logo

సోమఘట్టలో యువకుడి దారుణ హత్య

ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు ఎవరనేది తెలియాల్సి ఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం...

Published : 02 Feb 2023 05:24 IST

నాగరాజు (పాతచిత్రం)

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు ఎవరనేది తెలియాల్సి ఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... చిలమత్తూరు మండలం సోమఘట్టలో యువకుడు నాగరాజు(30) తన పొలంలో కోళ్లఫారాన్ని, నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే కుటుంబంతో పాటు నివసిస్తున్నాడు. తన స్నేహితుడు అంజినప్ప తోటలో నీటి పైపు మరమ్మతు నిమిత్తం బుధవారం అతనితో పాటు తోటకు వెళ్లాడు. పైపులైన్‌ బాగు చేసేందుకు గుంత తవ్వారు. ఆవులను మరో పొలంలోకి కట్టివేసేందుకు అంజినప్ప వెళ్లాడు. నాగరాజు పనులు చేస్తుండగా.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతన్ని దారుణంగా నరికడంతో అక్కడే చనిపోయాడు. స్థానికులు చిలమత్తూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను గుర్తించడానికి పోలీస్‌ జాగిలాలను తీసుకువెళ్లారు. అవి ఎలాంటి అచూకీని గుర్తించలేకపోయాయి. అక్కడక్కడే తిరిగి నిలిచిపోయాయి. ఎలాంటి ఆధారాలు లభించకపోవడం, హత్యలో ముగ్గురు పాల్గొన్నట్లు చెబుతున్నా, వారు ఎక్కడి నుంచి వచ్చారు..? ఎక్కడికి పారిపోయారు? అనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. నాగరాజుకు రాజకీయ నేపథ్యం లేకపోవడంతో హత్యకు ఇతరత్రా కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మూడు నెలల కిందట నాగరాజుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయినా అతను అప్పట్లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని