logo

ట్రాక్టర్లలో ప్రయాణం.. ప్రాణాలకే ప్రమాదం..

ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి వారంలో వట్టిచెరుకూరు- సౌపాడు క్రాసింగ్‌ వద్ద జరిగిన ప్రమాదంలో వ్యవసాయ కూలీలు గాయాలపాలయ్యారు.

Published : 07 Jun 2023 04:32 IST

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే

వట్టిచెరుకూరు సమీపంలో ట్రాక్టర్‌ బోల్తా పడిన ప్రదేశాన్నిపరిశీలిస్తున్న రవాణా శాఖ అధికారులు

* ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి వారంలో వట్టిచెరుకూరు- సౌపాడు క్రాసింగ్‌ వద్ద జరిగిన ప్రమాదంలో వ్యవసాయ కూలీలు గాయాలపాలయ్యారు. ట్రాక్టర్‌ వెనుక తగిలించిన మొక్కజొన్న నూర్పిడి యంత్రంపై ఎక్కి గుంటూరు నుంచి వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పది మందికి పైగా ఆ యంత్రంపై ఎక్కడం, డ్రైవర్‌ వేగంగా ట్రాక్టర్‌ను నడపడంతో మలుపు వద్ద అదుపు తప్పింది. ట్రాక్టర్‌ నుంచి నూర్పిడి యంత్రం విడిపోయి పక్కకు ఒరిగిపోవడంతో ఏడుగురు వ్యవసాయ కూలీలకు గాయాలయ్యాయి.

* అదే ప్రాంతంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకొంది. కొండేపాడుకు చెందిన 26 మంది పొన్నూరు రూరల్‌ మండలంలోని జూపూడి గ్రామంలో జరుగుతున్న వేడుకకు ట్రాక్టర్‌ ట్రక్కులో పయనమయ్యారు. వట్టిచెరుకూరు నుంచి లింగంగుంటపాలెం వెళ్లే మార్గంలో డ్రైవర్‌ అతివేగంగా ట్రాక్టర్‌ నడపడం, నిర్లక్ష్యం తోడవడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న మురుగు కాల్వలోకి పల్టీ కొట్టింది. ఏడుగురు మహిళలు మృత్యువాత పడ్డారు. 18 మందికి గాయాలయ్యాయి.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

గుంటూరు జిల్లాలో 16,000 పైగా ట్రాక్టర్లు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ పనులకు ఉపయోగించేవి వాణిజ్య తదితర అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు. వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్ల నిర్వాహకులు రవాణా శాఖకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అసవరం లేదు. వాణిజ్య అవసరాలకు వినియోగించే ట్రాక్టర్లు ఏడాదికి రూ.3040 వరకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. పొలం దుక్కి దున్నడం, దమ్ము చేయడంతో పాటు పంట ఉత్పత్తులను ఇళ్లకు చేరవేసుకోవడం, విక్రయించుకునేందుకు మార్కెట్ యార్డులకు మిర్చి, పత్తి, ధాన్యం, మొక్కజొన్న వంటి పంట ఉత్పత్తులను తరలించడం వంటి వాటికి వినియోగించుకోవాలి. పంట ఉత్పత్తులను చేరవేసే సమయంలో వాటిపై ప్రయాణించకూడదు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ తప్ప ఎవరూ ఇంజిన్‌పై కూడా ఎక్కకూడదు. ఎందుకంటే ట్రాక్టర్‌పై కూర్చునేందుకు, పట్టుకొని ప్రయాణించేందుకు హ్యాండిల్స్‌ వంటివి ఏమీ ఉండవు. ఈవిధంగా ట్రాక్టర్‌పై ప్రయాణిస్తూ కింద పడి కొందరు మృతి చెందిన సందర్భాలు ఉన్నాయని రవాణా శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు. వాణిజ్య అవసరాలకు వినియోగించే ట్రాక్టర్లలో గ్రావెల్‌, ఇటుక, ఇసుక, కంకర, డస్ట్‌ తదితర భవన నిర్మాణ సామగ్రి తరలించేటప్పుడు కూడా వాటిపై ఎక్కి కూలీలు ప్రయాణించకూడదు. ప్రజలు ట్రాక్టర్లలో ప్రయాణించకుండా చైతన్యం చేయాల్సిన రవాణా శాఖ అధికారులు, పోలీసులు ఆ పని కట్టుదిట్టంగా చేయడం లేదు. లక్ష్యం పూర్తి చేసుకునేందుకు కేసులు నమోదు చేసి అపరాధ రుసుం విధించి చేతులు దులిపేసుకుంటున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలు, గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ట్రాక్టర్లలో ప్రయాణించకూడదని అధికారులు సామాన్య ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సాధ్యమైనంత వరకూ ట్రాక్టర్లలో ప్రయాణించకూడదని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు పాటిస్తే పది కాలాలు పాటు పచ్చగా ఉండొచ్చని చెబుతున్నారు.


తరచుగా తనిఖీలు, అవగాహన సదస్సులు

ట్రాక్టర్లను వ్యవసాయ అవసరాలకు మాత్రమే వాడాలి. ఇతర అవసరాలకు వినియోగించకూడదు. తరచుగా తనిఖీలు నిర్వహించడంతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు 200 కేసులు నమోదు చేసి రూ.3 లక్షల వరకు అపరాధరుసుం వసూలు చేశాం. ట్రాక్టర్‌లో డ్రైవర్‌ ఒక్కరు తప్ప పక్కన కూడా ఎవరూ ప్రయాణించకూడదు. సరకు తరలించేటప్పుడు కూడా వాటిపై రైతులు, కూలీలు కొందరు ప్రయాణిస్తుంటారు. ఆవిధంగా చేయకుండా ఉండటం ఉత్తమం. 

షేక్‌ కరీం, డీటీసీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని