logo

అభాగ్యులపై వాత్సల్యం

విధివంచిత బాలలకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. ఆదరణ లేని చిన్నారులకు చేయూతనిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

Published : 09 Jun 2023 04:54 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ మంకమ్మతోట: విధివంచిత బాలలకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. ఆదరణ లేని చిన్నారులకు చేయూతనిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. వారి విద్య, వైద్య అవసరాలు తీర్చేందుకు ఆర్థికసాయం అందించడానికి కృషి చేస్తున్నాయి. గతంలో సమగ్ర బాలల సంరక్షణ పథకం (ఐసీపీఎస్‌) కింద చేయూతనివ్వగా, ‘మిషన్‌ వాత్సల్య’గా పేరును మార్చి సహాయాన్ని మరింత పెంచుతున్నట్లు ప్రకటించాయి. పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. చేయూతనందిస్తారనే ఆశతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విధివంచిత బాలలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నా.. ప్రాథమిక మార్గదర్శకాలు మాత్రమే వచ్చాయి. పూర్తి స్థాయిలో పథకం అమల్లోకి రావాల్సి ఉంది.


ఎవరు అర్హులంటే..

తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారు, వివిధ కారణాలతో తల్లిదండ్రులకు పాక్షికంగా దూరంగా పెరుగుతున్న వారు, కుటుంబ పెద్ద ప్రాణాంతక వ్యాధి బారినపడి పేదరికంలో మగ్గుతున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ప్రకృతి వైపరీత్యానికి గురైన వారు, అక్రమ రవాణా, దాడులకు గురైన వారు, యాచకులు, బాల్య వివాహం చేసుకున్న వారు, హెచ్‌ఐవీ బాధిత, పీడితులు, దివ్యాంగులు కూడా అర్హులే. మిషన్‌ వాత్సల్య పథకం ద్వారా గరిష్ఠంగా మూడేళ్ల వరకు నెలకు రూ.4 వేలు అందిస్తారు. గతేడాది వరకు నెలకు రూ.2 వేలు అందించే వారు.


దరఖాస్తు పరిశీలన కమిటీ..

క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ టీచరు మొదలుకొని సీడీపీవో కార్యాలయానికి అందిన దరఖాస్తులన్నింటినీ మండల స్థాయి కమిటీ (తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవో, ఐసీడీఎస్‌ పర్యవేక్షకురాలు) నిశితంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. అనంతరం జిల్లా స్థాయి కమిటీకి పంపిస్తారు. జిల్లా పాలనాధికారి ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో మరో ఐదుగురు సంబంధిత అధికారులు మరోసారి పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.


ధ్రువీకరణ పొందడంలో ఇబ్బందులు

తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో అయితే రూ.1.5 లక్షలుగా నిర్ణయించారు. కొంతమంది రెవెన్యూ అధికారులు మిషన్‌ వాత్సల్యకు అవసరమైన విధంగా తక్కువగా ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి అంగీకరించట్లేదు. ఈ విషయాన్ని ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు సంబంధిత తహసీల్దార్‌కు పథకం మార్గదర్శకాలు చూపించి జారీ చేసేలా చూస్తున్నారు.


అవసరమైన పత్రాలు..

బాలుడు లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, తల్లిదండ్రులు, లేదా సంరక్షకుడి ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బాలుడు, బాలిక పాస్‌పోర్టు సైజు ఫొటో, విద్యార్హత ధ్రువపత్రం, వ్యక్తిగత ఖాతా లేక తల్లి, తండ్రి, సంరక్షకులతో కలిసిన ఉమ్మడి ఖాతా వివరాలతో సంక్షేమ అధికారి కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.


వార్షికాదాయం పరిమితి

గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సంవత్సర ఆదాయం రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.96 వేలకు మించరాదు. జేజే బోర్డు, బాలల సంక్షేమ కమిటీ కోర్టు రాత పూర్వకంగా నమోదు చేసిన కారణాల ఆధారంగా అవసరాన్ని బట్టి స్పాన్సర్‌షిప్‌ గరిష్ఠంగా ఉన్న మూడు సంవత్సర కాలాన్ని మరికొంత పొడిగించవచ్చు. బాలలను ఏదైనా వసతిగృహం, బాల సదనంలో చేర్పించి, ప్రత్యామ్నాయం చూపిన తర్వాత సహాయం అందించడాన్ని నిలిపివేస్తారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలల విషయంలో మినహా పాఠశాలలకు వెళ్లే వారు హాజరు పూర్తి తక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలితే తాత్కాలికంగా పథకం అమలును నిలిపివేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని