కస్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. స‌ర్వీస్ ఛార్జీలు పెంచిన పంజాబ్ నేష‌నల్‌ బ్యాంక్‌!

క‌నీస స‌గ‌టు బ్యాలెన్స్ నిర్వ‌హ‌ణ ద‌గ్గ‌ర నుంచి బ్యాంకు లాక‌ర్ వ‌ర‌కు వివిధ సేవ‌ల ఛార్జీల‌ను పీఎన్‌బీ పెంచింది. 

Updated : 10 Jan 2022 14:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌భుత్వ రంగానికి చెందిన‌ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు అందించే వివిధ సేవ‌ల‌పై ఛార్జీలను పెంచుతున్నట్లు ప్ర‌క‌టించింది. ఈ కొత్త ఛార్జీలు జ‌న‌వ‌రి 15 నుంచి అమ‌ల్లోకి వస్తాయని ఆ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. కనీస బ్యాలెన్స్‌, లాకర్‌ ఛార్జీలు, డిపాజిట్‌ ఛార్జీలు వంటివి పెంచిన జాబితాలో ఉన్నాయి.

క‌నీస బ్యాలెన్స్‌: మెట్రో న‌గ‌రాల్లోని పీఎన్‌బీ ఖాతాదారులు.. త‌మ ఖాతాల్లో నిర్వ‌హించాల్సిన‌ మూడు నెల‌ల స‌గ‌టు నిల్వ‌ను రూ.10 వేల‌కు పెంచింది. ప్ర‌స్తుతం ఈ లిమిట్‌ రూ.5 వేలు ఉంది. అంతేకాకుండా త్రైమాసిక స‌గ‌టు బ్యాలెన్స్ నిర్వ‌హించని వారికి విధించే ఛార్జీలను కూడా పెంచింది. త్రైమాసిక బ్యాలెన్స్ నిర్వ‌హించ‌ని కార‌ణంగా గ్రామీణ, సెమీ అర్బ‌న్‌ ప్రాంతాల వారికి విధించే రూ. 200 రుస‌మును రూ. 400కు,  అర్బ‌న్‌, మెట్రో ప్రాంతాల వారికి రూ.300 రుసుమును రూ.600కు పెంచుతున్న‌ట్లు పీఎన్‌బీ ప్ర‌క‌టించింది.

బ్యాంకు లాక‌ర్ ఛార్జీలు: పీఎన్‌బీ బ్యాంకు లాక‌ర్ అద్దె ఛార్జీల‌ను గ్రామీణ‌, ప‌ట్ట‌ణ‌, మెట్రో అన్ని ప్రాంతాల వారికీ పెంచింది. ఈ ఛార్జీల పెంపుతో అర్బ‌న్ ప్రాంతాల వారు ఇంత‌కు ముందు చెల్లించే అద్దె కంటే రూ.500 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్ లాక‌ర్ ఉచిత విజిట్స్‌: బ్యాంక్ లాక‌ర్ ఛార్జీల‌ను పెంచ‌డంతో పాటు ఒక సంవ‌త్స‌రంలో బ్యాంక్ లాక‌ర్ ఉచిత విజిట్స్‌ను 12కు త‌గ్గించింది. ఇంతకుముందు సంవ‌త్స‌రానికి 15 సార్లు ఉచితంగా లాక‌ర్ తెరిచే స‌దుపాయం ఉండేది. ఉచిత విజిట్స్‌కి మించి చేసే ఒక్కో విజిట్‌కు రూ.100 చొప్పున వసూలు చేస్తారు.

క‌రెంట్ ఖాతా క్లోజ‌ర్ ఛార్జీల పెంపు: క‌రెంటు ఖాతా తెరిచిన 14 రోజుల త‌ర్వాత ఖాతాను రద్దు చేస్తే రూ.800 అప‌రాధ రుసుము చెల్లించాలి. ఇంత‌కు ముందు ఇది రూ.600గా ఉండేది. క‌రెంటు ఖాతా తెరిచిన 12 నెల‌ల త‌రువాత ర‌ద్దు చేస్తే ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు.

పొదుపు ఖాతా లావాదేవీల రుసుములు: జ‌న‌వ‌రి 15 నుంచి పొదుపు ఖాతాదారుల‌కు 3 ఉచిత లావాదేవీల‌ను పీఎన్‌బీ అనుమతిస్తుంది. ఆ త‌ర్వాత చేసే ప్ర‌తి లావాదేవీకి (బీఎన్ఏ, ఏటీఎమ్‌, సిడీఎమ్ వంటి ప్ర‌త్నామ్నాయ ఛాన‌ళ్లు మిన‌హాయించి) రూ.50 ఛార్జీ చేస్తారు. సీనియ‌ర్ సిటిజ‌న్ల ఖాతాకు ఇది వ‌ర్తించ‌దు. ప్ర‌స్తుతం బ్యాంక్‌ బేస్‌, నాన్‌-బేస్ బ్రాంచ్‌ల‌కు ప్రస్తుతం 5 ఉచిత లావాదేవీల‌ను బ్యాంకు అనుమ‌తిస్తుంది. ఆపై చేసే ప్ర‌తి లావాదేవీకి రూ.25 ఛార్జ్ చేస్తుంది.

న‌గ‌దు డిపాజిట్‌ ఛార్జీలు: పొదుపు, క‌రెంట్ ఖాతాల రెండింటిపై కూడా నగదు డిపాజిట్ పరిమితిని తగ్గించింది. రోజువారీ ఉచిత డిపాజిట్ పరిమితి ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ. 1 లక్షకు తగ్గించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని