Crime News: హైదరాబాద్‌లో అదృశ్యం.. ముంబయిలో ప్రత్యక్షం!

మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో ప్రైవేటు కళాశాల విద్యార్థిని వర్షిణి అదృశ్యం కథ సుఖాంతం అయింది. ముంబయిలో విద్యార్థిని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Updated : 10 Jul 2022 16:32 IST

బీటెక్‌ విద్యార్థిని అదృశ్యం కథ సుఖాంతం

కండ్లకోయ: మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో ప్రైవేటు కళాశాల విద్యార్థిని వర్షిణి అదృశ్యం కథ సుఖాంతం అయింది. ముంబయిలో విద్యార్థిని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. వర్షిణి అనే విద్యార్థిని కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. మిడ్‌ ఎగ్జామ్ కోసం ఆమెను సమీప బంధువు మోహన్‌రెడ్డి కళాశాలకు తీసుకెళ్లారు. అనంతరం ఐడీ కార్డు, మొబైల్‌ ఇంట్లో మరిచిపోయానని చెప్పి ఆమె క్యాంపస్‌ నుంచి తిరిగి బయటకు వచ్చింది.

సాయంత్రం ఇంటికి రాకపోవడంతో ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారని భావించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. విద్యార్థిని కోసం గాలించారు. క్యాంపస్‌కు వెళ్లిన తర్వాత ఆమె బయటకు వచ్చే సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. కాగా, వర్షిణి ఇన్‌స్టాగ్రామ్‌ ముంబయిలో ఓపెన్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. విద్యార్థిని ఉన్న టవర్ లోకేషన్‌ ఆధారంగా ముంబయి స్థానిక పోలీసులు, రైల్వే పోలీసుల సాయంతో వర్షిణిని గుర్తించారు. ప్రస్తుతం విద్యార్థిని రైల్వే పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ముంబయి వెళ్లిన మేడ్చల్‌ పోలీసులు విద్యార్థినిని తీసుకొని ముంబయి నుంచి హైదరాబాద్‌ బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. చదువు విషయంలో కాస్త డిప్రెషన్‌కు గురికావడంతోనే ఇంట్లో నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని