విద్యాభివృద్ధికి సావిత్రి కృషి చిరస్మరణీయం
చిత్రపటం వద్ద నివాళి అర్పించిన కళాపీఠం ప్రతినిధులు, గ్రామపెద్దలు
రేపల్లె అర్బన్, న్యూస్టుడే : తీరప్రాంతంలో విద్యాభివృద్ధికి మహానటి సావిత్రి చేసిన కృషి చిరస్మరణీయమని మచిలీపట్నం సావిత్రి కళాపీఠం అధ్యక్ష, కార్యదర్శులు దారపు శ్రీనివాస్, బడే ప్రభాకర్ పేర్కొన్నారు. రేపల్లె మండలం వడ్డివారిపాలెం గ్రామంలోని శ్రీసావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సావిత్రి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. 1963లో సావిత్రి విరాళంగా ఇచ్చిన రూ.25 వేలతో స్థాపించిన పాఠశాలలో వేలాదిమంది చదువుకుని ఉన్నతంగా ఎదిగారన్నారు. అలాంటి మంచి విద్యాలయంలో విద్యాభ్యాసం చేయడం విద్యార్థుల అదృష్టమన్నారు. లక్ష్యం నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి కృషిచేసిన వడ్డివారిపాలెం సర్పంచి సునీత, మాజీ సర్పంచి లక్ష్మోజి, హనుమంతరావు, రమణతోపాటు సత్తెనపల్లికి చెందిన సుబ్బారెడ్డి, కరోనా సమయంలో పేదలకు సహాయం అందజేసిన కృష్ణాజిల్లా అవనిగడ్డ సీఐ రవికుమార్, నాట్య కళాకారిణి సుమతోపాటు పలువురిని కళాపీఠం సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని మట్టా జ్యోత్స్న, ఉపాధ్యాయులు గ్రామపెద్దలు పాల్గొన్నారు.