Medak: ఉయ్యాలతొట్టెను తన్ని.. ఆపై పసికందును లాక్కోబోయి..

మద్యం మత్తులో కన్నతండ్రే చిన్నారి పాలిట కాలయముడయ్యాడు. భార్యాభర్తల మధ్య గొడవలో ఉయ్యాల తొట్టెను కాలితో తన్నడంతో నెలన్నర రోజుల పసికందు కిందపడి మృతిచెందాడు.

Updated : 03 Sep 2023 07:31 IST

మద్యం మత్తులో తండ్రి ఘాతుకం
భార్యాభర్తల పెనుగులాటలో మృతిచెందిన శిశువు

పెద్దశంకరంపేట, న్యూస్‌టుడే: మద్యం మత్తులో కన్నతండ్రే చిన్నారి పాలిట కాలయముడయ్యాడు. భార్యాభర్తల మధ్య గొడవలో ఉయ్యాల తొట్టెను కాలితో తన్నడంతో నెలన్నర రోజుల పసికందు కిందపడి మృతిచెందాడు. మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దశంకరంపేటకు చెందిన చిమ్మ పున్నయ్య, శ్యామలల పెద్ద కుమార్తె నిర్మలను ఉత్తులూరు గ్రామానికి చెందిన జనుముల రమేష్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. వారికి రెండేళ్ల కుమారుడున్నాడు. 45 రోజుల క్రితం మరో బాబు జశ్వంత్‌ జన్మించాడు. నిర్మల ప్రసవం కోసం వచ్చి పేటలోని తల్లిదండ్రుల వద్దే ఉంది. శుక్రవారం రాత్రి అత్తవారింటికి వచ్చిన రమేష్‌కు వారితో వాగ్వాదం జరిగింది.

దీంతో బయటకు వెళ్లి మద్యం తాగిన రమేష్‌ అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆవేశంతో ఉయ్యాల తొట్టెను తన్నడంతో పసికందు జస్వంత్‌ అందులోంచి కిందపడ్డాడు. అయినా వినకుండా బాలుడిని తన ఇంటికి తీసుకెళ్తానని నిర్మల నుంచి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. భార్యాభర్తల మధ్య జరిగిన పెనుగులాటలో బాలుడు నలిగిపోయి మృతిచెందాడు. అనంతరం రమేష్‌ని బయటకు పంపించారు. కళ్ల ముందే అభంశుభం తెలియని చిన్నారి మృతి చెందడంతో తల్లి నిర్మల రోదనలు మిన్నంటాయి. రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని