logo

దివ్యాంగులకు స్లాట్లు దొరక్క ఇబ్బందులు

రామగుండానికి చెందిన దివ్యాంగుడు రాజయ్యకు ప్రతి రోజూ మీసేవ కేంద్రానికి వెళ్లి రావడమే పని. దివ్యాంగులకు  ఆసరా పింఛను మంజూరు కావాలంటే వైకల్య ధ్రువీకరణ కావాలి.

Published : 19 Jan 2023 05:16 IST

కొత్త సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనతోనే జాప్యం

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

* రామగుండానికి చెందిన దివ్యాంగుడు రాజయ్యకు ప్రతి రోజూ మీసేవ కేంద్రానికి వెళ్లి రావడమే పని. దివ్యాంగులకు  ఆసరా పింఛను మంజూరు కావాలంటే వైకల్య ధ్రువీకరణ కావాలి. ఇందుకోసం సదరం శిబిరంలో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉండగా రాజయ్య నిత్యం వస్తున్నా పని కావడం లేదు. ప్రభుత్వం సాప్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పులు చేస్తున్న క్రమంలో తాత్కాలికంగా ఈ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో స్లాట్‌ ఎప్పుడు బుక్‌ అవుతుందో తెలియక ఆయన చెప్పులరిగేలా తిరుగుతున్నారు.

* పెద్దపల్లికి చెందిన తాత్కాలిక ఉద్యోగి రమేశ్‌ విధి నిర్వహణలో రెండు కాళ్లూ కోల్పోయి మంచానికే పరిమితమయ్యారు. మూడు నెలలుగా స్లాట్‌ బుకింగ్‌పై రేపు, మాపు అని చెబుతున్నారే గానీ చేయడం లేదని వాపోతున్నారు. వాస్తవానికి గతంలోనే ఈయనకు పింఛను రావాల్సి ఉన్నా ఆలస్యంగా సదరం శిబిరానికి హాజరయ్యారు. దీంతో 3 నెలలుగా స్లాట్‌ బుక్‌ కాకపోవడంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.

స్లాట్‌ బుకింగ్‌పై ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నవిస్తున్న దివ్యాంగుడు (పాత చిత్రం)


అర్హులు వేలల్లో.. అవకాశం 300లోపే..

జిల్లావ్యాప్తంగా మొత్తం 1,09,976 మందికి ఆసరా పథకం కింద నెలనెలా పింఛన్లు అందిస్తున్నారు. ఇందులో 13,546 మంది దివ్యాంగులు నెలకు రూ.3,106 చొప్పున పింఛను పొందుతున్నారు. వీరికి అదనంగా 1,169 మంది కొత్తవారు పింఛను ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖకు మూడు నెలలకు ఒకసారి 300 స్లాట్ల చొప్పున విడుదల చేస్తుంది. పరీక్షలు చేయించుకోవాల్సిన దివ్యాంగుల సంఖ్య వేలల్లో ఉంటే కోటా మాత్రం 300 దాటడం లేదు. స్లాట్‌ లభిస్తేనే తమకు వచ్చిన తేదీల్లో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సదరం శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. శారీరక వైకల్యం, దృష్టి, వినికిడి తదితర శారీరక, మానసిక రుగ్మతలున్నవారికి సంబంధిత వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉంటేనే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. జిల్లాలో డిసెంబరు మొదటి వారంలోనే గతేడాది స్లాట్‌ బుకింగ్స్‌ నిర్వహించారు. కొత్త సంవత్సరంలో జనవరి-మార్చి వరకు ఉండే స్లాట్‌ను గత ఏడాది డిసెంబరు రెండో వారంలోనే ప్రకటించాల్సి ఉండగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షణ..

- శ్రీధర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

గతంలో 4 రకాల వైకల్యం కలిగిన వారు మాత్రమే సదరం శిబిరానికి హాజరయ్యేవారు. ప్రస్తుతం మరో 21 రకాల శారీరక, మానసిక వైకల్యాలతో బాధపడుతున్న వారిని కూడా గుర్తించారు. ఇందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. ఆ ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలో కోటా ప్రకారం స్లాట్లు అందించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని