‌ ధర కూడా అత్యధికంగా రూ.107.22కు చేరింది.

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌పై అత్యధిక వ్యాట్‌ ఉన్న రాష్ట్రం రాజస్థాన్‌. అందుకే అక్కడ చమురు ధరలు అధికంగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ వ్యాట్‌ ఎక్కువగానే ఉంది. మరోవైపు కర్ణాటకలో పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. దీంతో పెట్రోల్‌ సెంచరీ కొట్టిన ఏడో రాష్ట్రంగా నిలిచింది. అంతకుముందే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, లద్దాఖ్‌లలోని పలు ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటేసింది. 

కాస్త విరామం తర్వాత మే 4వ తేదీ నుంచి ఇంధన ధరల పరుగు మొదలవ్వగా.. శనివారం నాటికి మొత్తం 23 సార్లు ధరలను పెంచారు. దీంతో గత నెల నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.5.72 , డీజిల్‌పై రూ.6.25 పెరిగింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు సంస్థలు ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రధాన నగరాల్లో చమురు ధరలు ఇలా..

* దిల్లీ: పెట్రోల్‌ రూ.96.12, డీజిల్ రూ.86.98

* ముంబయి:  పెట్రోల్‌ రూ.102.30 , డీజిల్ రూ.94.39

* కోల్‌కతా: పెట్రోల్‌ రూ.96.06 , డీజిల్ రూ.89.83

* చెన్నై: పెట్రోల్‌ రూ.97.43 , డీజిల్ రూ.91.64

* హైదరాబాద్‌: పెట్రోల్‌ రూ.99.90, డీజిల్ రూ.94.82

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని