logo

సవాళ్లను అధిగమిస్తేనే

ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్లు నుంచి వ్యవసాయం కోసం మాన్వి తాలూకాకు వచ్చిన ఆయన కాలక్రమేణా రాజీకయం వైపునకు దృష్టి మళ్లించారు. కాంగ్రెస్‌ పార్టీకి నమ్మిన బంటుగా పేరొందారు.

Updated : 03 Jun 2023 06:32 IST

ప్రగతి ‘న్యూస్‌టుడే’తో మంత్రి ఎన్‌.ఎస్‌.బోసురాజు

బోసురాజును అభినందిస్తున్న సిద్ధు

మాన్వి,న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్లు నుంచి వ్యవసాయం కోసం మాన్వి తాలూకాకు వచ్చిన ఆయన కాలక్రమేణా రాజీకయం వైపునకు దృష్టి మళ్లించారు. కాంగ్రెస్‌ పార్టీకి నమ్మిన బంటుగా పేరొందారు. ఎమ్మెల్యేగా, హైదరాబాద్‌ కర్ణాటక ప్రదేశాభివృద్ధి అధ్యక్షుడిగా, కాడా అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శిగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రజలకు, పార్టీకి సేవలందించారు. పార్టీకి ఆయన చేసిన సేవలు, అనుభవం రీత్యా సిద్ధరామయ్య మంత్రి వర్గంలో స్థానం దక్కింది. రాష్ట్ర చిన్ననీటి తరహా, శాస్త్ర సాంకేత శాఖల మంత్రి ఎన్‌.ఎస్‌.బోసురాజు రాజకీయ జీవితం అనేక ఒడిదొడుకులతో కూడుకుంది. తన 52 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తెలివితేటలు, కలుపుగోలుతనం, పని తప్ప మరో ధ్యాసలేని ఆయన వ్యక్తిత్వం కారణంగానే మంత్రి పదవి లభించిందనడంలో అతిశయోక్తికాదు. గల్లీ నుంచి దిల్లీ దాకా రాజుకు నాయకులతో మంచి పరిచయాలున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్రమంలో ఆయనను ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి మాట్లాడింది.

ప్రశ్న: చిన్ననీటిపారుదల, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి పదవి మీకు సంతృప్తినిచ్చిందా?

జవాబు: తప్పకుండా, ఏ శాఖని చిన్నగా చేసి చూడకూడదు. దేనికదే ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. నాకు ఈ శాఖ పూర్తిగా సంతృప్తినిచ్చింది.

ప్ర: శాఖలో మీకున్న సవాళ్లు ఏమిటి వాటిని ఎలా అధిగమిస్తారు?

జ: సవాళ్లకు భయపడితే మంత్రి పదవి నిర్వహించలేం. సవాళ్లను అనుకూలంగా మార్చుకున్నప్పుడే ఆ శాఖ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని నమ్ముతాను. తప్పక సవాళ్లను అధిగమిస్తాను.

ప్ర: చిన్ననీటి పారుదల శాఖ ద్వారా మీరు చేయాలనుకున్న ప్రధాన పనులేమిటి?

జ: చిన్ననీటిపారుదలశాఖ అయినప్పటికీ పెద్ద పెద్ద పనులు చేసేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. చేయాలన్న సంకల్ప బలం ఉంటే ఏమైనా చేయవచ్చు. మంత్రుల మధ్య సమన్వయం, సయోధ్యతో నా శాఖ ద్వారా ఏం చేయవచ్చునో చేసి చూపుతాను.

ప్ర: ప్రధానంగా మీ శాఖ ద్వారా రైతులకు ఏం చేయాలనుకుంటున్నారు?

జ: ఒకటి కాదు వేల సంఖ్యలో పనులు చేయవచ్చు. తాగు నీటి సరఫరా, నాలాల అభివృద్ధి, చెరువుల నిర్మాణానికి అనేక పథకాలు, నీళ్ల ట్యాంకుల నిర్మాణం, చెక్‌డ్యాముల నిర్మాణం, ఎత్తిపోతల పథకాలు చేపట్టవచ్చు.

ప్ర: రాయచూరు జిల్లా చివరి భూముల నీటి సమస్యను ఏ విధంగా పరిష్కస్తారు. ఇందుకు ఏం చర్యలు తీసుకుంటారు?

జ: నా ఆశయమే రైతుల శ్రేయస్సు. ప్రతి రైతూ లాభపడాలని కోరుకుంటాను. టైల్యాండ్‌ రైతుల సమస్యల పరిష్కారానికి శతవిధాలా ప్రయత్నం చేస్తాను. ప్రతి రైతు పొలానికి నీరు అందాలి. ఆ దిశలో కృషి చేస్తాను. మూడు జిల్లాల అధికారులు, ఎమ్మెల్యేలతో ఇందుకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అక్రమ నీటి సాగు, రైతులకు నీటి సరఫరా తదితర సమస్యల పై చర్చిస్తాను. జిల్లా రైతులకు నీరందించేందుకు ఉన్న అవకాశాన్నీ ఒదులుకోను.

ప్ర: మీరు మంత్రి కావాలని క్యాంపుల ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు. వారికి ఎలా న్యాయం చేస్తారు?

జ: క్యాంపులకు కనీస మౌలిక వసతుల కల్పన, రైతుల కోరుకుంటే వారికి చెరువుల నిర్మాణం, పిక్‌డ్యాముల ఏర్పాటు, లింక్‌ రోడ్డుల, రహదారుల నిర్మాణం వంటి కార్యక్రమాలను అమలు చేస్తాను.

ప్ర: రాయచూరుకు ఎం.ఎస్‌.పాటిల్‌ తర్వాత జిల్లా మంత్రి అవకాశం ఎవరికీ రాలేదు మీకొస్తుందని భావించారా?

జ: జిల్లా మంత్రిగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందంటే నేను నమ్మను. మంత్రులుగా వచ్చిన అవకాశాలను సవ్యంగా వినియోగించుకుంటే జిల్లా మంత్రిగా ఉన్నా లేకున్నా చేయవచ్చు. పని చేయాలన్న తపన, ఆలోచన, ముందు చూపుతో అభివృద్ధి పనులు చేయవచ్చు.

ప్ర: రాయచూరు జిల్లాకు సంబంధించి మీ ముందున్న ఆశయం ఏమిటి. వాటి సాధనకు ఎలా కృషి చేస్తారు?

జ: జిల్లాలోని మస్కి నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌బీసీ నుంచి 5ఎ అనుసంధాన కాలువ నిర్మాణం చేయాల్సి ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలో ప్రకటించిన విధంగా ఎయిమ్స్‌ ఏర్పాటుకు కృషి చేస్తాను. ఒపెక్‌ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెస్తాను. జిల్లాలో ప్రతి ఇంటికీ నీరందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. జలధార యోజనను పక్కాగా అమలు చేస్తే నీటి సమస్యని అధిగమించటం కష్టమేమీ కాదు. దీనికి చిత్త శుద్ధి అవసరమంతే.

ప్ర: మీ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి కదా వాటిని ఎలా సాధిస్తారు?

జ: ముందే చెప్పాను. మంత్రిగా ఏ శాఖ అయినా అభివృద్ధి చేయవచ్చు. మంత్రిగా నేను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌, ఇతర శాఖల మంత్రులందరితోనూ సమన్వయంతో, వారి సహకారంతో పక్కా ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధి, సమస్యల సాధనకు నా వంతు కృషి చేస్తాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని