Playing Cards: పేకాడదాం రండి..!

సాధారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలకు ఆహ్వాన పత్రికలను పంపిస్తుంటారు. చూడగానే ఆకట్టుకునేలా సిద్ధం చేసిన కార్డులను పంపించి పేకాట ఆడేందుకు రావాలని గుత్తా సుమన్‌కుమార్‌ ఆహ్వానించేవాడని సైబరాబాద్‌ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది.

Updated : 03 Nov 2021 12:03 IST

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఆహ్వాన కార్డులు  
ఈనాడు, హైదరాబాద్‌

సాధారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలకు ఆహ్వాన పత్రికలను పంపిస్తుంటారు. చూడగానే ఆకట్టుకునేలా సిద్ధం చేసిన కార్డులను పంపించి పేకాట ఆడేందుకు రావాలని గుత్తా సుమన్‌కుమార్‌ ఆహ్వానించేవాడని సైబరాబాద్‌ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. రంగు రంగుల విద్యుద్దీపాలు.. ఖరీదైన మద్యం.. అధునాతన సౌండ్‌ సిస్టం.. సహాయకులుగా అమ్మాయిలను ఏర్పాటు చేసేవాడని గుర్తించారు. ఆర్థిక స్థితి ఆధారంగా కస్టమర్లను ప్రత్యేక కేటగిరీలుగా విభజించి క్యాంప్‌లను నిర్వహించేవాడని తేలింది. అక్కడి ఏర్పాట్లకు అనుగుణంగా ప్రవేశ రుసుం రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసేవాడని వెల్లడయ్యింది.

ఆర్థిక స్థితి ఆధారంగా కేటగిరీలు..
గండిపేట మండలం మంచిరేవులలో ఫాంహౌజ్‌లో ఆదివారం పేకాటాడుతూ 30 మంది పోలీసులకు చిక్కిన సంగతి విదితమే. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులుండటం కలకలం రేపింది. విజయవాడకు చెందిన గుత్తా సుమన్‌కుమార్‌ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ఇతని లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులతో నిత్యం టచ్‌లో ఉండేవాడు. విదేశాల్లోని పలు క్యాసినోల నిర్వాహకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. అక్కడి అనుభవంతోనే ఇక్కడ రెస్టారెంట్లను అద్దెకు తీసుకుని క్యాసినోలు నిర్వహించాడు. విజయవాడ మామిడితోటల నుంచి కొలంబో వరకు అతని ప్రయాణం సాగింది. సుమన్‌ బాధితుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు’ అని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి వెల్లడించారు.

రెండ్రోజుల కస్టడీకి అనుమతి...
గుత్తా సుమన్‌కుమార్‌ మినహా మిగిలిన 29 మందికి మంగళవారం రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సుమన్‌ను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు రెండ్రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. చర్లపల్లి జైలు నుంచి బుధవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. లీజు దస్తావేజులతో రావాలని సూచించినా టాలీవుడ్‌ హీరో నాగశౌర్య తండ్రి మంగళవారం కూడా హాజరుకాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని