icon icon icon
icon icon icon

మార్పు మొదలైందా!

ఉద్యోగ, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, ఒప్పంద ఉద్యోగులు.. ఓటుకు పోటెత్తుతున్నారు. పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు గంటల తరబడి ఎండల్లో నిరీక్షిస్తున్నారు.

Updated : 08 May 2024 07:00 IST

పోస్టల్‌ ఓటుకు పోటెత్తుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, అంగన్‌వాడీలు
బేరాలకు దిగిన ఓ పార్టీ.. ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ
అయినా అధికశాతం ఓటర్ల నుంచి తిరస్కరణ, ఛీత్కారాలు

ఈనాడు, అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, ఒప్పంద ఉద్యోగులు.. ఓటుకు పోటెత్తుతున్నారు. పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు గంటల తరబడి ఎండల్లో నిరీక్షిస్తున్నారు. ఓటుకు రూ.3-5వేలు ఇస్తామని బేరాలాడుతున్న పార్టీ నేతలకు.. ‘మీ సేవలు చాలు.. చిత్తగించండి’ అని ముఖం మీదే తేల్చేస్తున్నారు. కొన్నిచోట్ల తరిమినంత పనిచేస్తున్నారు. తమ మద్దతు ఏకపక్షమే, ఓటు ఎవరికనేది అంతా ఊహించిందేనని బాహాటంగానే చెబుతున్నారు. మునుపెన్నడూ లేని స్థాయిలో ఉద్యోగవర్గాలు పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసి, వినియోగించుకోవడంపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో మార్పు మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 4.30 లక్షల మంది పోస్టల్‌ బ్యాలట్లకు దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారానికి వారిలో 3.30 లక్షల మంది ఓట్లు వేయగా, అందులో 2.76లక్షల మంది పైగా ఉద్యోగులే. 2019 ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకున్నవారు 2.38 లక్షల మందే.

ఎలాగైనా కొనాలనే..

ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఓట్లంటేనే ఓ పార్టీ ఉలిక్కిపడుతోంది. ఇన్నాళ్లూ వేధించి వెంటాడి.. ఇప్పుడు ఓట్లడిగితే తిరగబడతారనే భయం వారిని వెంటాడుతోంది. అయినా ఎంతోకొంత ప్రయత్నం చేయాలని.. నాలుగైదు రోజులుగా బేరసారాలు ప్రారంభించింది. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.3వేల చొప్పున నిర్ణయించింది. మరోచోట రూ.5వేలైనా ఇచ్చేందుకు సిద్ధమని ప్రలోభాలకు తెరతీసింది. యూపీఐ విధానంలో నగదు బదిలీకి సిద్ధమైంది. కవర్లలో పెట్టి నగదు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తున్న తరుణంలో.. ఈ ఓట్లతో అయినా కొంతమేర లాభపడాలనేది వారి ఆలోచన.

వారికి ఎదురు డబ్బిస్తాం.. మీకైతే ఓటేసేదే లేదు

పోస్టల్‌ ఓట్లలో మెజారిటీ సాధించాలని ఆశిస్తున్న ఆ పార్టీ ఎంత బతిమాలుతున్నా.. వారిని దగ్గరకు రానీయడం లేదు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నవారిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఛీ కొడుతున్న ఘటనలు కూడా ప్రకాశం జిల్లాలో వెలుగుచూశాయి. ఒక ఉద్యోగి అయితే ఏకంగా ప్రత్యర్థి పార్టీ కార్యాలయానికి వెళ్లి.. ఎన్నికల ఖర్చులకు ఉంచాలని కొంత మొత్తం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. మరికొన్నిచోట్ల ఎన్నికల సంఘానికి ఉద్యోగులే ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులపై ప్రకాశం జిల్లాలో ఫిర్యాదులు అందాయని ఎన్నికల సంఘమే పేర్కొంది.

మండుటెండలోనూ గంటలకొద్దీ నిరీక్షణ

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండుటెండల్లోనూ ఉత్సాహం కనబరుస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు.. అటూ ఇటూ తిప్పుతున్నా ఓపిగ్గా వెళ్తున్నారు. ఫాం2 దరఖాస్తు సమర్పించినా.. వారి పేర్లు ఓటరు జాబితాల్లో ఉండటం లేదు. మరోసారి రావాలని సూచిస్తున్నారు. అయినా ఒకటికి రెండుసార్లు తిరిగి మరీ తమ ఓటుపై ఆరాతీసి, ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.


ఓటింగ్‌కు పడిగాపులు

గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు మంగళవారం పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటు వేయాల్సిన ఉద్యోగులు వరుసలో అయిదు గంటలకుపైగా నిల్చోవాల్సి వచ్చింది. ఈ నియోజకవర్గంలో ఓటు ఉన్నవారికి నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగించుకోవడానికి కేంద్రం ఏర్పాటుచేశారు. మంగళవారం ఓపీవోలతోపాటు పోలీసులు, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోవడానికి పెద్దఎత్తున వచ్చారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడం, ఉదయం 10:50 గంటల వరకు ఓటింగ్‌ ప్రారంభం కాకపోవడంతో క్యూలో నిల్చొన్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img