logo

వడగళ్ల వాన.. తప్పని హైరానా..!

జిల్లాలో అకాల వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉత్తర- దక్షిణ ద్రోణి ప్రభావంతో రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం నుంచి చల్లని గాలుల ప్రభావం జిల్లాలో కనిపించింది.

Published : 19 Mar 2023 05:21 IST

జమ్మికుంట ఆర్‌వోబీ ప్రాంతంలో కురుస్తున్న వర్షం

ఈనాడు, కరీంనగర్‌: జిల్లాలో అకాల వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉత్తర- దక్షిణ ద్రోణి ప్రభావంతో రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం నుంచి చల్లని గాలుల ప్రభావం జిల్లాలో కనిపించింది. సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో వడగళ్లతో కూడిన వర్షంతో అపార నష్టం వాటిల్లింది. భారీ పరిమాణంలో ఉన్న రాళ్లను చూసి రైతులు కంగు తిన్నారు. వరిపంటతోపాటు కూరగాయల పంటపొలాలకు ఈ వర్షంతో నష్టం వాటిల్లింది. శుక్రవారం కొన్ని మండలాల్లో అధికంగా జల్లులు కురిశాయి. శనివారం గంగాధర, రామడుగు, శంకరపట్నం, మానకొండూర్‌, హుజూరాబాద్‌, వీణవంక, చిగురుమామిడి, జమ్మికుంట మండలాల్లో పడిన వానతో ప్రజలకు హైరానా తప్పలేదు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

పిడుగుపాటుకు నిలిచిన సరఫరా

భగత్‌నగర్‌: పిడుగుపాటుకు నగరంలోని పలు ప్రాంతాలకు శనివారం సాయంత్రం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు అధికారులు తెలిపిన వివరాల మేరకు శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. భారీ శబ్ధంతో పడిన పిడుగు ధాటికి నగరంలోని హౌజింగ్‌ బోర్డులోని 132 కేవీ విద్యుత్తు కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది సాంకేతిక సమస్యను పరిష్కరించి విద్యుత్తు సరఫరాను వెంటనే పునరుద్ధరించారు.

హుజూరాబాద్‌, జమ్మికుంటల్లో భారీ వర్షం

హుజూరాబాద్‌ పట్టణం, జమ్మికుంట : హుజూరాబాద్‌, జమ్మికుంట పట్టణాల్లో శనివారం రాత్రి భారీగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో జమ్మికుంట పట్టణంలో కురిసిన భారీ వర్షానికి ఆర్‌వోబీకి ఇరువైపులా వర్షపు నీరు నిలిచింది. గాంధీ చౌరస్తా వద్ద అదే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో వర్షపునీరు భారీగా చేరింది. అలాగే హుజూరాబాద్‌ పట్టణంలో ఓ మోస్తరుగా కురిసిన వర్షంతో రోడ్డుపై నీరు నిలిచింది.


దెబ్బతిన్న వరి పంట

మానకొండూర్‌ : మద్దికుంట- గంగారం రహదారిపై పడిపోయిన చెట్టు

మానకొండూర్‌ : మానకొండూర్‌ మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగళ్ల వర్షం కురవడంతో రైతన్నలు ఆందోళనలో మునిగిపోయారు. పలు ప్రాంతాల్లో వరి పంట దెబ్బతింది. మద్దికుంటలో ఈదురుగాలులకు రహదారిపై తాటిచెట్టు కూలిపోయింది. మద్దికుంట - గంగారం రహదారిపై చెట్టు విరిగి పడడంతో రాకపోకలకు అవస్థలు పడ్డారు. మానకొండూర్‌, పచ్చునూర్‌, వెల్దిలో రాత్రి భారీ వర్షంతోపాటు వడగళ్లు కురిసాయి. కొండపల్కల, చెంజర్ల, అన్నారంలో వర్షం కురిసింది. దీంతో ఈదురుగాలులకు వరి పొలాలు నేలవాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


వీణవంక : వీణవంక మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతోపాటు వడగళ్లు పడ్డాయి. ఈదురుగాలులకు బ్రాహ్మణపల్లి గ్రామంలో తాటి చెట్టు విరిగి గాజుల రాజేశ్‌ ఇంటిపై పడటంతో ఇల్లు కూలింది. ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు అయినట్లు గ్రామస్థులు తెలిపారు.


నేలవాలిన పంటలు

జమ్మికుంట మండలంలో కురిసిన వడగళ్లు

జమ్మికుంట : అకాల వర్షంతో మొక్కజొన్న పంట నేల వాలగా, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగళ్ల వాన కురియటంతో అన్నదాతలు ఆవేదనకు లోనయ్యారు. జమ్మికుంట మండలం, విలాసాగర్‌, పాపయ్యపల్లిలో కురిసిన వడగళ్లు పెద్దగా ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. సాయంత్రం 6 గంటల తరవాత వర్షం కురవడంతో పంటల పరిస్థితి ఏంటో తెలియక రైతులు ఆందోళనలో మునిగిపోయారు. అకాల వర్షంతో ఇప్పటికే జమ్మికుంట మండలంలో 696 ఎకరాలు, ఇల్లందకుంట మండలంలో 1,215 ఎకకాల మొక్కజొన్న పంట నేల వాలినట్లు వ్యవసాయాదికారులు అంచనా వేశారు. శనివారం కురిసిన వడగళ్ల వానతో జరిగిన నష్టం అధికారులు పర్యవేక్షణ అనంతరం తెలియనున్నది.


రామడుగులో కంకర రాళ్లను తలపించేలా..

రామడుగు, న్యూస్‌టుడే: కంకర రాళ్లను తలపించే పరిమాణంలో రామడుగు మండలంలోని గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా మొదలైన వడగళ్ల వర్షం ఆరగంట పాటు కురిసింది. రామడుగు, వెదిర, దేశరాజ్‌పల్లి, పందికుంటపల్లి, కిష్టాపూర్‌, షానగర్‌, కోరిటపల్లి, గోలిరామయ్యపల్లి, మోతె, కొక్కెరకుంట, రుద్రారం, రంగశాయిపల్లి, దత్తోజిపేట గ్రామాల్లో వడగళ్లు మంచు పొర మాదిరిగా పరచుకున్నాయి. పొలాల్లో వడగళ్ల వర్షంతో చిరుపొట్ట దశలోని వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందారు.

గంగాధర మండలంలో

గంగాధర: గంగాధర మండలంలో పెద్ద పరిమాణంలో వడగళ్లు కురవడంతో వరి, మొక్కజొన్న, కూరగాయలతోపాటు మామిడి తోటలు దెబ్బతిని నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గంగాధర, లక్ష్మీదేవిపల్లి, మధురానగర్‌, నాగిరెడ్డిపూర్‌, కురిక్యాల, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల, గట్టుబూత్కూర్‌, గర్శకుర్తి, ఆచంపల్లి, గోపాల్‌రావుపల్లి, మల్లాపూర్‌, కొండన్నపల్లి, తదితర గ్రామాల్లో వడగళ్ల వానతో వందలాది ఎకరాల్లో పొట్ట దశలో ఉన్న వరి, కంకులు ఈనిన వరి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. మామిడి కాయలు నేలరాలి అపార నష్టం జరిగింది. గట్టుబూత్కూర్‌లో ఇద్దరు వ్యక్తులకు చెందిన ఇళ్లపై వడగళ్లు పడటంతో సిమెంట్‌ రేకులకు రంధ్రాలుపడ్డాయి. ఇంట్లో ఉన్న టీవీ పగిలిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అనిల్‌ అనే వ్యక్తి ఇంటి పైకప్పు రేకులు కూడా ధ్వంసమయ్యాయి.

చొప్పదండి మండలంలో

చొప్పదండి: చొప్పదండి మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం సాయంత్రం రాళ్లవాన కురిసి పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటలను అంచనా వేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరారు.

చెర్లబూత్కూర్‌లో...

కరీంనగర్‌ గ్రామీణం: అకాల వర్షానికి తోడు శనివారం సాయంత్రం కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని చామనపల్లి, చెర్లబూత్కూర్‌, ఇరుకుల్ల, జూబ్లీనగర్‌ తదితర గ్రామాల్లో రాళ్లవాన కురిసింది. ఈ కారణంగా పొట్టదశలో ఉన్న వరి పొలాలు కొంతమేర దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని