Crime News: జలమండలి వాటర్‌ ట్యాంక్‌లో శవం.. ఆందోళనలో జనం

ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రీసాలగడ్డ జలమండలి వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం లభ్యమైంది. ట్యాంకు శుభ్రపరిచేందుకు వెళ్లిన సిబ్బంది మృతదేహాన్ని గుర్తించారు

Updated : 08 Dec 2021 10:10 IST

రాంనగర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ రాంనగర్‌ డివిజన్‌ ఎస్సార్కేనగర్‌ ప్రాంతంలోని జలమండలికి చెందిన 50 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్‌ ట్యాంకులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం(25) ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం...మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జలమండలి సిబ్బంది ట్యాంకును శుభ్రం చేసేందుకు ఆరుగురు కూలీలను ట్యాంకుపైకి పంపించారు. కూలీలు ట్యాంకుపై ఉన్న మూతను తొలగించి లోపలికి దిగుతుండగా కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం కనిపించింది. వారు భయంతో కిందికి వచ్చి విషయాన్ని సిబ్బందికి చెప్పారు. వెంటనే జలమండలి సిబ్బంది ముషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌యాదవ్‌, డీఐ వెంకన్న, సెక్టార్‌ ఎస్సై శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి చేరుకుని జీహెచ్‌ఎంసీ అత్యవసర విభాగం డీఆర్‌ఎఫ్‌ సహాయంతో సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని బయటకు తీశారు. సుమారు వారం, పది రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి అస్తిపంజరంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని