ఉద్దేశపూర్వక ఎగవేతలు.. టాప్‌-50 నుంచి రావాల్సినవే ₹92,570 కోట్లు!

ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాల ఎగవేతకు పాల్పడుతున్న జాబితాను కేంద్రం బయటపెట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు.

Published : 20 Dec 2022 14:25 IST

దిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల (Wilful defaulters) జాబితాలో పేరున్న టాప్‌-50 మంది నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తమే రూ.92,570 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాడ్‌ సోమవారం లోక్‌సభకు తెలిపారు. దేశం విడిచి పారిపోయిన నీరవ్‌మోదీ, మెహుల్‌చోక్సీలకు చెందిన గీతాంజలి జెమ్స్‌ లిమిటెడ్‌, నక్షత్ర బ్రాండ్స్‌, గిలి ఇండియా లిమిటెడ్‌ల నుంచి రూ.10,444 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు.

ఎరా ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ (రూ.5,879 కోట్లు), రే ఆగ్రో (రూ.4,803 కోట్లు), కాన్‌కాస్ట్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (రూ.4,596 కోట్లు), ఏబీజీ షిప్‌యార్డ్‌ (రూ.3,708 కోట్లు), ఫ్రాస్ట్‌ ఇంటర్నేషనల్‌ (రూ.3,311 కోట్లు), విన్సమ్‌ డైమండ్‌ అండ్‌ జువెలరీ (రూ.2931 కోట్లు), రోటోమాక్‌ గ్లోబల్‌ (రూ.2,893 కోట్లు), జూమ్‌ డెవలపర్స్‌ (రూ.2,147 కోట్లు) వంటివి ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కోస్టల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.2,311 కోట్లు, ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.1,932 కోట్లు, డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ రూ.1,890 కోట్లు, ఐవీఆర్‌సీఎల్‌ లిమిటెడ్‌ రూ.1,766 కోట్లు ఎగవేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. 

గడిచిన ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మేర రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేశాయని మరో ప్రశ్నకు కరాడ్‌ సమాధానం ఇచ్చారు. దేశంలో బ్యాంకుల ఎన్‌పీఏలు గత అయిదేళ్లలో రూ.8.95 లక్షల కోట్ల నుంచి రూ.5.40 లక్షల కోట్లకు తగ్గినట్లు చెప్పారు. రుణాలు చెల్లించగలిగే శక్తి ఉన్నా.. కావాలనే ఎగవేతకు పాల్పడేవారిని ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు’గా గుర్తిస్తారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఈ జాబితాలో ఉన్న వారికి ఐదేళ్ల పాటు కొత్తరుణాలు మంజూరు చేయరు. అలాగే, కొత్త వెంచర్లు ఏర్పాటుకు అనుమతివ్వరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని