Tesla-India: ముందు తయారీ ప్రారంభించండి.. టెస్లాకు తేల్చి చెప్పిన కేంద్రం!

ముందు భారత్‌లో తయారీ ప్రారంభించాలని టెస్లాకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాతే సుంకాల తగ్గింపు విషయాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పింది...

Published : 11 Sep 2021 21:29 IST

దిల్లీ: భారత్‌లో తయారీ చేపట్టడం కంటే ముందు విద్యుత్తు కార్లపై ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరిన టెస్లా విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ముందు భారత్‌లో తయారీ ప్రారంభించాలని తెలిపింది. ఆ తర్వాతే సుంకాల తగ్గింపు విషయాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు ఏ కంపెనీకీ ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదని తెలిపింది. టెస్లాకు మాత్రమే మినహాయింపులు ఇవ్వడం వల్ల తప్పుడు సందేశం వెళుతుందని వివరించింది. ఇప్పటికే భారత్‌లో బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టినవారికి ప్రతికూల సంకేతాలు అందుతాయని పేర్కొంది.

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ ఓ షరతు విధించారు. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామన్నారు. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని తేల్చి చెప్పారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై రెండు నెలల క్రితం స్పందించిన సర్కార్‌.. ఎలాన్‌ మస్క్‌ కోరినట్లుగా దిగుమతి సుంకాలు తగ్గిస్తే భారత్‌లో తమ కార్యాచరణ ఏంటో వివరించాలని కోరింది. తాజాగా, తొలుత తయారీ ప్రారంభించాలని తేల్చి చెప్పింది. మరోవైపు టెస్లాకు చెందిన కొన్ని మోడళ్లు భారత్‌లో నడపడానికి అనువైనవిగా కేంద్రం ఇటీవలే ధ్రువీకరించిన విషయం తెలిసిందే.

పూర్తిస్థాయిలో విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం 60-100 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. ఇంజిన్‌ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని రూ.40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తిస్తుంది. అయితే, దీన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా కోరింది. అలాగే, విద్యుత్తు కార్లపై 10 శాతం సమాజ సంక్షేమ సర్‌ఛార్జి రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. దీనివల్ల విద్యుత్తు వాహనాల విక్రయానికి భారత్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. అనంతరం కార్ల విక్రయాలు, సేవలు, ఛార్జింగ్‌ మౌలిక వసతుల రంగాల్లో టెస్లా నేరుగా పెట్టుబడులు పెడుతుందని పేర్కొంది. అలాగే భారత్‌ నుంచి ముడిసరకు కొనుగోలును కూడా పెంచుతామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని