logo

ఓపీకే పరీక్ష..!

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైద్య పరికరాల కొరతతో రోగులు నరకయాతన పడుతున్నారు.

Updated : 19 Jan 2023 06:33 IST

కాలికి శస్త్రచికిత్స చేసుకున్నఉప్పాడకు చెందిన సత్యనారాయణను ఎత్తుకుని రక్త పరీక్షలకు తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైద్య పరికరాల కొరతతో రోగులు నరకయాతన పడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారికి వివిధ పరీక్షలు చేసేందుకు క్యాజువాలిటీ, వార్డుల నుంచి తీసుకువెళ్లడానికి స్ట్రెచ్చర్లు, వీల్‌ ఛైర్లు కనీస స్థాయిలో అందుబాటులోలేక అల్లాడుతున్నారు. రోగిని కుటుంబ సభ్యులు, బంధువులు చేతులపై ఎత్తుకుని సీటీస్కాన్‌, ఎక్స్‌రే, తదితర పరీక్షలకు తీసుకువెళ్లే దయనీయ పరిస్థితి జీజీహెచ్‌లో నెలకొంది. జీజీహెచ్‌ సందర్శనకు ఒకటి, రెండు రోజుల్లో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) బృందం వచ్చి అన్ని విభాగాలనూ పరిశీలించనుంది. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, పడకలు, ఇతర వైద్య సదుపాయాలకు సంబంధించిన వనరులను తనిఖీ చేయనుంది. వీరి రాకతోనైనా రోగుల ఇబ్బందులు తొలగుతాయా.. అవసరమైన వైద్య మౌలిక వనరులు సమకూరుతాయా.. అనేది వేచి చూడాలి.
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌, మసీదు సెంటర్‌


జీజీహెచ్‌ను సందర్శించనున్న ఎంసీఐ బృందం

జీజీహెచ్‌కు వైద్య చికిత్సల నిమిత్తం రోజూ సుమారు 3,000 మంది రోగులు వస్తున్నారు. వీరిలో సుమారు 1,500 మంది ఇన్‌ పేషెంట్లు ఉంటున్నారు. 24 విభాగాల పరిధిలో 1,165 పడకలు ఉండగా, కొవిడ్‌ నేపథ్యంలో మరో 700 పడకలు అందుబాటులోకి తెచ్చినా పడకల కొరత తీవ్రంగా వేధిస్తోంది. క్యాజువాలిటీ వార్డులోనే మంచానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉంటున్నారు. దీంతో రోగులతోపాటు, చికిత్స చేసే వైద్యులూ ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర, ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి చికిత్స అందించి వార్డులకు తరలించే ఇక్కడ పరిస్థితి దయనీయంగా ఉంది. శస్త్రచికిత్సలు చేసే థియేటర్లలో వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉంది. ఎనస్తీషియాకు సంబంధించిన పరికరాలు చాలా వరకు పాడైపోవడంతో ఉన్నవాటితోనే శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.

ఎంఆర్‌ఐ పనిచేయకపోయినా హడావుడి..

జీజీహెచ్‌లోని ఎంఆర్‌ఐ యంత్రం 2021, డిసెంబరు నుంచి పనిచేయకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో స్కానింగ్‌లు చేయిస్తున్నారు. దీని నిర్వహణను ఓ ప్రయివేటు సంస్థకు అప్పగించగా.. ఒప్పంద గడువు 2021 డిసెంబరుతో ముగిసింది. దీంతో స్కానింగ్‌ యంత్రాన్ని జీజీహెచ్‌కు అప్పగించాల్సి ఉంది. ఈ సంస్థ ఒప్పంద కాలంలోనే ఎంఆర్‌ఐ యంత్రం మరమ్మతులకు గురవడంతో ఈ సేవలు నిలిచిపోయాయి. కొత్త యంత్రం కొనుగోలు రూ.10కోట్లు కేటాయించినా ఇప్పటికీ సాకారం కాలేదు. దీనికి రూ.65 లక్షలతో మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామని ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంసీఐ బృందం వస్తున్న నేపథ్యంలో రెండ్రోజులుగా ఎంఆర్‌ఐ విభాగాన్ని శుభ్రం చేస్తున్నారు. మూసివేసిన దీన్ని పనిచేస్తున్నట్లు చెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
*జీజీహెచ్‌ ఓపీని ఆన్‌లైన్‌ చేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. టికెట్‌ తీసుకునేందుకు ఒకే కౌంటర్‌ ఉంది. వీటిని పెంచాల్సిన అవసరం ఉంది.
*రోగిని క్యాజువాలిటీ నుంచి వార్డులో అడ్మిషన్‌కు ప్రత్యేక కౌంటరు వద్ద నమోదు చేసుకోవాలి. దీనికీ ఒకే కౌంటరు ఉంది. దీంతో రోగులు, గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు గంటల తరబడి వరుసలో నిలబడాల్సి వస్తోంది.  
* వైద్యులు రాసిచ్చిన మందులు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్లు తక్కువగా ఉన్నాయి. వైద్యం పొందే సమయం కన్నా, మందులు తీసుకోడానికే ఎక్కవసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
* ప్రధానంగా గైనిక్‌ విభాగంలో పడకల కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమిస్తారని, తప్పని పరిస్థితుల్లోనే శస్త్రచికిత్సలు చేస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది. ఇక్కడ పడకల కొరత తీవ్రంగా ఉంది. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు గర్భిణులు, బాలితలు ఉండాల్సిన పరిస్థితి ఉంది.  

సదుపాయాలపై ఆరా

జీజీహెచ్‌ బోధనాసుపత్రికి రంగరాయ వైద్య కళాశాల అనుబంధంగా ఉంది. ఈ కళాశాలలకు కేటాయించే ఎంబీబీఎస్‌, పీజీ సీట్లు, దీనికి తగ్గట్టుగా జీజీహెచ్‌లో వైద్య పరికరాలు ఉన్నాయా.. లేదా.. ఈసీజీ, ఎక్స్‌రే యూనిట్లు, సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ కేంద్రాలు, ఇతర వైద్య పరికరాలు, పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై ఈ బృందం ఆరా తీయనుంది. రోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్సల తీరును పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ కోర్సులకు తగ్గట్టుగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారా అనే కోణంలోనూ ఆరా తీయనున్నారు. దీని ఆధారంగా అదనపు సీట్లు సమకూరే అవకాశం ఉంటుంది.  

అన్ని విభాగాలనూ పరిశీలిస్తారు..

ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో ఫ్యాకల్టీ, వైద్య మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు ఎంసీఐ బృందం రానుంది. ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులను బృందానికి తెలియజేస్తాం. పనిచేయని యంత్రాల పరిస్థితిని వివరిస్తాం. ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు బయటకు పంపించే అంశాన్ని బృందానికి చెబుతాం. జీజీహెచ్‌లో అన్ని వనరులు  అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సీట్లు పెంచే   అవకాశం ఉంది.
డాక్టర్‌ హేమలతాదేవి, పర్యవేక్షకుల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని