Budget 2023: ధరలు, ఉద్యోగ కోతలు.. ఇవే సగటు జీవి సమస్యలు!

బడ్జెట్‌ సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ వర్గాలు బడ్జెట్‌ నుంచి తాము ఏం ఆశిస్తున్నారో వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ సర్వేలో ధరల పెరుగుదల, ఉద్యోగాల కోతలపై బడ్జెట్‌లో చర్యలు ఉండాలని సామాన్యులు కోరారు.

Updated : 29 Jan 2023 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓవైపు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం (Recession) భయాలు బలపడుతున్నాయి. మరోవైపు అధిక ధరలతో సామాన్యులు అతలాకుతలమవుతున్నారు. పెరిగిన వడ్డీరేట్లు నెలవారీ వాయిదాల రూపంలో భారంగా పరిణమించాయి. సరిగ్గా ఈ తరుణంలో ఉద్యోగాల కోత గుబులు పుట్టిస్తోంది. ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ (Budget 2023) ప్రవేశపెట్టబోతోంది.

దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు పెరుగుతున్న ద్రవ్యోల్బణంపైనే ఆందోళన వ్యక్తం చేసినట్లు డేటా అండ్‌ అనలిటిక్స్‌ కంపెనీ క్యాంటార్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌ (Budget 2023)లో ధరల్ని తగ్గించే దిశగా కీలక చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మరోవైపు ప్రతి నలుగురిలో ఒకరు ఉద్యోగాల తొలగింపుపై ఆందోళన చెందుతున్నారు. సగటు వేతన జీవితో పోలిస్తే ఈ భయం సంపన్న వర్గాల్లోనే అధికంగా ఉందని సర్వేలో తేలింది. మొత్తం 1892 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో సగటు వేతన జీవి నుంచి వ్యాపారవేత్తల వరకు అన్ని వర్గాల వారు ఉన్నారు.

ఆదాయ పన్ను విషయంలోనూ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సర్వేలో పాల్గొన్నవారు అన్నారు. కనీస పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని అత్యధిక మంది కోరారు. మరోవైపు 30 శాతం గరిష్ఠ పన్నురేటు శ్లాబును రూ. 10 లక్షల నుంచి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సెక్షన్‌ 80సీ కింద ఇస్తున్న మినహాయింపుల పరిమితిని సైతం పెంచాలని సూచించారు.

వైద్య ఖర్చులు భారీగా పెరిగి కుటుంబ బడ్జెట్‌కు భారమవుతున్న నేపథ్యంలో జీవిత, ఆరోగ్య బీమాల ప్రీమియంలపై పన్ను రాయితీ ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న సామాన్యులు కోరారు. ముఖ్యంగా వేతన జీవులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా అడపాదడపా పలకరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య రంగంపై ప్రధానంగా దృష్టిసారించాల్సిన అసవరం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధి సాధిస్తుందని మెజారిటీ వ్యక్తులు అభిప్రాయపడ్డారు. 31 శాతం మంది మాత్రం నెమ్మదిస్తుందని అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని