logo

అద్దె బకాయిల వసూళ్లపై దృష్టి

చీరాల పట్టణంలో పురపాలక సంఘానికి సంబంధించిన దుకాణాల్లో అద్దె బకాయిల వసూళ్లపై మున్సిపల్‌ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Published : 10 Jun 2023 05:19 IST

వైకాపా కార్యాలయానికి అధికారుల నోటీసులు
రూ.3 లక్షలకు పైగా పెండింగ్‌

వైకాపా కార్యాలయానికి నోటీసు అంటిస్తున్న పురపాలక సంఘ సిబ్బంది

చీరాల పట్టణం, న్యూస్‌టుడే: చీరాల పట్టణంలో పురపాలక సంఘానికి సంబంధించిన దుకాణాల్లో అద్దె బకాయిల వసూళ్లపై మున్సిపల్‌ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్నిరోజుల క్రితం అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్న సుమారు 35 మందికి నోటీసులు జారీచేశారు. ఈ దుకాణాల్లో వైకాపా కార్యాలయం ఉండటం గమనార్హం. పట్టణంలోని హైస్కూల్‌ రోడ్డులో ఎన్‌ఆర్‌, పీఎం పాత కాంప్లెక్స్‌లో దుకాణం నెం-5 కొన్ని సంవత్సరాలుగా పి.జ్యోతి అనే ఆమె పేరుతో కొనసాగుతుంది. ఇందులో కొంతకాలంగా చీరాల మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ తన వర్గంతో కలసి పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు. మొన్నటివరకు ఇందులో పార్టీకి సంబంధించిన, ఇతర కార్యక్రమాలు కొనసాగేవి. ప్రస్తుతం కృష్ణమోహన్‌ పర్చూరు నియోజకవర్గ వైకాపా బాధ్యుడిగా వెళ్లటంతో ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఈ దుకాణానికి సంబంధించి సుమారు రూ.3లక్షలకు పైగా అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉండగా గడువులోపు బకాయిలు చెల్లించకపోవటంతో దుకాణానికి నోటీసులు అంటించారు. ఇది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన మున్సిపల్‌ సాధారణ కౌన్సిల్‌ సమావేశంలో కొందరు కౌన్సిలర్లు పురపాలక సంఘానికి సంబంధించిన కాంప్లెక్స్‌లో ఎన్ని దుకాణాలు ఉన్నాయి. అద్దెబకాయిలు తదితర వివరాలు తెలియజేయాలని ప్రశ్నించారు. దీంతో అధికారులు ఇప్పుడు వీటిపై దృష్టిసారించారు. వైకాపా కార్యాలయంగా ఉన్న ఈ దుకాణానికి సంబంధించి అద్దె గడువు గత ఏప్రిల్‌ నెలాఖరు వరకు ఉండగా, అధికారులు తిరిగి మరో నెల రోజుల పాటు అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ అద్దె చెల్లించకపోవటంతో ఈ నోటీసును అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. నోటీసు అందిన వారం రోజులలోపు ట్యాక్స్‌లతో సహా అద్దె బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో రద్దుచేసి దుకాణానికి తిరిగి వేలం వేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని