Drugs Case: మాదక ద్రవ్యాల గుప్పిట సినీ తారలు!

మత్తు మాఫియా ప్రధాన సూత్రధారులను హైదరాబాద్‌ పోలీసులు వరుసగా అరెస్ట్‌ చేస్తున్నారు. స్మగ్లర్లు, పెడ్లర్ల నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు.

Updated : 04 Jan 2023 08:11 IST

మత్తు మాఫియా ఫోన్లలో ప్రముఖుల చిట్టా
స్మగ్లింగ్‌ డాన్‌ ఎడ్విన్‌ ముఠా వరుస అరెస్ట్‌లతో వెలుగులోకి

ఈనాడు, హైదరాబాద్‌: మత్తు మాఫియా ప్రధాన సూత్రధారులను హైదరాబాద్‌ పోలీసులు వరుసగా అరెస్ట్‌ చేస్తున్నారు. స్మగ్లర్లు, పెడ్లర్ల నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. డ్రగ్స్‌ వినియోగిస్తున్న, విక్రయిస్తున్న వారిలో నగర వ్యాపారులతోపాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినీతారలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు సేకరించాక నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ (హెచ్‌న్యూ) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఏర్పాటయ్యాక నగరానికి చేరుతున్న మాదకద్రవ్యాల మార్గాలపై నిఘా ఉంచారు. గోవా కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్న కీలక సూత్రధారులు 18 మందిని గుర్తించారు. వీరిలో ప్రీతీష్‌ నారాయణ్ బోర్కర్‌, జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా, తుకారాం, ఎడ్విన్‌న్యూన్స్‌, బాలమురుగన్‌, హేమంత్‌ అగర్వాల్‌, వికాస్‌నాయక్‌, సంజ గోవెకర్‌, రమేష్‌చౌహాన్‌ వంటి డ్రగ్‌ కింగ్‌పిన్‌లను అరెస్ట్‌ చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సెల్‌ఫోన్లలో సుమారు 7,000-8,000 మంది డ్రగ్స్‌ వినియోగిస్తున్న వారి వివరాలున్నట్టు గుర్తించారు. వీరిలో 400 మందికి 41ఎ సీఆర్‌పీసీ నోటీసులు జారీచేశారు.

ఎడ్విన్‌ అనుచరులే అధికం

గోవా డ్రగ్‌ కింగ్‌పిన్‌ ఎడ్విన్‌న్యూన్స్‌ నుంచి తాజాగా అరెస్టయిన హైదరాబాద్‌ డీజే మోహిత్‌ అగర్వాల్‌ అలియాస్‌ మైరాన్‌ మోహిత్‌ వరకూ ఎక్కువమంది పబ్‌లు, హోటళ్లలో సర్వర్లుగానే కెరీర్‌ ప్రారంభించటం గమనార్హం. జీరో నుంచి హీరోగా ఎదగాలనే ఉద్దేశంతో వీరంతా క్రమంగా మత్తుపదార్థాల దందా వైపు అడుగులు వేశారు. మొదట ఏజెంట్లుగా మారారు. క్రమంగా డ్రగ్‌ మాఫియాతో సంబంధాలు పెంచుకొని మత్తు సామ్రాజ్యాన్ని స్థాపించి.. జాతీయ, అంతర్జాతీయంగా మాదకద్రవ్యాలు సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. ఖరీదైన భవనాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారంటే డ్రగ్స్‌ దందాతో ఎంతగా దోచుకున్నారనేది అర్థం చేసుకోవచ్చని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఎడ్విన్‌న్యూన్స్‌ ఒకప్పుడు గోవాలో హోటల్‌ సర్వర్‌. ఇప్పుడు అతడికి గోవా, ముంబయి నగరాల్లో కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులున్నాయి. సినీ నిర్మాతలకు ఫైనాన్స్‌ చేసే స్థాయికి ఎదిగాడు. ఇతడి ప్రధాన అనుచరుల్లో తమిళనాడుకు చెందిన బాలమురుగన్‌ కీలకమైన వ్యక్తి. హిమాచల్‌ప్రదేశ్‌ను అడ్డాగా మార్చుకొని రాజస్థాన్‌, మహారాష్ట్ర, హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డ్రగ్స్‌ సరఫరా చేసేవాడు. తమిళనాడులో మత్తుకు అలవాటుపడిన ప్రముఖులకు నమ్మకమైన వ్యక్తి. ఇతడి ద్వారానే పలువురు ఖరీదైన ఛరస్‌ను కొనుగోలు చేసేవారని పోలీసులు గుర్తించారు. మోహిత్‌ అగర్వాల్‌ మొదట్లో కవాడిగూడలో ఉండేవాడు. పబ్‌లో సర్వర్‌గా చేరి డ్రగ్స్‌ కోసం గోవా వెళ్లినప్పుడు ఎడ్విన్‌తో ఏర్పడిన పరిచయంతో డ్రగ్‌ డాన్‌గా ఎదిగాడు. బాలీవుడ్‌ నటి నేహా దేశ్‌పాండేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. డీజేగా గుర్తింపు వచ్చాక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను స్థాపించాడు. అంతర్జాతీయంగా 100 మంది డీజేలను దేశానికి రప్పించి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని