Billionaires: 40% దేశ సంపద ఒకశాతం ధనవంతుల చేతుల్లో..!

దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలపై ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్‌ (Oxfam Report) ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రూ. 54.12 లక్షల కోట్లకు చేరుకుంది.

Updated : 16 Jan 2023 14:02 IST

దావోస్‌: భారత్‌లోని మొత్తం సంపదలో 40 శాతం కేవలం ఒకశాతం ధనవంతుల దగ్గరే ఉందని ప్రముఖ నివేదిక తెలిపింది. అట్టడుగున ఉన్న సగం జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ప్రముఖ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ‘సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌’ పేరిట భారత్‌లోని ఆర్థిక అసమానతలపై సోమవారం నివేదిక (Oxfam Report) విడుదల చేసింది. దావోస్‌లో జరుగుతున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum)’ వార్షిక సమావేశం సందర్భంగా ఆక్స్‌ఫామ్‌ (Oxfam Report) ఈ నివేదికను బహిర్గతం చేసింది.

నివేదికలోని కీలకాంశాలు..

  • తొలి 100 మంది భారతీయ బిలియనీర్లపై 2.5 శాతం లేదా మొదటి 10 మంది బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే.. బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలకు తీసుకురావడానికి అవసరమైన డబ్బు మొత్తం సమకూరుతుంది.
  • 2017- 2021 మధ్య పెరిగిన బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) సంపదపై ఒకసారి విధించే పన్నుతో రూ. 1.79 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించవచ్చు. ఇది దేశంలో ప్రాథమిక పాఠశాలల్లో కావాల్సిన 50 లక్షల మంది ఉపాధ్యాయులకు ఏడాదిపాటు వేతనాలివ్వడానికి సరిపోతుంది.
  • భారత్‌లోని బిలియనీర్లపై ఒకసారి రెండు శాతం పన్ను విధిస్తే రూ.40,423 కోట్ల ఆదాయం వస్తుంది. దీంతో దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ వచ్చే మూడేళ్ల పాటు పోషకాహారం అందించవచ్చు.
  • దేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్లపై ఒకేసారి 5 శాతం పన్ను విధిస్తే వచ్చే రూ. 1.37 లక్షల కోట్లు.. 2022-23 సంవత్సరానికిగానూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (రూ. 86,200 కోట్లు), ఆయుష్ మంత్రిత్వ శాఖ (రూ. 3,050 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ.
  • లింగ అసమానతల విషయానికి వస్తే నివేదిక ప్రకారం.. ఒక పురుష కార్మికుడు సంపాదించే ప్రతి రూపాయికి మహిళా కార్మికులు కేవలం 63 పైసలు మాత్రమే పొందుతున్నారు.
  • షెడ్యూల్డ్ కులాలు, గ్రామీణ ప్రాంత కార్మికుల సంపాదనల్లో వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. అగ్ర సామాజిక వర్గాలు సంపాదిస్తున్న దానితో పోలిస్తే షెడ్యూల్డ్‌ కులాలు 55 శాతం మాత్రమే పొందుతున్నాయి. గ్రామీణ ప్రాంత కార్మికులు పట్టణాల్లో వారితో పోలిస్తే 2018- 2019 మధ్య సగం మాత్రమే సంపాదించారు.
  • కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబరు వరకు దేశంలో బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. రోజుకు రూ. 3,608 కోట్ల సంపద జతయ్యింది.
  • 2021-22లో ‘వస్తు సేవల పన్ను(GST)’ ద్వారా వచ్చిన మొత్తం రూ.14.83 లక్షల కోట్లలో దాదాపు 64 శాతం.. సంపదలో అట్టడుగున ఉన్న 50 శాతం జనాభా నుంచి వచ్చింది. జీఎస్‌టీ మొత్తం ఆదాయంలో కేవలం 3 శాతం మాత్రమే తొలి పది మంది బిలియనీర్ల నుంచి వస్తోంది.
  • భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా 2022 నాటికి 166కు పెరిగింది.
  • భారతదేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద 660 బిలియన్ల డాలర్ల (రూ. 54.12 లక్షల కోట్లు)కు చేరుకుంది. దీనితో కేంద్ర బడ్జెట్‌కు 18 నెలలకు పైగా నిధులు సమకూర్చవచ్చు.

భారతదేశంలో అసమానతల ప్రభావాన్ని అంచనా వేయడానికి గుణాత్మక (qualitative), పరిమాణాత్మక (quantitative) సమాచారంతో కూడిన మిశ్రమ డేటాను వినియోగించుకున్నట్లు ఆక్స్‌ఫామ్‌ తెలిపింది. అలాగే ఫోర్బ్స్‌, క్రెడిట్‌ సూయిజ్‌ వంటి ఇతర మార్గాల ద్వారానూ సమాచారాన్ని సేకరించినట్లు వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఎస్‌, కేంద్ర బడ్జెట్‌ పత్రాలు, పార్లమెంట్‌లో సభ్యుల ప్రశ్నలు.. నివేదికలో చేసిన వ్యాఖ్యలకు ఆధారమని పేర్కొంది.

రోజుకి 2.7 బి.డాలర్ల చొప్పున పెరుగుతున్న బిలియనీర్ల సంపద 

ప్రపంచవ్యాప్తంగానూ ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్‌ ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ప్రపంచంలోని ధనవంతుల్లో తొలి ఒక శాతం మంది గత రెండేళ్లలో సంపాదించిన సంపద.. ప్రపంచ జనాభాలోని మిగిలిన వారు ఆర్జించిన దాంతో పోలిస్తే దాదాపు రెట్టింపని నివేదిక తెలిపింది. ఓవైపు 170 కోట్ల మంది వేతనాలు ద్రవ్యోల్బణం కంటే దిగువ స్థాయిలో ఉంటే.. మరోవైపు బిలియనీర్ల సంపద రోజుకి 2.7 బిలియన్‌ డాలర్ల చొప్పున పెరుగుతోందని పేర్కొంది.

ప్రపంచంలోని మల్టీ-మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే వచ్చే 1.7 ట్రిలియన్‌ డాలర్లతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయొచ్చు. 2020 తర్వాత జరిగిన 42 ట్రిలియన్‌ డాలర్ల సంపద సృష్టిలో 66.7 శాతం కేవలం ఒకశాతం మంది సంపన్నులే ఆర్జించారు. గత పదేళ్లలో వచ్చిన మొత్తం సంపదలో సగానికి పైగా వీరి చేతుల్లోకే వెళ్లింది.

ప్రపంచంలో ఆకలితో ఉన్న జనాభాలో దాదాపు 60 శాతం మంది మహిళలు, బాలికలే. పైగా తరచూ తక్కువ, చివరిగా తినేది కూడా వీరేనని ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అసమానతలు, పేదరికం భారీ ఎత్తున పెరిగిపోతున్నాయని ప్రపంచ బ్యాంక్‌ తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా నివేదిక గుర్తుచేసింది. ధనవంతులు, కార్పొరేషన్‌లకు దశాబ్దాలుగా ఇస్తున్న పన్ను తగ్గింపులే అసమానతలకు ఆజ్యం పోశాయని తెలిపింది. అనేక దేశాల్లోని పేద ప్రజలు బిలియనీర్ల కంటే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారని పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్ 2014- 2018 మధ్య 3 శాతం ట్యాక్స్‌ రేటు వద్ద పన్ను చెల్లిస్తే.. ఉగాండాలో పిండి విక్రయించే అబెర్ క్రిస్టీన్ నెలకు 80 డాలర్లు సంపాదించి 40 శాతం రేటు వద్ద పన్ను చెల్లిస్తున్నారని ఆక్స్‌ఫామ్ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని